breaking news
Professional Education Courses
-
బీఎడ్లో ఫీజుల మోత
* కనీస ఫీజు రూ.16 వేలు, గరిష్ట ఫీజు రూ.31 వేలు * కాలేజీల ఆదాయ, వ్యయాల ఆధారంగా నిర్ధారించిన ఏఎఫ్ఆర్సీ * ప్రభుత్వ అనుమతి రాగానే అమల్లోకి.. * ఇక అన్ని వృత్తివిద్యా కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సు బీఎడ్ ఫీజులను పెంచుతూ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయం తీసుకుంది. 222 ప్రైవేటు బీఎడ్ కాలేజీల్లో వచ్చే మూడేళ్ల పాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) వసూలు చేయాల్సిన ఫీజులను గురువారం ఖరారు చేసింది. ఇప్పటివరకూ కామన్గా రూ.13,500గా ఉన్న వార్షిక ఫీజును... కాలేజీల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా కనిష్టంగా రూ.16 వేల నుంచి.. గరిష్టంగా రూ. 31వేల వరకు పెంచింది. ఒక కాలేజీకి మాత్రమే రూ.31 వేల గరిష్ట ఫీజు నిర్ణయించినట్లు తెలిసింది. మరో 15 వరకు కాలేజీల్లో రూ.30 వేలు, పదికిపైగా కాలేజీల్లో కనీస ఫీజు అయిన రూ.16 వేలను వార్షిక ఫీజుగా నిర్ణయించింది. మిగతా కాలేజీల్లో రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. ఇక మిగతా వృత్తి విద్యా కోర్సులకు కూడా కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలని... ఇప్పటివరకు కొనసాగిన కామన్ ఫీజు విధానాన్ని రద్దు చేయాలని ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. దీంతోపాటు ఇంజనీరింగ్ సహా అన్ని కోర్సుల్లో కనీస, గరిష్ట ఫీజుల విధానం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకూ రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రూ.35 వేలుగా ఉన్న కనీస ఫీజును రూ.45 వేలకు... రూ.1,13,500గా ఉన్న గరిష్ట ఫీజును రూ.2 లక్షలకుపైగా నిర్ధారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏఎఫ్ఆర్సీ తమకు అందిన ఫీజుల పెంపు ప్రతిపాదనల్లో శాస్త్రీయత, ఇతర లోపాలపై ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకుంది. పెరిగే ఫీజులు భరించాల్సింది విద్యార్థులే? కాలేజీల ఆదాయ, వ్యయాలను బట్టి ఈసారి అన్ని వృత్తి విద్యా కోర్సుల ఫీజుల్లో 15 శాతానికిపైగా పెరుగుదల ఉండే అవకాశముంది. ఆదాయ, వ్యయాల ప్రకారం ఫీజుల పెంపునకు ఏఎఫ్ఆర్సీ సిఫారసు చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అంశంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫీజులు పెరిగినప్పటికీ ఇప్పటివరకు ఉన్న కామన్ ఫీజు మొత్తాన్నే ఫీజు రీయింబర్స్మెంట్గా ఇచ్చే అవకాశముందని... మిగతా ఫీజు మొత్తాన్ని విద్యార్థులే భరించాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన ప్రకారం ఇప్పటివరకు వివిధ కోర్సుల్లో టాప్ 10 వేల మంది ర్యాంకర్లకు (ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా రీయింబర్స్మెంట్ ఉంది) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని టాప్ 5 వేల ర్యాంకులకు తగ్గించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
వృత్తి విద్యా కోర్సులకు ఏదీ గుర్తింపు!?
