breaking news
palaparthi devid raju
-
అంతా బూటకమే
ఓ వైపు చంద్రబాబు రైతు సాధికారత సదస్సులు పెట్టి రుణమాఫీ పత్రాలు అందజేస్తుంటే ఇంకోవైపు రైతులు అదంతా పచ్చి బూటకమంటూ కన్నెర్ర చేస్తున్నారు. సీఎం జిల్లాలో ఉన్న సమయంలోనే బ్యాంకులను ముట్టడించి సంబంధిత అధికారులను నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, పర్చూరు, మండలాలతోపాటు త్రిపురాంతకంలోనూ నిరసన గళాలు వినిపించాయి. యర్రగొండపాలెం: ఎన్నికల ముందు బూటకపు వాగ్దా నాలు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కారని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు విమర్శించారు. రైతుల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం త్రిపురాంతకం మండలం దూపాడులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన తొలి సంతకం రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాల రద్దు ఫైలుపై సంతకం చేశానన్నారు. అప్పటి నుంచి ఆరు నెలలపాటు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలలోపు రుణాలు ఏకమొత్తంలో రద్దు పరుస్తున్నామని, ఆ పైబడిన రుణాలు విడతలవారీగా రద్దు చేస్తామని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీకి సంబంధించి రైతు సాధికారిత కార్యక్రమాల్లో తప్పుడు పత్రాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఉద్యానవన పంటలకు రుణమాఫీ లేదంటూ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని పేరుతో పచ్చటి పొలాలను లాక్కోటానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారన్నారు. దొనకొండలో 60 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాదని, జిల్లాకు సాగర్నీరు సక్రమంగా రావడం లేదని, ఈ విషయం తెలిసిన అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమకు ఏమీ పట్టనట్లున్నారని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దపోతు చంద్రమౌళి రెడ్డి, నియోజకవర్గం అధికార ప్రతినిధి నర్రా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, నాయకులు దగ్గుల వేణుగోపాలరెడ్డి, ఆళ్ల కృష్టారెడ్డి, పోలిరెడ్డి, ఒంటేరు రాజయ్య, లక్ష్మీబాయి, జి.నాసర్రెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన టీడీపీ ప్రభుత్వం
యర్రగొండపాలెం టౌన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఆ పార్టీ అధికారంలో కొచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్రాజు విమర్శించారు. తన నివాస గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత వారిని మోసగించారని..పేదల పింఛన్ల విషయంలోనూ అర్హులను తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి అవసరమైన వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను పూర్తిగా టీడీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోనే బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 25వ తేదీ ఉదయం పది గంటలకు యర్రగొండపాలెం నియోజకవర్గ సమీక్ష జరుగుతుందని తెలిపారు. సమీక్ష సమావేశానికి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ విభాగాల అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, సహకార సంఘాల అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు తప్పక పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వైపాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైపాలెం మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ మౌలాలీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వనిపెంట రామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు కే ఓబుల్రెడ్డి పాల్గొన్నారు.