breaking news
Pre-planning
-
తెల్ల‘బంగారం’పైనే ఆశలు
గజ్వేల్: తీవ్ర వర్షాభావం నెలకొన్న వేళ.. పంటలన్నీ ఆగమై కునారిల్లుతున్న మెతుకుసీమ రైతు కాస్తోకూస్తో.. తెల్ల‘బంగారం’పై ఆశలు పెట్టుకున్నాడు.. జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తి మరో వారం తర్వాత మార్కెట్ బాట పట్టే అవకాశమున్నది. అధికార యంత్రాంగం గిట్టుబాటు ధర అందించే విషయంలో ముందస్తు ప్రణాళికతో ముందుకుసాగితే తప్పా రైతులకు మేలు చేకూరే అవకాశం లేదు. గతేడాది ఇబ్బడిముబ్బడిగా నిల్వలున్నా సీసీఐ కేంద్రాలు సక్రమంగా నడవక రైతులు వ్యాపారులను ఆశ్రయించి అతితక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకున్నారు. ఈ విధంగా కొనుగోలు చేసిన ఉత్పత్తులను మాత్రం వ్యాపారులు రైతుల ‘అవతారం’లో అమ్ముకొని లాభపడ్డారు. ఫలితంగా రైతులకు ధర రూపేణా కోట్లల్లో నష్టం జరిగింది. ఈసారైనా చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ‘గిట్టుబాటు’ అందించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.. జిల్లాలో ఈసారి పత్తి 1.20 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చి ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు ఈ పంటపై ‘మమకారం’ ప్రదర్శించారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేకపోవడంవల్ల ఈ పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్కోరైతు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు చెడగొట్టి వేసుకోవాల్సి వచ్చింది. విత్తనాలు, ఇతర పెట్టుబడులు రూపంలో అప్పటికే కోట్లల్లో నష్టం జరిగిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్లలో కురిసిన వర్షాలకు నల్లరేగడి భూముల్లో పంటలు కోలుకున్నాయి. చెలక నేలల్లో మాత్రం పంట భారీగా దెబ్బతిన్నది. మొత్తానికి జిల్లావ్యాప్తంగా పంట దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపింది. చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ఈసారి ‘గిట్టుబాటు’ అందుతుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో పది రోజుల తర్వాత ఉత్పత్తులు మార్కెట్ బాటపట్టే అవకాశముండగా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు చేపడితే తప్పా రైతులకు లాభం జరిగే అవకాశంలేదు. ఈసారి మద్దతు ధరను రైతులు 5వేల వరకు ఆశిస్తే ప్రభుత్వం గతేడాది ఉన్న మద్దతు ధర రూ.3750-4050కు స్వల్పంగా మరో రూ.50మాత్రమే పెంచింది. ఈ లెక్కన ఈసారి రూ.3800-4100 ధర వర్తిస్తుంది. గతేడాది చోటుచేసుకున్న చేదు అనుభవాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. గతేడాది ఇలా.... జిల్లాలోని గజ్వేల్, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సక్రమంగా నడవక ప్రకటించిన మద్దతు ధర రూ.4050కూడా ఎక్కడా అందలేదు. సీసీఐ నిర్ణయాన్ని అదునుగా భావించిన వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు బందవుతాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించగా ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ట్రేడర్లు ధర అత్యల్పంగా రూ.3500-3800వరకు మాత్రమే చెల్లించారు. ఇకపోతే రైతుల రూపంలో వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులను అమ్ముకొని లక్షల రూపాయల మార్కెట్ ఫీజును ఎగ్గొట్టారు. ఈ వ్యవహారాన్ని గతేడాది ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెల్సిందే. సీసీఐ కమర్షియల్ పర్చేజ్ చేపడితేనే మేలు... ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ మార్కెట్లో అధిక రేటు వస్తే.. సీసీఐ స్పందించి వ్యాపారులకు ధీటుగా కమర్షియల్ దిగాల్సిన అవసరమున్నది. 