breaking news
Ligo-India
-
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ గొప్ప ముందడుగు వేసింది. ‘లిగో–ఇండియా’ ఏర్పాటు సైన్స్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికా సహకారంతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు 2030 కల్లా పనులు ప్రారంభించవచ్చు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసేవారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలోని న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను కూడా పరిశీలించవచ్చు. విశ్వ రహస్యాల ఛేదనలో ఇదొక అద్భుతమైన ప్రయత్నం అవుతుంది. శాస్త్ర పరిశోధనల రంగంలో భారత్ మరో మేలి ముందడుగు వేసింది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా భారత్లో ‘ద లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’ ఏర్పాటు కానుండటం దీనికి కారణం. కేంద్ర కేబినెట్ ఇటీవలే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయడం సైన్స్ చరిత్రలో ఓ సుదినమని చెప్పాలి. అంతేకాదు... అనేక ఇతర ప్రాథమ్యాలను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సైన్స్ బృందం ఈ ప్రాజెక్టు అమలుకు పూనుకోవడం గొప్ప పరిణామం. వందేళ్ల తర్వాత... ఏమిటీ లిగో? దాని ప్రాధాన్యం ఏమిటి? మనకు, ప్రపంచానికి దీనివల్ల ఉపయోగమేమిటి? చాలా ఆసక్తికరమైన ప్రశ్నలివి. ఒక్కటొ క్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. అమెరికాలోని కాల్టెక్, మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)ల ఆధ్వర్యంలో అమెరికా చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఈ లిగో! విశాల విశ్వం మొత్తం పరచుకుని ఉన్న గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించడం దీని లక్ష్యం. 1916లో ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మొట్టమొదటిసారి ఈ గురుత్వ తరంగాల ఉనికిని అంచనా వేయడమే కాకుండా... దాని ఆధారంగా గురుత్వాకర్షణ శక్తిపై విప్లవా త్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశాల విశ్వంలో ఎక్కడో కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో నడిచే అత్యంత శక్తిమంతమైన ఘటనల కారణంగా పుట్టే గురుత్వ తరంగాలను 2015లో మొట్ట మొదటిసారి గుర్తించారు. ఇంకోలా చెప్పాలంటే, వాటి ఉనికిని మొదటిసారి అంచనా వేసిన వందేళ్ల తరువాత గుర్తించారని చెప్పాలి. 2015లో గుర్తించిన తరంగాలు సుమారు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణబిలాలు లయమైపోయిన కారణంగా పుట్టుకొచ్చాయి. ఆ ఆవిష్కరణకు 2017లో భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు కూడా దక్కింది. లిగో ద్వారా గురుత్వ తరంగాల ప్రత్యక్ష పరిశీలన విశ్వ దర్శనానికి రెండు కొత్త కళ్లల్లా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ విశ్వాన్ని కేవలం విద్యుదయస్కాంత తరంగాల దృష్టిలోనే చూసే వారు. గురుత్వ తరంగాలకు న్యూట్రినోలు, ఖగోళ కిరణాలు కూడా తోడయితే అంతరిక్షంలో జరిగే సంఘటనలను భిన్న రీతుల్లో పరిశీలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ మెసెంజర్ అస్ట్రానమీ అన్నమాట. ప్రపంచ నెట్వర్కులా... భారతదేశంలో లిగో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచానికి ఆకాశం మొత్తాన్ని చూసేందుకు వీలవుతుంది. ఏ దిక్కున ఎప్పుడు రెండు కృష్ణబిలాలు ఢీకొంటాయి? లేదా రెండు భారీ నక్షత్రాలు లయమైపోతాయో నిర్ధారించు కునే సామర్థ్యం లభిస్తుంది. అమెరికాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రాజె క్టులో భాగంగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో భారీ డిటెక్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని లిగో కేంద్రాలతో కలిసి ఈ డిటెక్టర్ కూడా పనిచేస్తుందన్నమాట. న్యూట్రాన్ స్టార్లు, కృష్ణబిలాలకు సంబంధించిన గురుత్వ తరంగ ఘటనలను వీటిద్వారా పరిశీలించవచ్చు. అంతేకాకుండా... సుమారు 1,300 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం కారణంగా పుట్టిందని నమ్ముతున్న విశ్వం తొలికాలం నాటి ప్రకంపనలనూ గుర్తించేందుకు బహుశా అవకాశం ఉంటుంది. యూరప్, జపాన్ లలోనూ లిగో డిటెక్టర్లు ఏర్పాటైతే అది ఒక ప్రపంచ నెట్వర్క్లా మారిపోతుంది. భారత్లోని లిగో డిటెక్టర్ పని మొదలు కాగానే... ఇప్పటికే అందుబాటులో ఉన్న రేడియో, ఆప్టికల్ టెలిస్కోపుల సాయంతో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఖగోళ ఘటనలు జరిగేందుకు కొన్ని నిమిషాల ముందునాటి కాలానికి చేర్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అమెరికా డిటెక్టర్లకు దూరంగా ఉన్న కారణంగా భారత్లోని డిటెక్టర్ ఇప్పటివరకూ చూడని ప్రాంతాలపై దృష్టి పెట్టవచ్చు. భారత్లో లిగో డిటెక్టర్ ఏర్పాటు అంతర్జాతీయ దృష్టికోణంలోనూ చాలా ముఖ్యమైన ఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిటెక్టర్ ఖగోళ ఘటనలను చూడగలిగే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది కాబట్టి! ఈ దేశ గడ్డపై ఓ అరుదైన పరిశోధనశాల ఏర్పా టైతే... మొదలైన తొలిరోజు నుంచి అంతర్జాతీయ స్థాయి మౌలిక పరి శోధనలు చేపడితే అది మనందరికీ గర్వకారణమైన అంశమే అవు తుంది. పైగా ఇదో అంతర్జాతీయ ప్రాజెక్టు. రియల్టైమ్లో పరస్పర సహకారం అవసరం అవుతుంది. ఈ క్రమంలో కొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. కొంగొత్త ప్రాజెక్టులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ శాస్త్రవేత్తలు ఈ రంగంలో తగిన అనుభవాన్ని గడించేందుకు సువర్ణావకాశమిది. (లిగో డిటెక్టర్ ప్రయోగాల ద్వారా సైన్స్ మరింత ముందుకు వెళ్లడం మాత్రమే కాదు... నోబెల్ అవార్డు అందుకోగల సత్తా ఉన్న అనేకానేక పరిశోధనలకు కేంద్రబిందువు గానూ మారుతుంది. భారతీయ శాస్త్రవేత్తలకూ నోబెల్ అవార్డులు దక్కే అవకాశం మరింత ఎక్కువవుతుందన్నమాట!) పరిశోధకులకు అద్భుత అవకాశం లిగో డిటెక్టర్ల నిర్మాణ దశలో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ పనులన్నీ భారత్లోనే జరగనున్నాయి. శక్తిమంతమైన లేజర్లు, అతిపెద్ద, భారీ వాక్యూమ్ పరికరాలు, అణుస్థాయిలో అత్యంత నున్నటి అద్దాలు... క్వాంటమ్ సెన్సింగ్, కంట్రోలింగ్ వ్యవస్థలన్నీ ఇక్కడే తయారైతే... దేశీ ‘ప్రిసిషన్ ఇంజినీరింగ్’ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా భవి ష్యత్తులో మన పారిశ్రామిక ఉత్పత్తి, నాణ్యత రెండూ ఎక్కువవు తాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అందుబాటులో ఉండనే ఉన్నారు. ఇప్పటికే నడుస్తున్న కంపెనీలు కూడా హైటెక్ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉంటుంది. లిగో డిటెక్టర్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఏజెన్సీ ఇప్పటికే ఈ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. లిగో– ఇండియా యువ భారతీయ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ స్ఫూర్తి తోనే చాలామంది విశ్వం దాచుకున్న అనేకానేక రహస్యాలను ఛేదించేందుకు ముందుకొస్తారు. సైన్స్ రంగంలో లిగో–ఇండియా ఏర్పాటు ఓ అద్భుతం. ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్తలు వీలైనంత వేగంగా డిటెక్టర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డాలి. సైన్స్ అంటే ఆసక్తి ఉన్నవారు... సైన్స్ వ్యాప్తికి కృషి చేస్తున్న వారు లిగో–ఇండియా ప్రాముఖ్యత, అవసరం, లక్ష్యాల గురించి ఈ తరం యువతకు తెలియ జేయాల్సిన సందర్భం కూడా ఇదే. భౌతికశాస్త్రం, దాని అనుబంధ రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఇదో అత్య ద్భుతమైన అవకాశం. స్నాతకోత్తర విద్యలో గురుత్వ తరంగాలపై పరిశోధనలను ఎంచు కోవడం ద్వారా లిగో– ఇండియా నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. అన్నీ సవ్యంగా సాగితే లిగో– ఇండియా నిర్మాణం మొత్తం పూర్తయ్యి సమాచార సేకరణ మొదలుపెట్టేందుకు ఇంకా ఏడేళ్ల సమయం(2030) ఉంది. రాణా అధికారి, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు; కె.విజయ్ రాఘవన్, కేంద్ర మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు; శివాజీ సోంధీ, ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మళ్లీ గురుత్వ తరంగాల గుర్తింపు
వాషింగ్టన్: విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువన్నారు. మూడు సూర్యులకు సమానమైన శక్తి ఈ గురుత్వ తరంగాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ప్రయోజనం ఏంటి? గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం ద్వారా ఖగోళంలో మనకు అంతుచిక్కని అనేక రహస్యాలను తెలుసుకోవచ్చు. విశ్వం ఆవిర్భావ (బిగ్బ్యాంగ్) సమయంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాంతిని విశ్లేషించడం ద్వారా టెలిస్కోపులు విశ్వంలోని సుదూర ప్రాంతాల సమాచారాన్ని అందిస్తాయి. అయితే కాంతి కంటే గురుత్వ తరంగాల ద్వారా అందే సమాచారం చాలా ఎక్కువగా, మరింత కచ్చితత్వంతో ఉంటుంది. గురుత్వ తరంగాల ద్వారా అవి జనించిన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాల ద్రవ్యరాశిని, అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు. తద్వారా విశ్వం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. భారతీయుల కీలక పాత్ర గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో–ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ–చెన్నై, ఐసీటీఎస్– బెంగళూరు, ఐఐఎస్ఇఆర్–కోల్కతా, ఐఐఎస్ఇఆర్–తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్ఆర్సీఏటీ ఇండోర్, టీఐఎఫ్ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. గురుత్వాకర్షణ తరంగాలు అంటే? కృష్ణ బిలాలు లేదా నక్షత్రాలు పరస్పరం ఢీకొన్నప్పడు ఈ గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయి. 1915లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం స్థల, కాలాలను ప్రభావితం చేసే శక్తి గురుత్వ తరంగాలకు ఉంటుంది. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలు తమ మార్గంలో అడ్డువచ్చే వస్తువులను ముందుకు తోస్తాయి. తద్వారా విశ్వం మరింతగా విస్తరిస్తుంది. ఈ గురుత్వాకర్షణ తరంగాల పరిమాణం అణువు కంటే చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని చాలాకాలంగా గుర్తించలేకపోయారు. ఐన్స్టీన్ కూడా వీటిని గుర్తించడం అప్పటి సాంకేతికతో సాధ్యం కాదని గతంలో అభిప్రాయపడ్డారు. -
భారత్లో మరో లిగో?
సాక్షి, హైదరాబాద్: గురుత్వ తరంగాలను గుర్తించేందుకు వాడే లిగో (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) వంటి ప్రయోగశాలను భారత్లోనూ ఏర్పాటు చేస్తారా? మరింత సున్నితమైన గురుత్వ తరంగాలను గుర్తించడంలో ఈ కొత్త లిగో కీలకపాత్ర పోషించనుందా? అవునంటున్నారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థిరాటికల్ సెన్సైస్ (ఐసీటీఎస్) శాస్త్రవేత్తలు. అమెరికా సాయంతో భారత్లో లిగో వంటి అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఒకటి చాలాకాలంగా ఉందని, తాజా ఆవిష్కరణతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు పెరిగాయని ఐసీటీఎస్ శాస్త్రవేత్త పరమేశ్వరన్ అజిత్ ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (గాంధీనగర్), ఇంటర్ యూనివర్శీటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ (పూణే), రాజా రామణ్ణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఇండోర్)లు కలిసికట్టుగా ‘లిగో-ఇండియా’ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2012లోనే ఇందుకు కసరత్తు మొదలైంది. రూ.1,260 కోట్ల ఈ ప్రాజెక్టు కోసం రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలను ఎంపిక చేశారు. వీటిల్లో ఒకచోట కొత్త లిగో ఏర్పాటు కావచ్చు. కేంద్ర కేబినెట్ అనుమతి లభించాక పనులు చేపట్టి 2020 నాటికి దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. 1992లో అమెరికాలోని కాల్టెక్, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా గురుత్వ తరంగాల గుర్తింపునకు లిగోను ఏర్పాటు చేశాయి. దీంట్లో ఉన్న రెండు డిటెక్టర్లూ అమెరికాలోని లివింగ్స్టోన్ (లూసియానా), హాన్ఫర్డ్ (వాషింగ్టన్)లలో ఉన్నాయి. ఇవి కాకుండా జర్మనీ, ఇటలీ, జపాన్లలోనూ లిగో తరహా ప్రయోగశాలలున్నాయి. విశ్వం నుంచి భూమివైపుకు వచ్చే మరింత సున్నితమైన తరంగాల గుర్తింపు, అధ్యయనానికి ఇవి సరిపోవని శాస్త్రవేత్తల భావన. ఎక్కువ లిగోల ఏర్పాటు ద్వారా గురుత్వ తరంగాలు, స్థానిక ఇతర తరంగాలను వేరు చేయడం సులువని వీరి అంచనా. భారత్లో పరిశోధన శాల ఏర్పాటు ద్వారా తరంగాలు ఆకాశంలోని ఓ నిర్దిష్ట ప్రాంతం నుంచి వస్తున్నవేనని నిర్ధారించేందుకు వీలుంటుంది. లిగో సామర్థ్యాన్ని పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తే విశ్వంలో ఇప్పటివరకూ మనం గమనించదగ్గ దూరాలకు మూడు రెట్లు ఎక్కువ దూరాల నుంచి వచ్చే గురుత్వ తరంగాలను గుర్తించవచ్చు.