Parking Lot
-
ముక్కు కొరికేశాడు
కాన్పూర్: అపార్ట్మెంట్లో తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరెవరిదో కారు నిలిపి ఉండటం చూసి పట్టరాని కోపంతో ఓ వ్యక్తి ఆ అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ ముక్కును రక్తమోడేలా కొరికేశాడు. ఈ అనూహ్యపరిణామం ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో జరిగింది. బాధితుడు రూపేంద్ర సింగ్ యాదవ్ కుమారుడు ప్రశాంత్, కుమార్తె ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్ శివారు నారామవూ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్లో క్షితిజ్ మిశ్రా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఆదివారం గుర్తు తెలియని కారు ఉండటంతో మిశ్రా వెంటనే సొసైటీకి ఫిర్యాదుచేశాడు. సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ యాదవ్ అదేరోజు సాయంత్రం మిశ్రా దగ్గరకు వచ్చాడు. వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులకు చెప్పానని, కారు ఎవరిదో ఆరాతీసి వెంటనే మీ స్థలం నుంచి తీయిస్తానని మిశ్రాకు నచ్చజెప్పారు. అయినాసరే ఏమాత్రం వినిపించుకోని మిశ్రా కోపంతో యాదవ్పై పలుమార్లు చేయిచేసుకున్నారు. తర్వాత యాదవ్ మెడను గట్టిగా పట్టుకుని ముక్కు కొరికేశాడు. దీంతో రక్తం ధారలా కారింది. రక్తమోడుతున్న యాదవ్ను ఆయన కుటుంబసభ్యులు దగ్గర్లోని రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఆగమేఘాల మీద ఆయనను ఢిల్లీకి తరలించారు. ‘‘ ప్రస్తుతం యాదవ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తే మిశ్రాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తాం’’ అని కళ్యాణ్పూర్ ఏసీపీ అభిషేక్ పాండే చెప్పారు. ‘‘ రక్తమొచ్చేలా కొరికిన కోపిష్టిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు’’ అని బాధితుడి కుమార్తె ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుగా ఎలాంటి ఫిర్యాదు అందని కారణంగానే మిశ్రాను విడిచిపెట్టామని, ఇకపై ఎఫ్ఐఆర్ ప్రకారం నడుచుకుంటామని ఏసీపీ చెప్పారు. -
కారు పార్కింగ్ వివాదం.. కొట్టుకున్న రెండు కుటుంబాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సంత్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక పెద్దాయనతో సహా ఆ కుటుంబంలోని మహిళలు పార్కింగ్ చేసిన వ్యక్తిని కర్రతో చితకబాదారు. ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు వీరు అంతరించిపోతున్న భారతీయ కళకు ఊపిరి పోశారన్నారు. ఒకప్పుడు వీధుల్లో కుళాయి వద్ద సర్వసాధారణంగా బిందెలతో కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిన కారణంగా వీధిలోని సంప్రదాయాన్ని అపార్ట్మెంట్లకు బదిలీచేశారు. వేషధారణ అయితే మారింది కానీ గుణం మారలేదు. సంత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముండే దుష్యంత్ గోయెల్ కారు పార్కింగ్ చేశాడన్న కోపంతో ఆ కుటుంబ పెద్ద కనీసం వారించకుండా ఒక కర్రతో దాడి తెగబడ్డారు. పాపం భర్తను కాపాడేందుకు అతని భార్య మోనా గోయెల్ తోపాటు వారి కుమార్తె కౌశికి కూడా ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ పెద్దమనిషి ఇంట్లోని వారంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో దుష్యంత్ కుటుంబంలోని అందరూ గాయపడ్డారు. అనంతరం దుష్యంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పెద్దమనిషి దల్జీత్ సింగ్ అతని కుమారుడు హర్జాప్ ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అదే కుటుంబంలోని ఆడవాళ్లు కూడా దాడిచేసినటు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు రెండుసార్లు నిరాకరించింది. ఒక్కరికి మాతం కోర్టు ఉపశమనం కలిగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ మధ్య కార్ పార్కింగ్ వివాదాలు ఒకప్పటి బిందుల ఫైట్ కంటే రసవత్తరంగా సాగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6 — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లొ మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం -
