breaking news
Laxminarasimha Shastri
-
గుండెపోటు వంశపారంపర్యమా...?
నా వయసు 44 ఏళ్లు. మా నాన్నగారు తన 58వ ఏట హార్ట్ ఎటాక్తో చనిపోయారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందా? రాకుండా నివారించాలంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జాగ్రత్తలేమిటి? - ఎమ్. కేశవరావు, విశాఖపట్నం గుండె ఒక ప్రత్యేక కండరంతో తయారైన అవయవం. దీని పని నిరంతరం సంకోచిస్తుండటం, వ్యాకోచిస్తుండటం. సంకోచించినప్పుడు మొత్తం శరీరానికి రక్తం సరఫరా అవుతుంది. వ్యాకోచించినప్పుడు మొత్తం శరీరం నుంచి రక్తం గుండెకు చేరుతుంది. స్థూలంగా ఇదీ దీని పని. శరీరంలో ప్రతి చిన్న కణానికీ, ప్రతి కండరానికీ, ప్రతి అవయవానికీ రక్తం సరఫరా అయినప్పుడే అవి జీవిస్తాయి. వాటివాటి పనులను సక్రమంగా నిర్వహిస్తాయి. ఈ సూత్రం గుండెకండరానికి కూడా వర్తిస్తుంది. రక్తసరఫరా నిమిత్తం గుండె నుంచి ఒక పెద్ద సైజు ధమని బయటకు వస్తుంది. దీనికున్న మొట్టమొదటి శాఖలే కొరొనరీ ధమనులు అనే రక్తనాళాలు. వీటి ద్వారా గుండె కండరానికి రక్తం అందుతుంది. ఇక్కడ విశేషమేమిటంటే... గుండె గదుల్లో ఉన్న శుద్ధ రక్తం ఫిల్టరేషన్ (మెల్లగా పీల్చుకోవడం) ప్రక్రియ ద్వారా గుండె కండరానికి అందే పద్ధతి లేదు. ఇదే సృష్టి విచిత్రం. అలాగకానీ ఉంటే మానవాళికి హార్ట్ ఎటాక్లు వచ్చేవే కాదు. పైన వివరించిన కొరొనరీ ధమనుల్లో రక్తప్రసరణకు అవరోధం కలిగినప్పుడు, గుండెకండరాలకి అందే రక్తం తగ్గిపోవడం జరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల ఈ అవరోధం ఏర్పడుతుంది. ఈ రక్తపు గడ్డల పరిమాణాన్ని బట్టి ఎటాక్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు ఈ కొరొనరీ ధమనుల్లో గల సూక్ష్మాతిసూక్ష్మ శాఖల ద్వారా ‘బైపాస్’ ప్రసరణ చేసుకోగల శక్తి కొంతవరకు శరీరానికి ఉంటుంది. ఇదీ సృష్టి ప్రసాదించిన సహజ ప్రక్రియే. సర్జన్లు బైపాస్ సర్జరీ చేసినప్పుడు సత్ఫలితం కనిపిస్తుంది. కానీ ఇది సంపూర్ణంగా విజయవంతమవ్వాలంటే, శరీరానికి ఉన్న స్వతస్సిద్ధమైన బైపాస్ ప్రసరణ సమర్థతను బట్టే ఆధారపడి ఉంటుందని కొన్ని సిద్ధాంతాలు శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఆహారంలో అతిగా కొవ్వుపదార్థాలు తింటే, అవి సంపూర్ణంగా ధాతు పరిణామం కాకపోవడం వల్ల రక్తనాళాలలో పేరుకుపోయి అవరోధం కలిగిస్తాయి. రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తాయి. అనూహ్యంగా భయభ్రాంతులకు గురికావడం; ఒక్కసారిగా కానీ క్రమక్రమంగా గాని మానసిక ఒత్తిడులకు గురికావడం; ధూమపాన, మద్యపానాల వంటి మత్తుపదార్థాల దుష్ర్పభావాలు; స్థూలకాయం; మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులలో ఉపద్రవంగా కూడా గుండెపోటు సంభవించవచ్చు. అయితే చాలా తక్కువ శాతంలో మాత్రమే వారసత్వంగా గుండెపోటు కనిపిస్తుంది. కాబట్టి మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నివారణ: పైన చెప్పిన కారణాలను దూరం చేసుకోవడం ప్రధానాంశం. ఆహారం: ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. నూనెలు, వేపుళ్లు, వెన్న, నెయ్యి, ఇతర మధురపదార్థాలు, ఐస్క్రీమ్లు, శీతలపానీయాలు, జంక్ఫుడ్స్ పూర్తిగా వదిలేయాలి. ఆయుర్వేద సిద్ధాంతాలరీత్యా తగు ప్రమాణాల్లో నువ్వులనూనె, ఆవునెయ్యి వాడటం వల్ల శరీరానికి కొంతమేలు జరుగుతుందే తప్ప హాని ఉండదు. పీచు పదార్థాలున్న ఆహారం, మొలకలు, గ్రీన్ సలాడ్సు బాగా తీసుకోవాలి. శుష్కంగా ఉండే ఫలాలు మితంగా తినాలి. శాకాహారం, సాత్వికాహారం మంచి ప్రభావం చూపిస్తాయి. విహారం: ఎవరి తత్వాన్ని బట్టి వారికి తగినంత ‘వ్యాయామం’ చేయటం అత్యావశ్యకం. నడక, ఆటలు, యోగాసనాలు మొదలైనవన్నీ వ్యాయామంలో అంతర్భాగాలే. రాత్రిపూట నిద్ర కనీసం ఆరుగంటలపాటు అవసరం. రెండుపూటలా పదేసి నిమిషాలపాటు ప్రాణాయామం చేయాలి. ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, నవ్వుతూ, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ఉండటం అలవరచుకోవాలి. