breaking news
NAPM
-
రాజ్యాంగ హక్కులపై దాడిని ఖండిద్దాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై జరుగుతున్న దాడిని ప్రజలంతా ఖండించాలని నేషనల్ అల యన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (ఎన్ఏపీఎం) రెండో ప్లీనరీలో వక్తలు పిలుపునిచ్చారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఎన్నో హక్కులపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పౌరహక్కుల నేతలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎన్ఏపీఎంను ప్రారంభించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన రెండో ప్లీనరీ సమావేశాలు శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. 4వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలపై ప్రభుత్వాల అణచివేత, ఆదివాసీల హక్కులపై దాడి తదితర అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారిణి అరుణా రాయ్, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఇర్ఫాన్ ఇంజనీర్, ప్రొఫెసర్ శాంతాసిన్హా, డీయూ సరస్వతి, టీఎం కృష్ణ పలు అంశాలపై మాట్లాడారు. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు: అరుణారాయ్ ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దని అరుణా రాయ్ అన్నారు. భారతదేశం అంటే భిన్న సంస్కృతులు, భిన్న భాష ల కలయిక అని.. ఆ భిన్నత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పాలకులు ప్రజలను విడదీసేందుకు మతాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. అది ఎంతో ప్రమాదమని హెచ్చరించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై గ్రామ స్థాయి లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ శాంతా సిన్హా అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ రిలీజియన్ అన్న నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని ఇర్ఫాన్ ఇంజనీర్ సూచించారు. ప్రస్తు త రాజకీయాలు దేశ ప్రజలపై మతం అనే కారుమబ్బులను కప్పుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సి న అవసరం ఉందని టీఎం కృష్ణ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హ క్కులతోపాటు సమాజంలోని మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా అణచివేతకు గురవుతున్న ఎన్నో వర్గాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని డీయూ సరస్వతి అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని, దేశ సహజ సంపదను బడా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని సమావేశంలో పాల్గొన్న పలువురు ఆదివాసీ ఉద్యమ నేతలు ఆరోపించారు. అరుణా రాయ్ రచించిన ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’పుస్తకాన్ని ప్రశాంత్ భూషణ్ తదితరులు ఆవిష్కరించారు. సోషల్మీడియా ద్వారానే అధిక హింస: ప్రశాంత్ భూషణ్ దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఎక్కువ దాడి జరుగుతోందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలను విమర్శిస్తే జైళ్లలో వేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడేవారిని సోషల్ మీడియా వేదికగా హింసించడం పెరిగిందని తెలిపారు. భౌతికంగా కంటే సోషల్ మీడియాలోనే ఇప్పుడు అతిపెద్ద హింస జరుగుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో విద్వేష పూరిత పోస్టులు పెట్టేవారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ జరిగితేనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి డబ్బుతో అధికారం సంపాదించటం.. అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదన అన్నట్టుగా మారిందని అన్నారు. చర్చ జరగకుండానే కొత్త చట్టాలు రూపొందిస్తున్నారని, కొన్నిసార్లు ఒకే రోజులో పదుల సంఖ్యలో నూతన చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలకు స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. -
అమరావతి ఒక విస్పోటనమే..