ప్రైవేట్ పార్కింగ్కు ఒకే ఒక్కడు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రైవేట్ పార్కింగ్లు ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. నగరంలో తగినన్ని పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ప్రైవేట్ స్థలాల యజమానులు పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా అటు వారికి ఆదాయంతో పాటు ఇటు ప్రజలకు పార్కింగ్ తిప్పలు తప్పుతాయని భావించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పార్కింగ్లు ఏర్పాటు చేసేందుకు స్థల యజమానులు ముందుకు రావాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేశారు. నగరంలో భారీ హోర్డింగుల ద్వారానూ ప్రచారం చేశారు. అయితే నెలరోజులు దాటినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ప్రైవేట్ పార్కింగ్లకు అనుమతి పొందేందుకు ఇప్పటి వరకు దాదాపు 15 మంది వరకు జీహెచ్ఎంసీ అధికారులను ఫోన్లో సంప్రదించినప్పటికీ, ముందుకొచ్చింది ఇద్దరే. పార్కింగ్కు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని, స్థలంపై యజమాన్యపు హక్కులు తదితర అంశాలను పరిశీలించిన అధికారులు శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఎల్లారెడ్డిగూడలోని 500 గజాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు . ట్రేడ్లైసెన్సు ఫీజు కూడా చెల్లించడంతో ఏప్రిల్ ఒకటో తేదీనుంచి అక్కడ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. దానిని జియోట్యాగింగ్ చేసి పార్కింగ్ సదుపాయంపై జీహెచ్ఎంసీ యాప్లోనూ పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ ఎస్టేట్స్ ఆఫీసర్ రమేశ్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి ప్రాంతంలో వెయ్యి గజాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటుకు విజయకుమార్ అగర్వాల్ అనే మరొకరు దరఖాస్తు చేసుకున్నారని, స్థల పరిశీలన జరగాల్సి ఉందని తెలిపారు. నగరంలో తగినన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయలేకపోయిన జీహెచ్ఎంసీ.. ప్రైవేట్ పార్కింగ్ల ద్వారా సమస్య తీరగలదని భావించింది.కనీసం 100 గజాల నుంచి అంతకు మించి ఎంత స్థలంలోనైనా అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విస్తృత ప్రచారం.. తొలుత అందుబాటులోకి రానున్న ప్రైవేట్ పార్కింగ్పై విస్తృత ప్రచారం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. తద్వారా మరింత మంది వీటి ఏర్పాటుకు ముందుకు రాగలరని భావిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా అక్కడ ఎన్ని వాహనాలకు సదుపాయం ఉంటుందో తెలుసుకోవచ్చు. అడ్వాన్స్గా స్థలాన్ని రిజర్వు చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. మాల్స్లో ఉచిత పార్కింగ్ ఎప్పుడో.. ?! మాల్స్, ఇతర వాణిజ్య కేంద్రాల్లో అడ్డగోలుగా దోచుకుంటున్న పార్కింగ్ దందాకు చరమ గీతం పాడేందుకు మాల్స్, సినిమాహాల్స్, తదితర వాణిజ్య ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలని భావించారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధికారులతో నిర్వహించిన ఒక సమీక్షలోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. దాంతో, త్వరలోనే ఫ్రీ పార్కింగ్ అమలులోకి రాగలదని అధికారులు భావించినప్పటికీ, నెలలు గడుస్తున్నా దానిపై ఎలాంటి కదలిక లేదు. దీంతో ప్రజలకు పార్కింగ్ భారం తప్పడం లేదు. మెట్రో స్టేషన్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. పార్కింగ్ ఫీజులు ఇలా.. ♦ కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు : రూ. 20, ఆ తర్వాత ప్రతి గంటకు :రూ. 5 ♦ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు : రూ. 10 ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు: రూ. 5