kadthal toll plaza
-
కడ్తాల్లో కారు బీభత్సం
కడ్తాల్: హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై కడ్తాల్ మండల కేంద్రం సమీపంలో టోల్ప్లాజా వద్ద కారు టైర్ పగిలి ఎదురుగా వస్తున్న ఆటోతో పాటు మూడు బైక్లను ఢీకొట్టిన సంఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు టైర్ కడ్తాల్ టోల్ప్లాజా సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కూరగాయల ఆటోతో పాటు మూడు బైక్లను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్లపై ఉన్న కడ్తాల్కు చెందిన నార్లకంటి యాదయ్య, జల్కం బీరప్ప, మరో బైక్పై ఉన్న కాలె శ్రీను, ఒగ్గు మహేశ్, ఇంకో బైక్పై ఉన్న పాపయ్య, హేమలత, ఆటోలో ఉన్న సుజాత, జ్యోతి, వెంకటేశ్లకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఆమనగల్లు, హైదరాబాద్ ఆస్పత్రిలకు తరలించారు. వీరిలో కడ్తాల్కు చెందిన నార్లకంటి యాదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'అదంతా అబద్ధం.. అందులో వాస్తవం లేదు'
హైదరాబాద్: కడ్తాల్ టోల్గేట్ సిబ్బందిపై తన కుమారుడు మనీష్ దాడి చేసినట్టు వచ్చిన వార్తలను టీఆర్ఎస్ నేత రామ్మోహన్ గౌడ్ ఖండించారు. తన కొడుకు ఎవరిపై దాడి చేయలేదని, ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. దాడి జరిగిన సమయంలో మనీష్ డ్రైవింగ్ సీటులో ఉన్నాడని, అతడి స్నేహితుల్లో ముగ్గురు దాడి చేశారని వెల్లడించారు. గాయపడిన టోల్గేట్ సూపర్ వైజర్ తమ దూరపు బంధువని తెలిపారు. కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి వెళ్లేటప్పుడు రాను, పోను టోల్ చెల్లించారని చెప్పారు. టోల్ చెల్లించలేదనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడు తప్పు చేసివుంటే శిక్షించాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ ద్వారా తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసినట్టు శంషాబాద్ డీసీపీ తనకు తెలిపారని వెల్లడించారు. ఆరుగురు నిందితులు కస్టడీలో ఉన్నారని చెప్పారు. టోల్గేట్ డబ్బులు అడిగినందుకు సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి టోల్గేట్ సిబ్బందిపై మనీష్ గౌడ్ దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గండిమైసి టోల్గేట్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మనీశ్, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మనీష్ గౌడ్ తల్లి లక్ష్మీప్రసన్న వనస్థలిపురం బీఎన్రెడ్డి నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. A case is registered under 307 IPC and all six accused in custody and being remanded. Update from DCP Shamshabad https://t.co/3rqdJ180gP — KTR (@KTRTRS) 1 August 2017