breaking news
MLC Deepak Reddy
-
కక్షకట్టి.. ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి చేసిన మరో ఫోర్జరీ వ్యవహారం రూఢీ అయింది. ఓ మహిళపై కక్షకట్టిన దీపక్రెడ్డి ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి, ఆమెపైనే సివిల్ కేసు వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్లో నమోదైన ఈ కేసు.. దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు బదిలీ అయింది. ఆ పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపిన అధికారులు ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కొద్దీ రోజుల క్రితం దీపక్రెడ్డికి నోటీసులు జారీ చేసి ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫోర్జరీ, భూకబ్జా తదితర ఆరోపణలపై నమోదైన కేసులో దీపక్రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్పై ఉన్నారు. ఆర్థిక లావాదేవీలపై వివాదం.. బంజారాహిల్స్కు చెందిన పద్మావతి 2012లో బాచుపల్లి ప్రాంతంలో రెండు క్రషర్ ప్లాంట్లు నిర్వహించారు. వీటికి ముడిసరుకును దీపక్రెడ్డి తన గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ ద్వారా సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం రేగింది. దీంతో దీపక్రెడ్డి అనుచరులు క్రషర్ ప్లాంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, సామగ్రి ఎత్తుకెళ్లారు. పద్మావతి ఫిర్యాదుతో దుండిగల్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. పద్మావతిపై కక్షకట్టిన దీపక్రెడ్డి.. ఆమె క్రషర్ ప్లాంట్లను సొంతం చేసుకోవాలని భావించారు. బాచుపల్లిలోని ప్లాంట్ విక్రయించేందుకు పద్మావతి రూ.5 లక్షల అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ కమ్ సేల్ డీడ్ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై పద్మావతి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వీటి ఆధారంగా దీపక్రెడ్డి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం నుంచి నోటీసు అందుకున్న పద్మావతి అవాక్కయ్యారు. తాను ఎవరితోనూ ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు విన్నవించడంతో ఈ పిటిషన్ డిస్మిస్ అయింది. తన సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దీపక్రెడ్డిపై బంజారాహిల్స్ ఠాణాలో 2014లో కేసు నమోదైంది. ఫోర్జరీ జరిగినట్టు నిర్ధారణ.. ఈ కేసును ఉన్నతాధికారులు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్కు బదిలీ చేశారు. అనుమానిత డాక్యుమెంట్లు ఫోర్జరీవా? కాదా? అన్నది తేల్చడానికి వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపారు. వీటిని విశ్లేషించిన నిపుణులు ఫోర్జరీ జరిగినట్లు నిర్ధారించారు. దీంతో సీసీఎస్ పోలీసులు పూర్తి వివరాలు సేకరించడానికి దీపక్రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తనకు మరోసారి అరెస్టు ముప్పు తప్పదని దీపక్రెడ్డి భావించారు. పోలీసులకు వ్యక్తిగతంగా అందుబాటులోకి రాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో పై కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. -
సీసీఎస్లో హాజరైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి
కోర్టు ద్వారా మంజూరైన ముందస్తు బెయిల్ వివరాలు దర్యాప్తు అధికారికి అందజేత సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో హైదరాబాద్లో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో హాజరయ్యారు. నాంపల్లి కోర్టు తనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను కేసు దర్యాప్తు అధికారికి అందజేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి స్వయానా అల్లుడైన దీపక్రెడ్డి మరికొందరితో కలసి బంజారాహిల్స్లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు వివరణ కోరుతూ దీపక్రెడ్డికి నోటీసుల జారీకి ప్రయత్నించారు. అయితే వారికి దొరక్కుండా తప్పించుకు తిరిగిన దీపక్రెడ్డి అనారోగ్యకారణాలు చూపిస్తూ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి శుక్రవారం సీసీఎస్కు వచ్చారు. ఈ సందర్భంగా రెండు గంటలపాటు దీపక్రెడ్డిని కేసు దర్యాప్తు అధికారి ఫోర్జరీపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసమూ సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్పై దౌర్జన్యం.. సీసీఎస్ నుంచి తిరిగెళుతున్న సమయంలో దీపక్రెడ్డిని ఫొటోలు తీసిన ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ పి.మోహనాచారిపై ఆయనతోపాటు ఆయన అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తీవ్రంగా దుర్భాషలా డారు. దౌర్జన్యానికి దిగి మోహనాచారి చేతిలో ఉన్న కెమెరాను బలవంతంగా లాక్కోవ డంతోపాటు అందులోని చిప్ను తీసేసుకు న్నారు. ఈ అన్యాయం ఏమిటని ‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్ ప్రశ్నించగా... ‘‘నాకేం అవుతుంది. ఇప్పటికే ఓ కేసు ఉంది. మరో కేసు రిజిస్టర్ అవుతుంది’’ అంటూ దీపక్ రెడ్డి విరుచుకుపడ్డారు. దీనిపై మోహనాచారి శుక్రవారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.