breaking news
purifiers
-
అది ‘పండోర బాక్స్’ తెరిచినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది. విలాసం కాదు.. అవసరం: పిటిషనర్ పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు. -
అదిరిపోయే గాడ్జెట్తో ఇంట్లో దుర్వాసనకు చెక్ పెట్టండిలా
ఇదో కొత్తతరహా ఎయిర్ప్యూరిఫయర్. మార్కెట్లో దొరికే మిగిలిన ఎయర్ప్యూరిఫయర్ల కంటే ఇది చాలా తేలిక. పోర్టబుల్ టేబుల్ఫ్యాన్ పరిమాణంలో ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట తేలికగా అమర్చుకోవచ్చు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ‘డాక్టర్ ఎయిర్పిక్’ పేరిట దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ పిక్సెల్రో కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని కార్బన్ మల్టీకంపోజిట్ ఫిల్టర్, ప్లాస్మా డీయాడరైజర్లు గాలిలోని దుమ్ము ధూళి, పొగ, సూక్ష్మజీవకణాలు వంటివి తొలగించడమే కాకుండా, పరిసరాల్లోని ఎలాంటి దుర్వాసననైనా నిమిషాల్లో మటుమాయం చేస్తాయి. దీని ధర 75 డాలర్లు (రూ.6,134) మాత్రమే! ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
గాలిని శుభ్రం చేసే ఈ డబుల్ ధమాకా గాడ్జెట్ గురించి మీకు తెలుసా
ఈ ఫొటోలో గోడకు ఏదో అమర్చినట్లు కనిపిస్తోంది కదూ! గోడకు ఏమీ అమర్చలేదు గాని, ప్లగ్లో పెట్టిన చిన్న సాధనమిది. ఇదొక డబుల్ ధమాకా పరికరం. దీనిని ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు, గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, దోమలనూ పారదోలుతుంది. ఈ ‘2022 ఎయిర్ ప్యూరిఫయర్స్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్’ పరికరాన్ని అమెరికన్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ‘కార్నర్షాప్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ప్యురిఫయర్ కమ్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్ పరికరం వివిధ దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్లోనూ దొరుకుతుంది. దీనిని ఆన్ చేశాక ప్రతి 40 సెకండ్లకు ఒకసారి కొద్దిసేపు దీని నుంచి సన్నని ధ్వని వెలువడుతుంది. ఈ పరికరం గాలిలోని దుర్వాసనను పోగొడుతుంది. గాలిలోని హానికరమైన జీవ రసాయనిక కణాలను తొలగిస్తుంది. -
ఓ యాప్.. పొల్యూషన్ గప్చుప్
సాక్షి, సిటీబ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం జన జీవనాన్ని కకావికలం చేస్తోంది. అక్కడి ప్రజలు వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విద్యాసంస్థలకుసెలవులిచ్చేశారు. ప్రజలు సైతం ఢిల్లీ నగరాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అంతటి తీవ్ర స్థాయిలో కాకున్నా.. హైదరాబాద్ నగరానికీ కాలుష్యం ముప్పు పొంచి ఉంది. దీని తీవ్రతను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబై, థానే, పుణే, గోవా నగరాల్లో మాదిరిగా ఔట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ప్యూరిఫైయర్స్ (ఓయాప్) ఏర్పాటు చేసే యోచనలో ఉంది. తొలి దశలో పైలట్గా నగరంలో రద్దీ కలి గిన, ఎక్కువ కాలుష్యం ఉండే.. ఎంపిక చేసిన వంద ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విష వాయువుల్ని పీల్చేస్తాయి.. కలుషిత వాతావరణంలో పీఎం 2.5, పీఎం 10, కార్బన్ మోనాక్సైడ్, వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ), హైడ్రో కార్బన్స్ వంటి విష వాయువులు మిళితమై ఉంటాయి. ఇవి తీవ్ర శ్వాస సంబంధ సమస్యలను కలుగజేస్తాయి. గాలిలోని ఈ విష వాయువుల్ని ‘ఓయాప్’లోని ప్యూరిఫైయర్స్ ఫిల్టర్ చేస్తాయి. తద్వారా గాలిలోని కాలుష్యం తీవ్రత తగ్గుతుంది. నగరంలో పెరుగుతున్న కాలుష్యం.. నగరంలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. భారీ భవన నిర్మాణాలతో మున్ముందు సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్లు, 30 – 40 అంతస్తుల ఆకాశహరŠామ్యల నిర్మాణాలతో కాలుష్య సమస్యలు పెరగనున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఆయువు తీస్తున్న విష వాయువులు.. వాయు కాలుష్యం శ్వాసకోశ సమస్యలను కలిగించడంతో పాటు ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న అంశాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో ఉందని ఇటీవలి ఒక అధ్యయనంలో గుర్తించారు. పోషణ లేమి, మద్యపానం వంటి వాటి వల్ల జరిగే మరణాల కంటే వాయు కాలుష్యం మూలంగా సంభవిస్తున్న మరణాలే ఎక్కువ. 2017లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల మనుషుల ఆయుర్ధాయం సగటున 20 నెలలు తగ్గినట్లు గుర్తించారు. అన్ని జోన్లలో ఏర్పాటు సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద తొలిదశలో జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో జోన్కు 13 చొప్పున మొత్తం వంద ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తాం. వెలువడే ఫలితాలు, పీసీబీ నివేదికలను పరిగణనలోకి తీసుకొని మలి దశలో ఈ యూనిట్ల సంఖ్యను 500కు పెంచే ఆలోచన ఉంది. రద్దీగా ఉండే మెట్రో, బస్సు, రైల్వే స్టేషన్లు, పెట్రోలుబంక్లు, ఇతర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. – హరిచందన దాసరి, అడిషనల్ కమిషనర్ (జీహెచ్ఎంసీ) నిర్వహణ బాధ్యత మాదే.. స్ట్రాటా ఎన్విరో కంపెనీకి చెందిన ఈ యూనిట్లను ఏర్పాటు చేసి.. నిర్వహిస్తాం. ఈ యూనిట్లపై ఏర్పాటుచేసే వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో నిర్వహణ చేస్తాం. ఇందుకు మేయర్, కమిషనర్ సూత్రప్రాయంగా అంగీకరించారు. పుణె, గోవా ఎయిర్పోర్ట్లతో సహా వివిధ నగరాల్లో ఇప్పటి వరకు 300కు పైగా ప్యూరిఫైయర్స్ ఏర్పాటు చేశాం. – సంజయ్ బహుగుణ (బహుగుణ టెక్నోమోటివ్స్) ఓయాప్ పనిచేస్తుందిలా.. ఐఓటీ ఇంటిగ్రేషన్ కంట్రోల్ ప్యానెల్ రిమోట్ ద్వారా ఓయాప్ సిస్టమ్ పని చేస్తుంది. ప్యూరిఫయర్ యూనిట్.. తన చుట్టూ 60 అడుగుల మేర వ్యాపించి ఉన్న విష వాయువులతో కూడిన గాలిని తన వైపు లాక్కుంటుంది. తొలుత యూనిట్లోని ఇన్లెట్లోకి విష వాయువులువెళ్తాయి. అందులోని ఫిల్ట్రేషన్ సిస్టమ్లో అవి ఫిల్టర్ కావడంతో విష వాయువుల తీవ్రత తగ్గుతుంది. అనంతరం అడుగున ఉండే ఎగ్జాస్టర్ ద్వారా గాలి బయటకు వస్తుంది. తద్వారా ప్యూరిఫయర్ యూనిట్ చుట్టూ గల 60 అడుగుల మేర ప్రాంతంలోని కాలుష్యం తీవ్రత తగ్గుతుంది. వీటి సామర్థ్యం 2000 సీఎఫ్ఎం (క్యూబిక్ ఫీట్ ఆఫ్ ఎయిర్ ఫర్ మినిట్). ఈ యూనిట్లు రోజూ సదరు ప్రాంతంలోని కాలుష్య స్థాయిల్ని కూడా నమోదు చేస్తాయి. ఒక్కో యూనిట్ ధర దాదాపు రూ.1.40 లక్షలు. వంద యూనిట్లకు రూ.1.40 కోట్లు ఖర్చు కానున్నాయి. ప్యూరిఫయర్స్ యూనిట్ పై భాగంలో వాణిజ్య, వ్యాపార ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. తద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటారు. -
మీరు ఆఫీసులో నీరు తాగుతున్నారా?
మీరు మా ఆఫీసులో సరఫరా చేసే మినరల్ వాటర్ తాగుతున్నారా? మీ వాటర్ ప్యూరిఫయర్ ను ఎన్నాళ్లకి ఓ సారి కడుగుతున్నారు? వాటర్ మంచి కంపెనీ నుంచే వచ్చి ఉండవచ్చు. కానీ వాటర్ ను తీసుకొచ్చే బబుల్స్ (ప్లాస్టిక్ సిలెండర్స్) ఎంత శుభ్రంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలను ఎప్పుడైనా వేసుకున్నారా? ముంబాయిలో ఈ మధ్యే కార్పొరేట్ ఆఫీసుల్లో తాగునీటి సరఫరా విధానంపై ఎం జీ ఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ విద్యార్థులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయన వివరాలు చూస్తే కళ్లు తేలవేయడం ఖాయం. ముంబాయిలోని 52 ప్రముఖ కార్పొరేట్ సంస్థలపై ఈ అధ్యయనం జరిగింది. మొత్తం కంపెనీల్లో 49 శాతం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్ ను ఏడాదికి ఒక్కసారే కడిగి శుభ్రం చేస్తారు. అంతే కాదు... ఉద్యోగుల్లో 92 శాతం మంది నీటి వల్ల కలిగే జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ కారణంగా చాలా మంది సెలవులు కూడా తీసుకోవలసి వచ్చింది. అన్నికంపెనీల్లోనూ నీటి సరఫరాను కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతోంది. అయితే వాటర్ జార్ల శుభ్రత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. వాటి నాణ్యతను పరీక్షించే ఏర్పాటు ఏ సంస్థలోనూ లేదు. మంచి బ్రాండ్ లను తీసుకుని వస్తున్నారు కానీ, వాటర్ జార్ల నాణ్యతను మాత్రం పరీక్షించడం జరగడం లేదు. దీని వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితంలో ఎక్కువకాలం గడిపేది ఆఫీసుల్లోనే కాబట్టి ఆఫీసుల్లో మంచి నీరు అందించడమే కాదు, వాటిని పట్టి నింపే జార్లు, కంటెయినర్లు కూడా శుభ్రంగా ఉండాలని ఈ అధ్యయనం తెలియచేస్తోంది. మరి.. మీ ఆఫీసులో ఎలా ఉంది?