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు సంబంధిత అధీకృత యూనివర్సిటీల నుంచి గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ కళాశాలలు కూడా గుర్తింపు లేకుండా కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నారు. కోర్సులు నిర్వహిస్తున్నది ప్రభుత్వ కళాశాలలే కావడం వల్ల విద్యార్థులకు కూడా ఎటువంటి అనుమానాలు రావడం లేదు. వాస్తవానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఎచ్చెర్ల: వృత్తి విద్యా కోర్సులు నిర్వహించాలంటే సంబంధిత అధీకృత సంస్థల గుర్తింపు అవసరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఈ గుర్తింపులు ప్రస్తుతం కొన్ని కోర్సులకు సమస్యలుగా మారుతున్నాయి. కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. అధీకృత సంస్థలు నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలంటే ఆ మేరకు వసతులు, బోధకులు, ల్యాబ్స్, లైబ్రరీలు అవసరం. అప్పుడే కోర్సులు బలోపేతం అవుతాయి. మరో పక్క అధీకృత సంస్థల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎల్ఎల్బీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. అయితే ప్రభుత్వ సంస్థ కావడంలో కోర్సును కొనసాగిస్తున్నారు. వర్సిటీ ఏర్పడిన తరువాత బీసీఐ బృందం వచ్చినా ఇక్కడ అమలు చేస్తున్న నిబంధనలు నేపథ్యంలో గుర్తింపు ఇవ్వలేదు. 60 సీట్లు ఉన్న ఈ కోర్సు బలోపేతం చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవ లసి ఉంది. ఎల్ఎల్బీ కోర్సును పక్కాగా నిర్వహిస్తేనే బీసీఐ గుర్తింపు ఇస్తుంది. ప్రత్యేక కళాశాల, తరగతి గదులు, మూట్ కోర్టు, గ్రంథాలయం, అర్హతగల బోధకులు ప్రిన్సిపాల్ ఇలా అనేక వసతులు ఉండాలి. వర్సిటీ ఏర్పడక ముందు నుంచి ఏయూ పీజీ సెంటర్గా ఉన్నప్పటి నుంచే బీసీఐ గుర్తింపు లేదు. ప్రస్తుతం ఈ గుర్తింపు కోసం వర్సిటీ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీఐ బృందం త్వరలో వర్సిటీకి రానుంది. ఈ సారి గుర్తింపు వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే... ఎంఎడ్: ఎంఎడ్ కోర్సుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తింపు ఇవ్వాలి. ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. పక్కాగా భవనాలు, బోధకులు, ప్రత్యేక గ్రంథాలయం ఉంది. బృందం సభ్యులు వచ్చినపుడు కామన్ లైబ్రరీ, ల్యాబ్స్ చూపిస్తున్నారు తప్ప, ఎన్సీటీఈ సంస్థ నిబంధనల మేరకు కోర్సు నిర్వహణకు డిజైన్ మాత్రం చేయడం లేదు. బీఎడ్ (మెంటల్లీ రిటార్డెడ్): ఈ కోర్సుకు గత ఏడాది మౌలిక వసతుల కొరత, అర్హులైన బోధకులు లేకపోవడం వల్ల రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్మిషన్లు రద్దు చేసింది. 2009లో ప్రారంభమైన కోర్సును 2015లో నిర్వహించలేదు. ఇటీవల మళ్లీ ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త భవనాలతో పాటు కొత్తగా అవసరమైన మానసిక శాస్త్రవేత్తలతో పాటు ఇతర పోస్టులను అవసరం మేరకు నియమించారు. గతంలో ఈ కోర్సును ముగ్గురు బోధకులతో నెట్టుకువచ్చేవారు. కోర్సు రద్దయిన నేపథ్యంలో బోధకునిగా కొన సాగుతున్న విశ్రాంత ఉద్యోగి డాక్టర్ యండ్ల రవికుమార్ను తొలగించారు. మరో ఇద్దరు సూ ర్యకళ, లలిత కుమారిలను మాత్రం కొనసాగించారు. ప్రస్తుతం ఈ కమిటీ సభ్యులు అనుమతి ఇస్తేనే ఈ ఏడాది రెండేళ్ల కోర్సు మళ్లీ పునర్ప్రారంభం అవుతుంది. మరో పక్క బీసీఐ, ఆర్సీఐ రెండూ ఢిల్లీకి చెందిన సంస్థలు కావడంతో పక్కాగా నిబంధనలు పరిశీలిస్తున్నారు. దక్షణాది సంస్థలు మాత్రం ప్రభుత్వ యూనివర్సిటీలు కావడంతో అంతగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం గుర్తుంపులకు ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకులు లేక పోవడంగా నిష్ణాతులు చెబుతున్నారు. అర్హులైన బోధకులు కావాలంటే రెగ్యులర్ నియామకాలు కీలకం అన్నది చాలా మంది అభిప్రాయం. ఎల్ఎల్బీ కోర్సు గుర్తింపునకు కృషి ప్రస్తుతం ఎల్ఎల్బీ కోర్సుకు గుర్తింపు కోసం కృషిచేస్తున్నాం. బీసీఐ నిబంధనల మేరకు మౌలిక వసతు లు సమకూర్చడం, బోధకుల నియామకాన్ని అధికారులు చేపట్టారు. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండదు. త్వర లో బీసీఐ బృందం పర్యవేక్షణ చేయనుంది. - డాక్టర్ కె.కృష్ణమూర్తి, సమన్వయకర్త, ఎల్ఎల్బీ కోర్సుల బలోపేతానికి గుర్తింపు అవసరం వర్సిటీలో నిర్వహిస్తున్న కోర్సులకు సంబంధిత అధీకృత సంస్థల నుంచి రావలసిన గుర్తింపుల కోసం కృషిచేస్తున్నాం. కోర్సులు బలోపేతం కావాలంటే గుర్తింపులు అవసరం. ప్రస్తుతం పక్కా భవనాలు నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో వసతి కొరత ఉండదు. మరో పక్క రెగ్యులర్ బోధకుల నియామకం జరిగితే శాశ్వితంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్, రిజిస్ట్రార్ కోర్సు : గుర్తింపు ఇవ్వవలసిన సంస్థ ఎల్ఎల్బీ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంఎడ్ : నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బీఎడ్ : రీహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (మెంటల్లీ రిటార్డెడ్)