Mobile Technology
-
మరో ముందడుగు
అయిదేళ్ళ క్రితం మొదలైన ప్రయత్నం ఎట్టకేలకు సాకారమవుతోంది. మొబైల్ టెలిఫోనీలో అయిదో జనరేషన్ (5జి) టెక్నాలజీ వినియోగానికి తొలి అడుగులు పడ్డాయి. ఆరవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఉత్సవాల్లో శనివారం భారీ హంగామా మధ్య దేశంలో 5జి సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత 4జి నెట్వర్క్ను వాడుకుంటూనే ‘5జి’ని అందించే నాన్–స్టాండ్ ఎలోన్ పద్ధతిలో 8 నగరాల్లో ఎయిర్టెల్ సేవలు మొదలయ్యాయి. దీపావళికి కొత్త నెట్వర్క్తో స్టాండ్ ఎలోన్ విధానంలో నాలుగు మెట్రో నగరాల్లో సేవలివ్వడానికి జియో సిద్ధమవుతోంది. మన సాంకేతిక ప్రస్థానంలో ఇది మరో పెద్ద ముందడుగు. అమెరికా, బ్రిటన్, చైనా, కెనడా, దక్షిణ కొరియాలు ఎప్పుడో ప్రారంభించిన 5జి సేవలు ఇప్పటికైనా మన దగ్గర మొదలవడం సంతోషకరం. ఆరంభం ఆలస్యమైనప్పటికీ 5జి సేవల్లో అనతికాలంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందనే వార్తలు మరింత సంతోషాన్నిస్తున్నాయి. తర్వాతి ‘6జి’కి సైతం సిద్ధమవుతున్నామన్న మాటలు మారనున్న భవిష్యత్ దృశ్యాన్ని సూచిస్తున్నాయి. ఇటీవల 5జి స్పెక్ట్రమ్ వేలంలో 4.3 లక్షల కోట్ల విలువైన ఎయిర్వేవ్స్ను అమ్మకానికి పెట్టగా, 1.5 లక్షల కోట్ల మేరకే అమ్ముడయ్యాయి. రూ. 88 వేల కోట్ల పైగా వేలంలో పెట్టిన రిలయన్స్ జియో వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ప్రతి తాలూకాలో తమ సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక వేసింది. వేలంలో జియో తర్వాత అధికంగా డబ్బు పెట్టిన భారతీ ఎయిర్టెల్ మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పట్టణ ప్రాంతాల్లో, 2024 మార్చికి ప్రధాన గ్రామాల్లో సేవలందిస్తామంటోంది. సమస్యల్లో పడి, నిధుల సమీకరణ సాగించలేకున్న వోడాఫోన్ – ఐడియా సమయం చెప్పకున్నా, రేసులో తన ఉనికిని నిలబెట్టుకొనే పనిలో ఉంది. 5జి దిశగా ఆలోచన అయిదేళ్ళ క్రితం 2017లోనే దేశంలో మొదలైంది. విద్యావేత్తలతో పాటు ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులతో ఉన్నత స్థాయి ప్రతినిధుల వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ ‘5జి’కి మార్గం చూపి, అప్పటి 4జి దాకా వివిధ టెలికామ్ నెట్వర్క్లలో నెలకొన్న విజాతీయతను పోగొట్టడం లక్ష్యంగా ఆ వేదిక పనిచేసింది. 2018లో నిపుణుల బృందం తన నివేదికను సమర్పించింది. 5జి ఉపయోగాలపై పరిశోధన సాగుతుండగానే ప్రభుత్వం పరిశీలనకై టెలికామ్ సంస్థలకు స్పెక్ట్రమ్ కేటాయింపు మొదలుపెట్టింది. 2019లో స్పెక్ట్రమ్ ధరలపై టెలికామ్ శాఖ, ట్రాయ్ సంప్రతింపులు జరిపాయి. ఈ ఏడాది ఆగస్ట్లో 5జి స్పెక్ట్రమ్ వేలం జరిగింది. రెండు నెలల్లో ఇప్పుడు 5జి సేవలు మొదలయ్యాయి. ఇప్పుడున్న 4జి కన్నా పది రెట్లు ఇంటర్నెట్ స్పీడ్ ‘5జి’తో పెరుగుతుంది. ‘4జి’లో 100 ఎంబీపీఎస్ అత్యధిక స్పీడ్ కాగా, ‘5జి’లో ఏకంగా అది 10 జీబీపీఎస్ దాకా వెళుతుంది. అలాగే, డేటా ప్రసారానికి ‘4జి’లో 10 నుంచి 100 మిల్లీసెకన్ల సమయం పడితే, ‘5జి’లో ఆ లేటెన్సీ సమయం 1 మిల్లీ సెకన్ లోపలే ఉంటుంది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగి, విద్య, వైద్యం, వినియోగ వస్తువులు, ఆన్లైన్ గేమింగ్, వినోదం – ఇలా అన్ని రంగాల్లో వ్యాపారాలు మారిపో తాయి. 5జి సేవలు కొత్త ఆర్థిక అవకాశాలకు తలుపులు తీసి, మరిన్ని సామాజిక ప్రయోజనాలతో మొత్తం భారత సమాజాన్నే మార్చేస్తాయని అంచనా వేస్తున్నది అందుకే! వచ్చే 2035కల్లా దేశంలో 5జి వల్ల ఏకంగా 45 వేల కోట్ల డాలర్ల మేర సంచిత ఆర్థిక ప్రభావం ఉంటుందని సర్కారు వారి మాట. 5జి వల్ల నిరుపేదలు సాధికారత సాధిస్తారని ప్రధాని ఆశంస. అది వాస్తవరూపం దాల్చాలంటే, 5జి సేవలతో పల్లెల్లో నిరుపేదలకు సైతం నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలా ‘5జి’తో పట్టణ – గ్రామీణ అంతరాలను చెరిపివేయాలి. అయితే, అనేక సవాళ్ళు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా 5జి సేవలు తొలి ఏళ్ళలో టెలికామ్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించలేదు. మన టెలికామ్ సేవల సంస్థలకూ ఆ సంగతి తెలుసు. స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం ఇప్పటికే భారీ మొత్తం ఖర్చు పెట్టిన ఈ సంస్థలు 5జి విస్తరణలో ఆర్థిక క్రమశిక్షణతో తెలివిగా అడుగులు వేయాల్సి వస్తుంది. వినియోగదారులకు అందుబాటులో ఉంటూనే, అతి డిస్కౌంట్లతో సొంత జేబుకు మరీ పెద్ద చిల్లు పడకుండా చూసుకోక తప్పదు. 4జిలో అనేక ఇబ్బందులున్నా ప్రపంచంలో అత్యధికంగా డేటా వినియోగించే మొబైల్ యూజర్లలో భారతీయులూ ఒకరు. అదే సమయంలో సగటున నెలకు ఒక యూజర్తో టెలికామ్ సంస్థలకు వచ్చే ఆదాయం బాగా తక్కువుండే దేశాల్లో భారత్ ఒకటి. వ్యాపారం నిలబడాలంటే ఇది ఇబ్బందే గనక, 4జి లాగా 5జి సేవలనూ టెలికామ్ సంస్థలు చౌకగా ఇస్తాయని చెప్పలేం. అయితే, కాస్తంత ఖరీదైనా సరే తాము ‘5జి’కి మారిపోతామంటూ ఇటీవలి సర్వేలో నూటికి 90 మంది ఉత్సాహం చూపారు. ధరల నిర్ణయంతో పాటు సైబర్ భద్రత, సాంకేతికతను పెంచుకోవడం, ఫైబర్నెట్ విస్తరణ తదితర సవాళ్ళను టెలికామ్ సంస్థలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. అలాగే, 4జి సేవల్లో, నెట్ స్పీడ్లో సవాలక్ష సమస్యలు వేధిస్తున్న సువిశాల దేశంలో ‘5జి’లో ఇచ్చినమాట నిలబెట్టుకోవడమూ సులభమేమీ కాదు. బేసిక్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్ఫోన్లు ఆక్రమించినట్టు, పాత టెక్నాలజీలను పూర్తిగా మార్చడానికి పదేళ్ళపైనే పట్టవచ్చు. అయితేనేం 5జి ఫోన్ల అమ్మక హంగామా అప్పుడే మొదలైంది. అంతటా 5జి ఉత్సాహం నెలకొంది. ఆరేళ్ళలో అనూహ్యంగా మొబైల్ వీడియోను సర్వాంతర్యామిని చేసిన 4జి లాగానే, డిజిటల్ ఇండియాలో సరికొత్త స్వప్నాన్వేషణకు బి రెడీ! -
మొబైల్ టెక్నాలజీతో టీకాలు..