‘సాక్షి’తో ఎన్ఏపీఎం జాతీయ సమన్వయకర్త బి.రామకృష్ణంరాజు రాజధాని నిర్మాణం పేరిట విధ్వంసం అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే తీవ్ర నష్టం ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి రాజధాని కంటే ముందు ప్రాథమిక రంగాలను అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది గుంటూరు : ‘‘ప్రజా రాజధానిగా ప్రభుత్వం వల్లెవేస్తున్న రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విస్పోటనమే. రాజధాని పేరిట జరుగుతున్న వ్యవహారాలన్నీ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, పర్యావరణపరంగా, వ్యవసాయకంగా.. ఇలా అన్నివిధాలా దెబ్బతీయడానికే తప్ప ప్రగతికి, ప్రజాప్రయోజనాలకు ఏమాత్రం ఉద్దేశించినదిగా కనిపించడం లేదు. ఒక నాయకుడు తన ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ప్రణాళికలు రచిస్తూ, వాటినే భూతద్దంలో గొప్పగా చిత్రీకరిస్తూ వ్యక్తిగత లబ్ధికి బాటలు వేసుకోవడం తప్ప మరొకటి కానే కాదు. వాస్తవ విశ్లేషణలు జరిగితే అమరావతి బూటకం బట్టబయలు అవుతుంది’’ అని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్- ఎన్ఏపీఎం) జాతీయ సమన్వయకర్త భూపతిరాజు రామకృష్ణమరాజు తెలిపారు. విభిన్న ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారందరినీ జాతీయ స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు మేధాపాట్కర్, సందీప్ పాండే, అరుణారాయ్, స్వామి అగ్నివేశ్, రాజేంద్రసింగ్, ఎంజీ దేవసహాయం తదితర నిపుణులతో కలిసి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న బి.ఆర్.కె.రాజు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అమరావతి పేరిట జరుగుతున్నది మహా విస్పోటనమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: రాజధాని అమరావతి ఒక విస్ఫోటనమని ఎలా చెప్పగలరు? రాజు: అమరావతి ఒక విస్ఫోటనం అనడానికన్నా తక్కువ పదం మరొకటి కనిపించడం లేదు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతాయి. వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా స్పష్టంగా పేర్కొంది. రాజధాని నిర్మాణం పేరిట రైతు కుటుంబాలను అతలాకుతలం చేయడం, పర్యావరణ విధ్వంసం, నిర్మాణాల పేరిట అవినీతి, అక్రమాలకు గేట్లు బార్లా తెరవడం, ప్రభుత్వమే నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుండటం, విదేశీ కంపెనీల ముందు మోకరిల్లండం, స్వదేశీ నిపుణుల నైపుణ్యాన్ని కించపరచడం.. ఇవన్నీ విస్ఫోటనాలకు నిదర్శనాలే. సాక్షి: ప్రపంచం మెచ్చే నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది కదా! రాజు: దానికన్నా ముందు ప్రపంచం మెచ్చేలా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక రంగాలను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజల ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. వాటిని నెరవేర్చాలి. మెరుగైన రాజధాని నిర్మాణాన్ని ఎన్ఏపీఎం వ్యతిరేకించడం లేదు. అవసరాలకు అనుగుణంగా వెళ్లాలి తప్ప స్వప్రయోజనాల కోసం పాకులాడొద్దు. రాజధాని నిర్మాణానికి 3,000 ఎకరాలు చాలు. 50 వేల ఎకరాలకు పైగా సమీకరించడమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అవినీతికి తప్ప మరొకటి కానేకాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించకుండా కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది. దీన్నే ప్రజలంతా ప్రశ్నించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిలదీయాలి. సాక్షి: రాష్ట్ర పరిపాలన తీరును ఎలా భావిస్తున్నారు? రాజు: నూతన రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే విశ్వాసంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన పరిపాలనపై దృష్టి పెట్టకుండా రాజధానే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పుష్కరాలు, ఇసుక, రాజధాని నిర్మాణం, సదావర్తి సత్రం భూములు... ఇలా అన్నింటిలోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఓటుకు కోట్లు కేసు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వంటి వ్యవహారాలు చంద్రబాబు తీరును బట్టబయలు చేశాయి. అవినీతి రహిత పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామి అయిన చంద్రబాబు అవినీతిని ఎలా సమర్థిస్తున్నారో అర్థం కావడం లేదు. సాక్షి: ఎన్ఏపీఎం కార్యాచరణ ఏమిటి? రాజు: దేశంలో ప్రజా ఉద్యమాలను ఐక్య వేదికపైకి తీసుకొచ్చి ముందుకు నడిపించే బాధ్యతను ఎన్ఏపీఎం రెండు దశాబ్దాల క్రితమే స్వీకరించింది. దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తోంది. తాజాగా ‘మద్యం రహిత భారత్’పై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం.