దేశపు తొలి మ్యూజికల్ రోడ్...వచ్చేసింది
వాహనాల్లో వెళుతూ ఆడియోలో పాటలు వినడం కొత్త కాదు. కానీ ఒక రోడ్ మీదకు వెళ్లగానే టైర్లు రహదారిని తాకగానే సంగీతం వినిపించడం ఎక్కడైనా కనీ విన్నామా? దేశపు తొలి మ్యూజికల్ రోడ్ మీదుగా వెళితే ఆ అనుభవం మన స్వంతమవుతుంది. ముంబై కోస్టల్ రోడ్ దీనికి తొలి అడ్రెస్గా నిలిచింది. దక్షిణ దిశగా ఉన్న కోస్టల్ రోడ్ 500 మీటర్ల పొడవు అధికారికంగా భారత దేశపు మొట్టమొదటి సంగీత రహదారి అనే ఘనతను దక్కించుకుంది. ఈ రోడ్ మీదుగా వాహనదారులు నిర్ణీత వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు సూపర్ హిట్ బాలీవుడ్ పాట జై హోను ఉప్పొంగే దేశభక్తితో పాటు వినవచ్చు.ఈ ప్రత్యేకమైన ఇన్ స్టాలేషన్స్ ను ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు, ఇది పట్టణ మౌలిక సదుపాయాలు, సాంకేతికత సాంస్కృతిక వ్యక్తీకరణల అరుదైన కలయికను సూచిస్తుంది. ఈ సంగీత విస్తరణ ప్రియదర్శిని పార్క్ అమర్స న్స్ గార్డెన్ మధ్య, నారిమన్ పాయింట్ నుంచి వర్లి కి ఉత్తరం వైపు, క్యారేజ్వేలో, వాహనాలు కోస్టల్ రోడ్ సొరంగం నుంచి నిష్క్రమించే చోటుకు దగ్గరలో ఉంది.హంగేరియన్ రోడ్ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్... రోడ్డు ఉపరితలంపై ఖచ్చితమైన ఇంజనీరింగ్ గ్రూవ్లను ఉపయోగిస్తుంది. వీటిని రంబుల్ స్ట్రిప్స్ అని కూడా పిలుస్తారు. వాహనాలు ఈ గ్రూవ్ల మీదుగా గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు, టైర్ల ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలు సంగీత ప్రకంపనలను సృష్టిస్తాయి, ప్రస్తుతం ఇవి స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రం లోని గుల్జార్ సాహిత్యంతో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన జై హో పాటను వీనుల విందుగా వినిపిస్తున్నాయి.వాహనాల లోపల కూడా ఈ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తూ వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనూహ్యమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తుందని అధికారులు అంటున్నారు. భద్రతను నిర్ధారించడానికి, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సొరంగం లోపల సహా మ్యూజికల్ స్ట్రెచ్ ముందు 500 మీటర్లు, 100 మీటర్లు 60 మీటర్ల వద్ద ముందస్తు హెచ్చరిక సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది, దీని వలన డ్రైవర్లు ఆకస్మిక బ్రేకింగ్ లేకుండా క్రమంగా వేగాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.మన దేశంలో ఫస్ట్.. ప్రపంచంలో ఫిఫ్త్...ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ కాగా ప్రపంచవ్యాప్తంగా ఐదవది. మ్యూజికల్ లేదా మెలోడీ రోడ్ వరుసలో మొదటిది 2007లో జపాన్ లో ప్రారంభించారు. అప్పటి నుంచి హంగేరీ, దక్షిణ కొరియా యుఎఇ వంటి దేశాలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఇది ‘వాహనదారులకు సంతోషకరమైన అనుభవం‘ అని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలకు మించి ప్రయాణికుల అనుభవాన్ని ఎలా మెరుగుపరచవచ్చో ఈ ప్రాజెక్ట్ ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇతర రహదారులపై కూడా వీటిని చూడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు