breaking news
Providence
-
ఇక వన్డే సమరం
బలహీనమైనదే అయినా అనూహ్యంగా చెలరేగే వెస్టిండీస్తో టీమిండియాకు మరో సవాల్. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ప్రావిడెన్స్ వేదికగా తొలి వన్డే. ఈ సిరీస్ నెగ్గి తమ దిగ్గజం క్రిస్ గేల్కు సగర్వంగా వీడ్కోలు పలకాలని కరీబియన్లు భావిస్తుండగా... లోపాలను సరిచేసుకుని పునర్ నిర్మాణ ప్రక్రియకు పునాదులు వేయాలని భావిస్తోంది భారత్. ఎవరి ప్రణాళికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ప్రావిడెన్స్ (గయానా): టి20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఊపులో... ప్రపంచ కప్ సెమీస్ నిష్క్రమణ గాయాన్ని మాపే ఆలోచనలో వెస్టిండీస్తో వన్డే సమరానికి సిద్ధమవుతోంది కోహ్లి సేన. పనిలో పనిగా వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సమర్థంగా భర్తీ చేయాలని; బ్యాటింగ్ ఆర్డర్లో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న నంబర్–4 స్థానానికి పరిష్కారం దొరకాలని ఆశిస్తోంది. కొంత క్లిష్టమే అయినా సత్తా మేరకు ఆడితే ఈ సిరీస్ సైతం మన సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. పరుగులు చేయడం అంత తేలికేం కాదని తెలుస్తోన్న ప్రావిడెన్స్ మైదానం పిచ్పై ఏ జట్టు నిలకడ చూపుతుందో వారికే విజయం దక్కనుంది. అక్కడ అతడే! వన్డే ప్రపంచ కప్ నుంచి గాయంతో వైదొలగిన ధావన్ తాజా టి20 సిరీస్లో ఆకట్టుకోలేకపోయాడు. తనకు మంచి రికార్డున్న వన్డేల్లో ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. అతడు ఫామ్ అందుకుని రోహిత్, కెప్టెన్ కోహ్లికి తోడైతే దిగులుండదు. అత్యంత చర్చనీయాంశమైన నంబర్–4 స్థానంలో కేఎల్ రాహుల్కే అవకాశం దక్కొచ్చు. ప్రపంచ కప్లో ప్రభావం చూపలేకున్నా కరీబియన్ పర్యటనకు తీసుకొచ్చారంటే కేదార్ జాదవ్పై టీం మేనేజ్మెంట్కు బాగా నమ్మకం ఉన్నట్లే. మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ రూపంలో మంచి బ్యాట్స్మెన్ ఉన్నా స్పిన్ కూడా వేయగలడు కాబట్టి జాదవ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. పరిస్ధితులను బట్టి పంత్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు దింపొచ్చు. స్పిన్ ఆల్రౌండర్గా జడేజా ఖాయం. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్ సంగతేమిటన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది. ప్రపంచ కప్లో రాణించకపోవడంతో టి20 సిరీస్కు ఇద్దరినీ పక్కన పెట్టారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో విండీస్తో వన్డే సిరీస్ వీరికి సవాల్తో కూడుకున్నది. మెరుగైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నందున... ఈసారీ విఫలమైతే ‘కుల్చా’ ద్వయానికి దారులు మూసుకుపోయినట్లే. ప్రత్యర్థి స్పిన్ ఆడటంలో తడబడుతుంది కాబట్టి తొలి వన్డేలో ఇద్దరికీ చోటుండొచ్చు. మూడో పేసర్ అవసరం అనుకుంటే ఒకరిని పక్కనబెట్టే వీలుంది. కుడి ఎడమ సమీకరణాల ప్రకారం కుల్దీప్ను తప్పిస్తే ఖలీల్ అహ్మద్కు, చహల్ వద్దనుకుంటే నవదీప్ సైనీ బరిలో దిగుతారు. బ్యాటింగ్లో టాపార్డర్ పరుగులు చేసి, మంచి లయలో ఉన్న భువనేశ్వర్, షమీలు విండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తే టీమిండియా గెలుపునకు బాటలు పడతాయి. టి20ల్లో తుస్... వన్డేల్లో? ప్రపంచ చాంపియనే అయినప్పటికీ టి20 సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్లో వెస్టిండీస్ పేలవ ప్రదర్శన కనబర్చింది. వన్డేలకు వచ్చేసరికి మార్పులతో జట్టు బలంగా ఉంది. ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ సారథ్యం, గేల్ వంటి బ్యాట్స్మన్ అందుబాటులో ఉండటం, నిలకడగా ఆడే షై హోప్, రోస్టన్ చేజ్ చేరికే దీనికి కారణం. యువ హిట్టర్లు పూరన్, హెట్మైర్ ప్రమాదకారులు. పేసర్లు కాట్రెల్, ఒషాన్ థామస్ పటిష్టమైన టీమిండియా టాపార్డర్ను ఎంతమేరకు కట్టడి చేస్తారో చూడాలి. తుదిజట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, జాదవ్, పంత్, జడేజా, కుల్దీప్/ఖలీల్, చహల్/సైనీ, భువనేశ్వర్, షమీ వెస్టిండీస్: గేల్, లూయిస్/జాన్ క్యాంప్బెల్, హోప్, హెట్మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్ (కెప్టెన్), కీమో పాల్, రోచ్/థామస్, కాట్రెల్, అలెన్ గేల్ ఎలా ఆడతాడో... భారత్తో వన్డే సిరీస్ తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్న విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్పై అందరి చూపు నిలిచింది. ప్రపంచ కప్లో అలరించలేకపోయిన గేల్... ఈ సిరీస్లో రాణించి కెరీర్కు ఘన వీడ్కోలు పలకాలని భావిస్తుండొచ్చు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం టొరంటో వేదికగా భారత్పైనే అరంగేట్రం చేసిన గేల్... 