breaking news
Kondapalli sesagiriravu
-
చిత్ర, శిల్పకళా విమర్శకు చిరునామా
కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో శిల్ప చిత్రకళ పరంపర అవిచ్ఛిన్నమైనది. చిత్రకళనే వృత్తిగా భావించి దానినే అంటిపెట్టుకుని జీవనం సాగించిన ‘నకాషి’ సామాజిక వర్గం తెలంగాణలో ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శతాబ్దాల తరబడి చిత్రకళకు కేంద్రం. ఈ క్రమంలో చిత్ర శిల్పకళా చరిత్రనూ, అందులోని పరిణామ క్రమాన్నీ అధ్యయనం చేసి, వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించిన రచయిత, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. 1950 నుంచి 90 వరకు ఆయన 37 వ్యాసాలు రాశారు. అవి ‘చిత్ర, శిల్పకళా రామణీయకము’ పేరుతో 2009లో పుస్తకంగా వెలువడ్డాయి. కాకతీయుల అలంకరణ కళ, తెలంగాణలో పటచిత్ర కళ, గోడచిత్ర కళతోపాటు, ఒక వ్యక్తి చిత్రకారుడిగా మారే క్రమంలో అనుభవించే మానసిక పరిస్థితిపై, నేటికాలాన చిత్రకళారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కొండపల్లి వ్యాసాలు రాశారు. తెలంగాణ చరిత్రలో ‘దక్కన్ కలాం’పై రాస్తూ అందులోని భిన్నదశలను ప్రస్తావించారు. సాధారణంగా తన సమకాలీనుల ప్రతిభ గురించి ఏ చిత్రకారుడూ రాయడు. కాని ఆయన పీటీ రెడ్డి సహా కాపు రాజయ్య, అంట్యాకుల పైడిరాజు, ముస్లిం చిత్రకారణి కమలేష్ ప్రత్యేకతలేమిటో తెలిపారు. రాజకీయ నాయకురాలిగానే తెలిసిన సంగెం లక్ష్మీబాయమ్మను చిత్రకారిణిగా పరిచయం చేశారు. ఆదిమకళతో మొదలై, ఆధునిక సర్రియలిస్టు ప్రక్రియ ప్రస్తావనతో పుస్తకం ముగుస్తుంది. (జనవరి 27న కొండపల్లి శేషగిరిరావు జయంతి) సామిడి జగన్రెడ్డి 8500632551 -
అలనాటి చిత్రం
భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రముఖ ఆర్టిస్ట్ కొండపల్లి శేషగిరిరావు పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంది. ప్రతి చిత్రం వర్ణరంజితమై ఆకట్టుకుంది. రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో మంగళవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలోని పెయింటింగ్స్ను మంత్రి చందూలాల్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శేషగిరిరావు పేరిట నగరంలో చిత్రకళా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తాం. కాపు రాజయ్య, శేషగిరిరావు, పీటీ రెడ్డిల పేరు మీద ఏటా ఉత్తమ చిత్రకారులకు రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తాం. అలాగే కొండపల్లి జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, భాషాసాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఎం.హరికృష్ణ తదితరులు శేషగిరిరావు ప్రతిభను కీర్తించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాక్షి, సిటీప్లస్