Niwas
-
నేటి నుంచి జనగణన
సాక్షి, అమరావతి: జనాభా గణన–2027 ప్రక్రియ రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. తొలి దశగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణనతోపాటు స్వీయ గణన మొదలవుతుందని చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా గణన–2027 ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా గణన యాప్లో నమోదు చేసేందుకు గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వీయ గణన అనేది మంచి విధానమని, ప్రజలు తమ వివరాలను సరిగా నమోదు చేశామనే విశ్వాసం పొందుతారన్నారు. స్వీయ గణన అనంతరం జనాభా గణన సిబ్బంది కూడా ప్రజలు సరిగా నమోదు చేశారా? లేదా ? అని పరిశీలన చేస్తారన్నారు. దీనివల్ల జనాభా గణన సిబ్బంది పని సులభమవుతుందన్నారు.జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను వినియోగిస్తామని నివాస్ చెప్పారు. జనాభా గణన సిబ్బంది 80 శాతం మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉంటారని తెలిపారు. జనాభా గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని, వాస్తవ సమాచారం ఇవ్వాలని కోరారు. జనాభా గణన సిబ్బందికి ఆటంకాలు కల్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్న జనాభా ఆధారంగా జనగణన జరుగుతుందన్నారు. 2011లో చివరి జనగణన నిర్వహించగా, 2027లో జరగబోయేది 16వదని, స్వాతంత్య్రం వచ్చాక ఎనిమిదో విడత అని వివరించారు.స్వీయ గణన ఇలా...» ప్రజలు https://se.census.gov.in పోర్టల్లో తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి, ఇంటిని జియో–ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయాలి. అది పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్వీయ గణన ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్కు అందజేసి క్షేత్రస్థాయి తనిఖీ సమయంలో ధ్రువీకరించాల్సి ఉంటుంది.» వాటికి అదనంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట ఇంధనం, స్నాన సౌకర్యం, వంటగది వంటి సౌకర్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తులు (టీవీ, ఇంటర్నెట్, మొబైల్, వాహనాలు), ప్రధాన ఆహారం, మొబైల్ నంబర్ వంటి వివరాలు కూడా నమోదు చేయాలి. » జనాభా గణన సందర్భంగా విద్య, కులం వంటివాటి ధ్రువీకరణకు ఎటువంటి రుజువులు, పత్రాలు అడగరు. » జనాభా గణనకు ఆధార్ నంబర్తో సంబంధం లేదు. » జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఆ సమయంలో కుల గణనకు కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుంది.» ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఇళ్ల జాబితా సేకరణలో భవనాలు, ఇళ్లకు నంబర్లు ఇస్తారు. గృహ జాబితా దశలో మొత్తం 33 ప్రశ్నలకు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో గృహ నిర్మాణ అంశాలు (ఫ్లోర్, గోడ, పైకప్పు), గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక స్థితి, గదుల సంఖ్య, నివాసం ఉంటున్న వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయి. -
రాష్ట్ర వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ చెప్పారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న హరియాణ ట్రైనీ సివిల్ సర్విసెస్ అధికారుల బృందం బుధవారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో వైద్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి ఈ బృందానికి కమిషనర్ నివాస్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి వివరించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలే ఈ ప్రభుత్వం వైద్యశాఖలో తెచ్చిన మార్పునకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వైద్యపరమైన సమస్యలు, అవసరాలు తీర్చేలా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.250 చొప్పున ఆరునెలల వరకు భృతిని ఇస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి పథకం బహుశా దేశంలోనే ఎక్కడా అమలులో లేదన్నారు. సీఎం చైర్మన్గా వ్యవహరించే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీతో పాటు 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానమైన 104 మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హరియాణ ట్రైనీ అధికారులు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యరంగంపై ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం అభినందనీయమని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును తాము పరిశీలించామన్నారు. 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లను నెలకొల్పడమే కాకుండా బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న సీహెచ్వోలను నియమించి మారుమూల గ్రామాలకు సైతం వైద్యసేవల్ని విస్తరించడం ప్రశంసనీయమని చెప్పారు. అత్యధిక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లను సృష్టించడంలో కూడా దేశంలోనే ఏపీ ముందు నిలిచిందన్నారు. ఏపీలోని వలంటీర్లు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఎంతో చేరువ చేశారని వారు పేర్కొన్నారు. -
వైద్యరంగంలో ఏపీ సంస్కరణలు భేష్
సాక్షి, అమరావతి/మూలపాడు (ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవల కల్పన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని జర్మనీకి చెందిన అంతర్జాతీయ సంస్థ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జె–పాల్) ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఈ బృందం గురువారం మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్తో సమావేశమైంది. అంతకుముందు బృందం సభ్యులు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలును పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు, ప్రజలను అడిగి వైద్యసేవలు అందుతున్న తీరు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే, ఇతర కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కమిషనర్తో సమావేశమయ్యారు. వైద్య, ఆరోగ్యరంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని సంస్థ ప్రతినిధులకు కమిషనర్ నివాస్ వివరించారు. నాడు–నేడు కింద ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు సహా పలు అంశాలను తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జె–పాల్ బృంద సభ్యులు ప్రొఫెసర్ నిక్కిల్ సుదర్శనన్ (మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ హర్షా తిరుమూర్తి (పెన్సిల్వేనియా యూనివర్సిటీ) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణకు ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు మంచి నిర్ణయమని తెలిపారు. ఆరోగ్య సురక్ష కింద హెల్త్ క్యాంప్లు నిర్వహించి స్పెషలిస్ట్ వైద్య సేవల కల్పన అభినందనీయమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ రాష్ట్ర నోడల్ అధికారి టి.రమేష్, ఎన్టీఆర్ జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, మూలపాడు పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతపై దృష్టి సారించాలి:కలెక్టర్ నివాస్
సాక్షి, శ్రీకాకుళం: పరిశ్రమల భద్రత, సురక్షిత అంశాలను పరిశీలించాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల భద్రతపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలు కలిగిన కర్మాగారాలను పరిశీలించాలని తెలిపారు. ప్రమాదకరమైన విష వాయువులు, రసాయన వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అగ్నిమాపక కోణంలో కూడా తనిఖీ చేయాలని..పరిశ్రమలు విధిగా అన్ని సురక్షిత, భద్రతా చర్యలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పరిశ్రమల్లో సిబ్బంది మాస్కులు కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు,ఫోమ్,నీటితో నియంత్రణ చేసే పరికరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. -
నాగిని ఏం చేసింది?
కేయస్ నివాస్, సందీప్తి, పద్మ హీరో హీరోయిన్లుగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె. సంధ్యారాణి నిర్మించిన చిత్రం ‘నాగిని’. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సంధ్యారాణి మాట్లాడుతూ - ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం ఉంటుంది. నాగినీ ఎవరు? ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కేయస్ నివాస్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: సంధ్యారాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్కుమార్ గుర్రం,