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడి, ఒత్తిడులను దూరం చేస్తుంది. ఔషధం: రోజూ ఉదయం పరగడుపున ‘అల్లం మరియు వెల్లుల్లి’ కషాయం ఆరు చెంచాల మోతాదులో తాగాలి. వారానికి మూడుసార్లు, సాయంత్రం పూట ‘తిప్పతీగె’ (గుడూచి) కషాయం కూడా తాగితే మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా త్రిఫలచూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ) నీళ్లతో సేవించాలి. గమనిక: ఈ సూచనలు పాటిస్తే హార్ట్ఎటాక్ మాత్రమే కాకుండా పక్షవాతం (బ్రెయిన్స్ట్రోక్) కూడా నివారితమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అప్పుడప్పుడూ మీకు నచ్చిన కొవ్వుపదార్థాలు, మధురపదార్థాలు తిన్నా పర్వాలేదు. కానీ దానికి విరుగుడుగా మూడు కిలోమీటర్లు నడవండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
ఆస్తమా నుంచి ఉపశమనమెలా...?
నా వయసు 46. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉంది. చలికాలంలో తప్పనిసరిగా బయటపడుతుంది. పిల్లికూతలతో కూడిన ఆయాసం వస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. చాలా మందులు వాడాను. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వత నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయ ప్రార్థన. - భ్రమరాంబ, చేవెళ్ల మీకున్న సమస్యను ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు... అసాత్మ్యత (అలర్జీ) కావచ్చు. ఇది ఆహారపదార్థాలతో రావచ్చు. బాహ్యవాతావరణంలోని అంశాలు కావచ్చు. గాలిలో తేమ, దుమ్ము, ధూళి, మేఘావృత వాతావరణం, అతిశీతల వాతావరణం, మరికొన్ని కంటికి కనిపించని ఇతర పదార్థాలు మొదలైనవి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి సిమెంట్, కెమికల్స్, ఆయిల్స్ మొదలైనవి పడకపోవచ్చు. కొంతమందికి వారసత్వం ఒక కారణం. మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ‘యాప్య’ వ్యాధిగా స్పష్టీకరించింది. అంటే పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహార, విహార, ఔషధాల ద్వారా నియంత్రించుకోగల్గిన వ్యాధి అని అర్థం. ఆయాసం ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. పరిశ్రమచేస్తే ఇది మరింత ఎక్కువవుతుంది. చలి నుంచి కాపాడుకోవాల్సిన దుస్తులు ధరించాలి. కొంచెం బోర్లా పడుకునే భంగిమలో ఉపశమనం లభిస్తుంది. ఆయాసం తగ్గేవరకు వేడివేడిగా ఉండే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లటి వస్తువులను దూరంగా ఉంచాలి. మందులు ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి. దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ... ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసార్లు తాగాలి. భారంగ్యాది చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది. శృంగారాభ్రరస మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 అగస్త్యహరీతకీ రసాయన (లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి. గృహవైద్యం ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం. గమనిక: కొంతమంది నాటువైద్యులు, నకిలీవైద్యులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని అనేక ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ వారి వారి మందులు అమ్ముకుంటుంటారు. ఇలాంటి మోసాలకు బలికావద్దు. మరికొంతమంది కొన్ని ఆయుర్వేద మందులలో అల్లోపతికి సంబంధించిన ‘స్టెరాయిడ్స్’ కలిపి అమ్ముతుంటారు. స్టెరాయిడ్స్ వల్ల నాటకీయ ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా వారి వలలో పడతారు. ఇది ప్రమాదమని గ్రహించాలి. మీకు దేనివల్ల ఆసాత్మ్యత కలుగుతోందన్న అంశాన్ని లేదా ఇతర కారణాలను గమనించగలిగితే దానిని దూరం చేయాలి. దీనిని ‘నిదానపరివర్జనం’ అంటారు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్