breaking news
Jawaharlal Nehru Architecture and phainarts University
-
మనసు చిత్రం పదిలం
మనసులోని భావాలను కాన్వాస్పై కుంచెతో పలికిస్తాడు చిత్రకారుడు. ఆ కళకు ఇప్పుడు సాంకేతికత తోడైంది. కుంచెకు ఫొటోషాప్ హంగులు మిళితమై... ‘చిత్రం’ బహుచిత్రమై... డిజిటల్ దారులు పడుతోంది. ఈ పరంపరలో అసలు రూపంలోని సహజ సౌందర్యం అ‘దృశ్య’మైపోతుందన్నది కొందరి వాదన. ఇదే ప్రశ్న మాసబ్ట్యాంక్ ‘జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ’ విద్యార్థులను అడిగితే... ఆసక్తికరమైన పెద్ద చర్చకే తెర తీశారు. భరత్: డిజిటల్ఎరా వచ్చాక బుర్రకు పని తగ్గిన విషయం నిజమే. కానీ సృజనాత్మకతకు ఉండే విలువ టెక్నాలజీని ఉపయోగించి చేసిన బొమ్మల్లో ఎంత వెదికినా కనిపించదు. కాత్యాయిని: మాలాంటి ఆర్ట్ స్టూడెంట్స్పై కూడా టెక్నాలజీ ప్రభావం బాగానే ఉంది కానీ, కుంచె ప్రత్యేకత కుంచెదే కదా! ఫొటోషాప్తో చేసిన బొమ్మలు చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ భావం ఉండదు కదా! అది కావాలంటే మళ్లీ కళాకారుడి దగ్గరకే రావాలి. చంద్ర: యస్... కంప్యూటర్ బొమ్మలను ఎన్నంటే అన్ని కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కానీ చేత్తో గీసిన వాటిని అలా సృష్టించుకోలేం కదా. ఆ అవకాశం ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మొనాలిసా చిత్రం ఉండేదేమో. భరత్: పూర్వం తీసిన ఫొటో సరిగ్గా వచ్చిందా లేదో తెలుసుకోవాలంటే రీల్ కడిగితే కానీ తెలిసేది కాదు. ఇప్పుడలా కాదు.. క్లిక్ కొట్టినంత తేలిగ్గా డిలీట్ కూడా కొట్టేసుకుంటున్నాం. సందీప్ చంద్ర: ఎన్ని కొత్త యాప్లొచ్చినా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్కి ఉండే క్రేజ్ పదిలం. ప్రియాంక: పూర్వం వీధికో ఫొటో స్టూడియో ఉండేదట. ఇప్పుడు ఎక్కడో వెదికితే తప్ప కనిపించడం లేదు. కార్తీక్: ఉన్నవారు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని బిజినెస్ బాగా చేసుకుంటున్నారు. హరిణి: ఫొటోగ్రఫీకి వాడుకున్నంతగా పెయింటింగ్లకు ఆర్ట్ని వాడుకోలేం. పై పై రంగులు అద్దినా... ఒరిజినల్కే క్రేజ్ ఎక్కువ. సందీప్ చంద్ర: టెక్నాలజీ సంగతి పక్కన పెడితే అసలు ఫైనార్ట్స్కి ఎంత క్రేజ్ ఉందో మాట్లాడుకుందాం. హరిణి: ఎంత అనేకంటే... అసలు ఉందా అని ప్రశ్నించుకుంటే మేలేమో! నా విషయం చూసుకుంటే ఇంటర్ అయ్యాక.. ఫైనార్ట్స్లో చేరాతానంటే ఇంట్లో అందరూ తిట్టారు. అది నేర్చుకుంటే ఏం వస్తుందన్నారు. కాత్యాయిని: దాన్ని ఇష్టం లేకపోవడం అనేకంటే అవగాహన లోపం అనొచ్చు. భరత్: ఎగ్జాక్ట్లీ... మన దగ్గర ఆర్ట్ని ప్రేమించేవారు, అర్థం చేసుకునేవారు, ప్రోత్సహించేవారు బాగా తక్కువ. కాత్యాయిని: అదే విదేశాల్లో అయితే... ఆర్ట్దే మొదటి స్థానం. కేజీ చదువుల నుంచే దీనిపై శ్రద్ధ పెడతారు. సందీప్ చంద్ర: పెయింటింగ్ నేర్చుకుంటానంటే.. బొమ్మలు గీసుకుంటూ ఎలా బతుకుతావురా అంటారు. ఫొటోగ్రఫీ అంటే స్టూడియో పెట్టుకుంటావా అంటూ ఎగతాళి చేస్తారు. ఆర్ట్ని గుర్తించి, గౌరవించేవారు చాలా తక్కువ. భరత్: పెయింటింగ్, ఫొటోగ్రఫీల్లో ప్రొఫెషనల్స్ అయి బాగా సంపాదించేవాళ్లు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు కానీ తగిన పబ్లిసిటీయే లేదు. కాత్యాయిని: ఎన్ని చెప్పినా... నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్లో ఆర్ట్కున్న ప్రాధాన్యం తక్కువనిపిస్తుంది. భరత్: పెయింటింగ్స్ చాలా ఖరీదనే కామెంట్ ఉంది. చంద్ర: అలాగని పెయింటింగ్ డబ్బున్నవారిదే అనుకోవద్దు. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే గ్యాలరీ షోలు కూడా ఇక్కడ ఉన్నాయి. సందీప్ చంద్ర: ఆర్టిస్ట్లు చేసే చారిటీ కూడా గుర్తుచేసుకోవాలి. బెంగుళూరులో కళాకారుడైన చింత భట్టాచార్య తన పెయింటింగ్లను ఒక స్వచ్ఛంద సంస్థకు ఉచితంగా ఇచ్చేశారు. కాత్యాయిని: ఆర్ట్కి ఆదరణ పెంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా సహకరిస్తాయి. భరత్: చివరగా.. ఎన్ని రకాల టెక్నాలజీలు వచ్చినా.. సహజసిద్ధమైన ఆర్ట్కు ఉండే ప్రాధాన్యం ఎప్పటికీ తరగదు. ఫొటోగ్రఫీలోనైనా, పెయింటింగ్లోనైనా నిలదొక్కుకుని తమని తాము నిరూపించుకోవాలంటే మాత్రం జీవితం మొత్తం ఆ కళకు అంకితమివ్వాలి. ఆపై రావల్సిన పేరు దానంతట అదే వస్తుందని నిరూపించిన ఆర్టిస్టులు మన ముందే చాలా మంది ఉన్నారు. -
స్టాన్లీ సురేష్ సస్పెన్షన్
మెహిదీపట్నం, న్యూస్లైన్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఫైన్ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ను పాలకవర్గం సస్పెండ్ చేసింది. గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యం చేసుకొని.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వర్సిటీ వీసీ పేర్వారం పద్మావతి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సురేష్పై తదుపరి చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కమిషన్ తెలిపింది. అంతకుముందు హైడ్రామా.. చిత్రకళ ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ సుమోటాగా కేసు నమోదు చేసుకుంది. గురువారం మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ టి.వెంకటరత్నంతో పాటు సభ్యులు సుమితకృష్ణన్, జమున.. వీసీ పేర్వారం పద్మావతి ఛాంబర్లో సుదీర్ఘంగా విచారించారు. విద్యార్థినుల నుంచి వెంకటరత్నం ఫిర్యాదులను స్వీకరించారు. తమను ప్రొఫెసర్ ఎలా వేధిస్తున్నదీ విద్యార్థినులు ఏకరువు పెడుతూ కంటతడి పెట్టారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఆమె విద్యార్థులకు హామీనిచ్చారు. 1995 నుంచి ప్రొఫెసర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా, ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోవటంతో ఎందుకు ఉపేక్షించారంటూ కమిషన్ సభ్యులు వీసీని ప్రశ్నించారు. వర్సిటీలో మహిళా వేధింపుల నిరోధక కమిటీ లేదని తెలుసుకుని నివ్వెరపోయారు. గతంలో ఆయనపై చర్యలు తీసుకున్నప్పుడు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయని వీసీ తదితరులు సభ్యులకు వివరించారు. అటువంటి వ్యక్తిని ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయాల్సిందేనంటూ కమిషన్ పట్టుబట్టడంతో చివరకు సురేష్ను సస్పెండ్ చేశారు. విచారణకు హాజరుకాని సురేష్.. వర్సిటీలో గురువారం జరిగిన విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్ హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వీసీకి ఫోన్చేసి 15 నిమిషాల్లో వస్తానని, భద్రత కావాలని కోరారు. అందుకు ఏర్పాట్లు చేసినా ఆయన రాలేదు. అంతలో కొందరు దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అంతలో ‘అరుణోదయ’ విమలక్క.. విద్యార్థినులకు మద్దతుగా అక్కడికి వచ్చారు. సురేష్ 15 ఏళ్లుగా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని పాలకవర్గాన్ని ప్రశ్నించారు. చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ ప్రొఫెసర్ దళిత కార్డు ప్రయోగిస్తున్నారని తెలిసి విమలక్క విస్తుపోయారు. సురేష్కు మద్దతుగా నినాదాలు చేసిన దళిత సంఘాల నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.