breaking news
power industry
-
స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో ప్రమాదం
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఎయిర్ బాయిలర్ పేలిపోయింది. ఇద్దరు కార్మికులకు గాయాలయినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముడి ఐరన్ తయారీలో భాగంగా పలు రకాల ముడి ఖనిజాలను ఎయిర్ బాయిలర్లో వేసి, కొన్ని రసాయనాలను కలుపుతారు. ఐరన్ ముద్దలు తయారై బయటకు వస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఎయిర్ బాయిలర్లో ఎక్కువ మోతాదులో ఖనిజాలను వేయడంతో ఒత్తిడి ఎక్కువై అది పేలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బాయిలర్కు కొద్దిదూరంలో నలుగురు కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి అంకు, అభినవ్ అనే కార్మికులు స్వల్పంగా గాయపడగా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించామని ఇన్చార్జ్ తహసీల్దార్ రాజారాం తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. కాగా, సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా ఫ్యాక్టరీ సిబ్బంది అడ్డుకున్నారు. జనరల్ మేనేజర్ మహబూబ్ అలీకి ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. కాగా..ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. -
ప్రతి శనివారం పరిశ్రమలకు పవర్ హాలీడే
శ్రీకాకుళం, న్యూస్లైన్: జిల్లాలోని పరిశ్రమలకు ప్రతి శనివారం పవర్హాలీడేను ప్రకటించారు. రాష్ట్రం లో విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో వారంలో ఒక రోజును విద్యుత్ హాలీడేగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఈ నెల 3 నుంచి అమలులోకి రానుంది. అలాగే, గృహావసరాలకు కూడా కోతలు పెంచాలని ఆదేశించినట్టు తెలిసింది. అధికారులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఉత్పాదన తగ్గినప్పుడల్లా కోతలు విధిస్తున్నామే తప్ప అధికారిక కోతలు లేవని చెబుతున్నారు. ఇటీవలే వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి తగ్గిందని ఈ కారణంగానే ప్రస్తుతం కోత విధిస్తున్నట్టు చెబుతున్నారు. ముందుముందు కోతలవాత తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.