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మార్కెట్లో ఇదే రకమైన పరిస్థితులు ఉత్పన్నమైన తరుణంలో మద్దతు ధరతో ప్రమేయంలేకుండా సీసీఐ కూడా కమర్షియల్ పర్చేజ్కు దిగింది. సీసీఐ అప్పట్లో క్వింటాలుకు గరిష్టంగా రూ.6,900 వరకు ధరను రైతులకు చెల్లించింది. సీసీఐ ఈసారి కూడా అదే తరహాలో స్పందిస్తే ప్రయోజనం కలిగే అవకాశమున్నది. గుర్తింపు కార్డుల విధానం అమలుపై ఆశలు పత్తి కొనుగోళ్లల్లో మధ్య దళారుల ప్రమేయాన్ని అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా పత్తి రైతులకు ‘గుర్తింపు కార్డుల’ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. రెవెన్యూ, వ్యవసాయశాఖలు కసరత్తును ప్రారంభించాయి. పత్తిని ఉత్పతి చేసి మార్కెట్ కమిటీలకు అమ్మకాల కోసం వచ్చే రైతులకు గుర్తింపు కార్డులు, ఇందులో బార్కోడింగ్ నెంబర్ ఇవ్వనున్నారు. ఈ కార్డు ఉన్న రైతులకు మాత్రమే మద్ధతుధర అందుతుంది. ఈ కార్డుతో రైతు ఎక్కడైనా తన ఉత్పత్తులను అమ్ముకొని మద్దతు ధర పొందే వీలుంది. -
అటెన్షన్ ప్లీజ్
2004 కృష్ణా పుష్కరాల్లో ఐదుగురు మృతి గోదావరి పుష్కరాల్లో 27మంది దుర్మరణం ఆ అనుభవాలతో పాఠాలు నేర్వండి కృష్ణా పుష్కర ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళిక అవసరం ప్రజాప్రతినిధులు, అధికారులూ ఇప్పుడే మేల్కోండి పరమ పవిత్రమైన పుష్కరస్నానం పాపాలు తొలగించే పుణ్యయాత్ర కావాలి గానీ.. చిన్నచిన్న మానవ తప్పి దాలకు కన్నీటి యాత్రగా మిగిలిపోకూడదు. గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుణపాఠంగా నేర్చుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. కోట్లలో ఖర్చు చూపించి ప్రచారం ఆర్భాటంగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు సమన్వయంతో సౌకర్యాలు కల్పిస్తేనే పుష్కరాలు విజయవంతమవుతాయన్నది సత్యం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలపై ‘సాక్షి’ కథనం.. విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల్లో తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా 27మంది భక్తుల ప్రాణాలు పోయాయి. మానవ తప్పిదంతో పాటు ప్రచార ఆర్భాటం.. సౌకర్యాల లేమి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో కృష్ణానదికి పుష్కరాలు జరగనున్నాయి. నూతన రాజధానిలో జరిగే తొలి పుష్కరాలు కావడంతో భారీ అంచనాలే ఉంటాయి. కాబట్టి అధికారులు స్పందించి ఇప్పటి నుంచే కృష్ణా పుష్కర ఏర్పాట్లపై దృష్టిసారిస్తే బాగుంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ దుర్ఘటనను మరిచిపోకండి 2004వ సంవత్సరంలో జరిగిన కృష్ణా పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ఐదుగురు చనిపోయారు. తొలిరోజు తెల్లవారుజామునే కృష్ణానది అప్రాన్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 15మంది గాయాలపాలయ్యారు. దీంతో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే స్పందించి రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని కృష్ణా పుష్కరాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుర్గాఘాటే కీలకం సుమా.. కృష్ణా పుష్కరాలకు దుర్గాఘాటే కీలకం. ఇంద్రకీలాద్రి దిగువనే ఉన్న ఈ ఘాట్లో స్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీంతో ఘాట్కు రోజూ లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దుర్గాఘాట్తో పాటు భవానీ, పున్నమి, పద్మావతి, సీతమ్మవారి పాదాల ఘాట్లను ఇప్పటినుంచే అభివృద్ధి చేయడం ప్రారంభించాలి. చివరి నిమిషంలో పనులు తల పెడితే తూతూమంత్రంగా ముగించే అవకాశం ఉంది. ఇక పనులు ప్రారంభించాలి ►ప్రతి ఘాట్లోనూ రోజూ కనీసం 10వేల నుంచి 25వేల మంది భక్తులు పుణ్యసాన్నాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఘాట్లలో సౌకర్యాలు కల్పించడం తప్పనిసరైన విషయం. ► వీఐపీలు వారికి కేటాయించిన ఘాట్లలోనే స్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ► ఘాట్ల వద్ద ఒకేసారి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరగకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటుచేసి భక్తుల్ని క్రమపద్ధతిలో నదిలో వదిలేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ► వృద్ధులు, వికలాంగులు, చిన్నారులు నదిలో దిగి ప్రమాదాలకు గురికాకుండా జల్లు సాన్నాలు ప్రతి స్నాన ఘట్టంలోనూ కనీసం వంద చొప్పున ఏర్పాటు చేయాలి. నదిలోకి వెళ్లి స్నానం చేద్దామనే వికలాంగుల కోసం ర్యాంపులు అవసరం. ►మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మొబైల్ టాయిలెట్లు ఒక్కో ఘాట్లోనూ కనీసం 50 చొప్పున ఏర్పాటుచేయాలి. ఘాట్లలో తాగేందుకు మంచినీటి పంపులు సిద్ధం చేయాలి. ►ఇక విద్యుత్ సదుపాయాలు, జనరేటర్లు, క్యూలైన్లు ఇప్పటి నుంచే ప్రారంభిస్తే నాణ్యతతో కూడిన ఏర్పాట్లు భక్తులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ► ఘాట్లు లేని ప్రదేశాల్లో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రయత్నించకుండా నో ఎంట్రీ బోర్డులు సిద్ధం చేయాలి. అప్రాన్ వంటి ప్రదేశాల్లో స్నానాలకు దిగినప్పుడు, నదిలో సుడిగుండాలు ఉన్న ప్రదేశాలను ఇప్పటినుంచే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. భక్తులను హెచ్చరించాలి. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు కీలకం కృష్ణానదిలో స్నానాలు చేసిన భక్తులు ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైన కీలక ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలి. ►దర్శనం కోసం వచ్చే వారికోసం ఐదువరసల క్యూలు ఏర్పాటుచేయాలి. ►దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం తీసుకునే సౌకర్యం కల్పించాలి. ►దుర్గాఘాట్ నుంచి వచ్చే భక్తులు కొండపైకి చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు అడ్డుకాకుండా చూడాలి. ►ఉచిత భోజనం వద్ద తొక్కిసలాట జరగకుండా చూడాలి. ఈ జాగ్రత్తలు అవసరం దేశం నలుమూలల నుంచి కనీసం 50లక్షల మంది భక్తులు కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే, బస్స్టేషన్ల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం ఉత్తమం. రైల్వే, బస్సు ప్లాట్ఫాంలపై వేలసంఖ్యలో భక్తులు నిలిచిపోతారు. తొక్కిసలాట జరగకుండా ప్లాట్ఫాంలను విస్తరించాలి. లేదా ప్రయాణికులను వేర్వేరు ప్రాంతాల్లో దిగేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారుచేయాలి. ఠపోలీస్ సిబ్బందిని ఎక్కడెక్కడ నియమించాలి, భక్తులకు ఏయే సలహాలు ఇవ్వాలి, సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటుచేయాలి.. వంటి విషయాలను ఇప్పటినుంచే కూలంకషంగా చర్చించుకోవడం ఉత్తమం.ప్రత్యేక రైళ్లు, బస్సుల సమాచారాన్ని పుష్కర ఘాట్ల వద్ద, ఇంద్రకీలాద్రి వద్ద, నగరంలోని ముఖ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి.దుర్గాఘాట్ ఒక్కటే కాకుండా అన్ని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేలా ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి. ముందస్తు ప్రణాళిక అవసరం ఏ కార్యక్రమానికైనా సరే ముందస్తు ప్రణాళిక, దాని అమలు అవసరం. మొదటి రోజే కాదు.. 12 రోజులూ పవిత్రమైన రోజులేనని, నది ప్రారంభమైన ప్రాంతం నుంచి చివరి వరకు అంతా పవిత్రమైన ప్రాంతమేనని ప్రచారం చేయాలి. అధికార యంత్రాంగం కూడా పెద్దలు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. - డాక్టర్ ఎంసీ దాస్, విద్యావేత్త, విశ్లేషకుడు రెండు సమావేశాలు నిర్వహించాం.. కృష్ణా పుష్కరాల విజయవంతం కోసం ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. దుర్గాఘాట్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వెయ్యిమందికి జల్లు స్నానాలు, పిండ ప్రదానాలకు వేరే ఏర్పాట్లు చేస్తాం. 50 బాత్రూమ్లు, 50 లెట్రిన్స్ అదనంగా ఉంటాయి. ఘాట్రోడ్డులో ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేస్తాం. కొండపైకి రాలేని భక్తుల కోసం ఐదు ఘాట్లలో అమ్మవారి, అయ్యవారి నమూనా దేవాలయాలు ఏర్పాటుచేస్తాం. మూడు షిప్టులలో అర్చకులు, గుమస్తాలను ఏర్పాటుచేసి ప్రసాదాలు విక్రయిస్తాం. - సీహెచ్ నర్సింగరావు, దుర్గగుడి ఈవో