298 వన్డేల్లో 10,393 పరుగులు చేశాడు. మరో 12 పరుగులు చేస్తే దిగ్గజ బ్రయాన్ లారా (10,405)ను అధిగమించి వెస్టిండీస్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలుస్తాడు. 300 వన్డేలు ఆడిన క్రికెటర్గానూ రికార్డులకెక్కనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్లో పర్యటించిన ఇంగ్లండ్పై అతడు 135, 50, 162, 77 పరుగులు చేశాడు. దీని ప్రకారం సొంతగడ్డపై అతడిని ఆపడం చాలా కష్టమని తెలిసిపోతుంది. మరి.. గేల్ ఏం చేస్తాడో? భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు 127 వన్డేలు జరిగాయి. 60 మ్యాచ్ల్లో భారత్ నెగ్గగా... 62 మ్యాచ్ల్లో వెస్టిండీస్ను విజయం వరించింది. రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. వెస్టిండీస్ గడ్డపై ఆ జట్టుతో భారత్ ఇప్పటివరకు 36 మ్యాచ్లు ఆడింది. 14 మ్యాచ్ల్లో గెలిచి, 20 ఓడింది. రెండు మ్యాచ్లు రద్దయ్యాయి. 2017లో విండీస్లో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 3–1తో గెల్చుకుంది. మరో మ్యాచ్ రద్దయింది. -
సైబరాబాద్ /2
విభజన ఉత్తర్వులు జారీ కొత్త కమిషనర్లుగా నవీన్చంద్, భగవత్ ఖరారు? 14 ఏళ్లలో నలుగురు కమిషనర్లు.. సిటీబ్యూరో: విస్తరిస్తున్న ఐటీ రంగం, పాలనా పరమైన సౌలభ్యం కోసం 2002లో ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోయింది. దీన్ని ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సైబరాబాద్కు మహేందర్రెడ్డి తొలి, సీవీ ఆనంద్ తుది కమిషనర్లుగా సేవలందించారు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో నలుగురు ఐపీఎస్ అధికారులు పోలీసు కమిషనర్లుగా పనిచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి, జనాభా పెరుగుదలతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేసిన ప్రాంతాలతో 2002 నవంబర్ 15న ‘సైబరాబాద్ కమిషనరేట్’ను (ఐటీ పరిశ్రమల వల్ల ఈ పేరు వచ్చింది) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003 ఫిబ్రవరిలో తొలి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్డివిజన్లు ఉండగా, వీటిలో ఐదు బాలానగర్, మల్కాజిగిరి, సరూర్నగర్, రాజేంద్రనగర్, అల్వాల్ డివిజన్ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో కలిపారు. ఈ డివిజన్ల పరిధిలో 34 పోలీసు స్టేషన్లు ఉండేవి. అయితే 19 ఠాణాలతో కూడిన వికారాబాద్ డివిజన్ను రంగారెడ్డి జిల్లా రూరల్గా మార్చి ఎస్పీ అధికారిని నియమించారు. స్వరూపం మారుతూ.. మహేందర్ రెడ్డి డీఐజీ హోదాలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో కమిషనర్ పోస్టును ఐజీ హోదాకు అప్గ్రేడ్ చేశారు. ఆ సమయంలో పదోన్నతి రావడంతో మహేందర్ రెడ్డిని కొనసాగించారు. కమిషనరేట్ పరిధి పెంచేందుకు 2004లో ఎల్బీనగర్, అల్వాల్, బాలానగర్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటికి డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. అలాగే ఒక క్రైమ్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీని కూడా నియమించారు. 2006-07లో ఐదు డివిజన్లకు తోడు మరో నాలుగు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. 2011-12లో రెండు డివిజన్లు కొత్తవి ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 11 డివిజన్లకు చేరింది. 2013లో శంషాబాద్, మాదాపూర్ జోన్లను ఏర్పాటు చేసి కమిషనరేట్ పరిధిని మరింత పెంచారు. అదే సమయంలో జాయింట్ సీపీ పోస్టును కూడా మంజూరు చేశారు. ఠాణాల పెంపు ఇలా: సైబరాబాద్ కమిషనరేట్లో 2003లో 36 ఠాణాలు ఉండగా, 2007లో మరో నాలుగు ఠాణాలు ఏర్పాటయ్యాయి. 2012-13లో మీర్పేట, చైతన్యపురి, పేట్ బషీరాబాద్, మియాపూర్ ఠాణాలు, 2014 చివర్లో జవహర్నగర్, జగద్గిరిగుట్ట, 2015 జనవరిలో ఆదిభట్ల ఠాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ స్టేషన్ల సంఖ్య 45కు, ట్రాఫిక్ ఠాణాలు 12కు చేరాయి. సైబరాబాద్కు తొలి కమిషనర్గా డీఐజీ హోదాలో మహేందర్రెడ్డి, ఆఖరి కమిషనర్గా అదనపు డీజీ హోదాలో సీవీ ఆనంద్ పనిచేశారు.