breaking news
Primary Co-operative Society
-
నేనే రాజు.. నేనే బంటు
సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నిస్వార్థ రాజకీయాలకు ఆయనో ఐకాన్. రాజకీయాల్లో ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేశారు. ఆ తర్వాత ఎంతో నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఆయనే పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన కాటంరెడ్డి రామారావు. ఒకప్పుడు పోడూరు మండలం జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. సొసైటీ పరిధిలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడులు అందించి వారి అభివృద్ధికి కృషి చేశారు. నేడు పాలకొల్లులో దిగమర్రు కాలువ గట్టున సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్నారు. 1938లో కాటంరెడ్డి రామారావు ఉల్లంపర్రులో జన్మించారు. 1952లో కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై పార్టీ కార్యకర్తగా చేరారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో 1989లో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అప్పట్లో జరిగిన జిన్నూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందిన కొప్పర్తి సూర్యం సొసైటీ అధ్యక్షుడు ఎన్నికకాబడిన సమయంలో కాటంరెడ్డి రామారావును ఉపాధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. ఆ విధంగా మూడు సార్లు సొసైటీ ఉపాధ్యక్షుడిగా, 1985–86లో జిన్నూరు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికై రైతులకు సేవలందించారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో పనిచేస్తున్నారు. రామారావుకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారికి వివాహాలు చేశారు. ప్రస్తుతం సైకిల్ మెకానిక్గా కుటుంబ భారాన్ని మోస్తున్నారు. రాజకీయాల్లో ఎకరం పొలం అమ్ముకున్నా నా 67 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల సమస్యలపై పోరాటమే తప్ప ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని నా స్వార్థం కోసం వినియోగించుకోలేదు. రాజకీయాల్లో తిరిగి ఎకరం పొలం అమ్ముకున్నా. జిన్నూరు సొసైటీకి అధ్యక్షుడుగా పనిచేసి రైతులకు ఉపయోగపడ్డాననే సంతృప్తి కలిగింది. ఉల్లంపర్రులో పేదలకు 40 మందికి ఆ రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించాను. ఏ వ్యక్తైనా ఎదుట వారికి ఉపయోగపడాలి. వృద్ధాప్యంలో కుటుంబ పోషణ కోసం సైకిల్ మెకానిక్గా పని చేస్తున్నా. –కాటంరెడ్డి రామారావు, ఉల్లంపర్రు -
రుణాల స్వాహాపై విచారణ
నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి పీఏసీఎస్లో అక్రమాలపై ఆరా నర్సీపట్నం టౌన్ : ఆంధ్రా బ్యాంకు, ప్రాథమిక స హకార సంఘంలో జరిగిన అక్రమాలపై ఆర్డీవో కె.సూర్యారావు శుక్రవారం విచారణ నిర్వహించారు. ఆం ధ్రా బ్యాంక్ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి తనయుడు కుమ్మక్కై రైతు రుణాల పేరిట కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిని గతంలోనే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇందుకు పాల్పడిన బ్యాంకు మేనేజర్ బదిలీ కావడం, కొత్తగా వచ్చిన మేనేజర్ అక్రమాలపై దృష్టిసారించి సంబంధిత వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ అక్రమాలపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నర్సీపట్నం ఆంధ్రా బ్యాంకు, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సంఘంలో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోటవురట్ల మండలం రాజుపేట సర్పంచ్ తనయుడు సూరిశెట్టి గంగాధర్ (బ్రాంచ్ పోస్టుమాస్టర్), భార్య సత్య సుజాత (అంగన్వాడీ సూపర్వైజర్) ఆంధ్రా బ్యాంక్ పాత మేనేజర్ ఆడమ్రాజు, ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్రెడ్డి కుమ్మక్కై 152 మంది రైతుల రుణాల పేరిట రూ.38 లక్షలు కాజేశారని ప్రచారంలో ఉంది. దీంతో కొత్తగా వచ్చిన మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఈ వ్యవహారాన్ని బయటకు తీశారు. పై నలుగురిపై ఆయన ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా, చెట్టుపల్లి ప్రాథమిక సహకార సొసైటీలో రైతులకు తెలియకుండా సొసైటీ కార్యదర్శి పిట్టా చలపతి రూ.లక్షలు స్వాహా చేశాడు. దీనిపై కూడా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ యువరాజ్ ఆదేశాలతో శుక్రవారం ఆర్డీవో కె.సూర్యారావు విచారణ చేపట్టారు. జరిగిన అక్రమాలపై అధికారుల సమాధానాలను, బాధితుల వ్యాజ్యాలను డెప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, తహశీల్దార్ పార్వతీశ్వరరావు రికార్డు చేశారు. లోన్ల వ్యవహారంలో రుణమాఫీ పొందే అవకాశం ఏ మేరకు ఉంది, రుణమాఫీ ఆశించి కుంభకోణం జరిగిందా అనే విషయాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారని ఆర్డీవో తెలిపారు. అప్పటి బ్యాంక్ మేనేజర్ ఎం.ఆడమ్రాజు, అప్పటి గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్రెడ్డి, గంగాధర్ శ్రీనివాస్, సత్య సుజాత ఈ వ్యవహారానికి పాల్పడినట్టు బ్యాంక్ మేనేజర్ జయంతి శ్రీనివాసరావు ఆర్డీవోకు వివరించారు. ఈ అంశంపై బ్యాంకు జోనల్ అధికారులు తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను బదిలీ చేశారని, గంగధార్ శ్రీనివాస్, అతని భార్య సత్యసుజాత, సహకరించిన అధికారులపై పోలీసు కేసు నమోదు చేసినట్టు ఆర్డీవోకు తెలిపారు. చెట్టుపల్లి సొసైటీలో కూడా విచారణ చేపట్టి అధికారులు, బాధితుల నుంచి వివరాలు నమోదు చేశారు.