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్–19 టీకాల కార్యక్రమంలో మొబైల్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అనేక రెట్లు వేగవంతమైన డేటా సర్వీసులను అందించగలిగే 5జీ మొబైల్ నెట్వర్క్ను సత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం అంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘కోట్ల మందికి కోట్ల కొద్దీ రూపాయల ప్రయోజనాలను చేకూర్చేందుకు మొబైల్ టెక్నాలజీ తోడ్పడుతోంది. అసంఖ్యాకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఉపయోగపడుతోంది. దీని తోడ్పాటుతోనే ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కోవిడ్–19 టీకాలను వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, టీకాలు వేయడంలో మొబైల్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించబోతున్నారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇక టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీకి భారత్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టామని, మొబైల్స్ తయారీకి కీలకమైన దేశాల్లో ఒకటిగా భారత్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో గ్రామాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ.. అన్ని గ్రామాలకు మూడేళ్లలో అత్యంత వేగవంతమైన ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ హ్యాండ్సెట్స్, గ్యాడ్జెట్స్ను తరచూ మార్చేసే సంస్కృతి కూడా పెరుగుతోందని, ఇలాంటి ఎల్రక్టానిక్ వ్యర్థాల నిర్వహణకు పరిశ్రమ ప్రత్యేకంగా టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత డిజిటల్ మార్కెట్ పరిమాణం, అవసరాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని ప్రధాని తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం ఏర్పాటైన మొబైల్ యాప్లు.. అనేక దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ కంపెనీలను దాటేస్తున్నాయి. ఇది భారత్కు, మన యువ ఆవిష్కర్తలకు శుభసూచకం. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అవకాశమున్న ఎన్నో వినూత్న ఆవిష్కరణలపై మన యువత పనిచేస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఎఫ్డీఐలకు వ్యతిరేకం కాదు: టెలికం మంత్రి ప్రసాద్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ఆవిష్కరణలను స్వాగతిస్తామని .. అయితే దేశ భద్రత రీత్యా దేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఉగ్రవాదులు దుర్వినియోగం చేయకుండా.. డిజిటల్ టెక్నాలజీలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రతా కారణాల రీత్యా టిక్టాక్, యూసీ బ్రౌజర్ తదితర చైనా యాప్లపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ప్రసాద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రత్యేక ప్రమాణాలు వద్దు: ఎయిర్టెల్ సీఈవో 5జీ సేవలకు సంబంధించి భారత్ కోసం ప్రత్యేక ప్రమాణాలు నిర్దేశించాలన్న యోచన అంత శ్రేయస్కరం కాదని భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అంతర్జాతీయ వ్యవస్థలో భారత్ భాగమయ్యే అవకాశాలు లేకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా కొత్త ఆవిష్కరణల అభివృద్ధి ప్రక్రియ మందగించే అవకాశం ఉందన్నారు. అటు టెలికం కంపెనీలు.. టారిఫ్లు, పన్నులు, స్పెక్ట్రం కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. ఇక, స్పెక్ట్రం ధరలను భారత్ తగ్గించాలని, లభ్యతను పెంచాలని స్వీడన్ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ ఆగ్నేయాసియా హెడ్ నుంజియో మిరి్టలో పేర్కొన్నారు. మరింత మందికి వేగవంతమైన ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నామని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ డాన్ రాబినోవిట్జ్ వెల్లడించారు. -
స్నాప్డీల్ చేతికి గోజావాస్?
డీల్ విలువ రూ.200 కోట్లు! న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం స్నాప్డీల్.. సరుకు రవాణా(లాజిస్టిక్స్) సంస్థ గోజావాస్ను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ డీల్ విలువ రూ.150-200 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుగా స్నాప్డీల్ ఈ కొనుగోలుపై దృష్టిపెడుతోంది. రానున్న రెండు వారాల్లో డీల్ను ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం. ఈ-కామర్స్ సంస్థ జబాంగ్కు చెందిన లాజిస్టిక్స్ విభాగమే గోజావాస్. జబాంగ్తోపాటు హెల్త్కార్ట్, యెప్మీ, లెన్స్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలకు కూడా గోజావాస్ సేవలందిస్తోంది. సొంత డెలివరీ సంస్థ లేని కారణంగా స్నాప్డీల్ థర్డ్పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలపై ఆధారపడుతోంది. కాగా, ఈ వార్తలపై స్నాప్డీల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు. గతేడాది సుమారు బిలియన్ డాలర్ల నిధులను సమీకరించిన(జపాన్ సాఫ్ట్బ్యాంక్ 62.7 కోట్ల డాలర్ల పెట్టుబడి సహా) స్నాప్డీల్... మొబైల్ టెక్నాలజీ, సరఫరా నెట్వర్క్ విభాగాల్లో కంపెనీల కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది.