breaking news
handlooms ambassador
-
కాన్స్లో మెరిసిన ఇక్కత్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఈసారి సెలబ్రిటీలు మాత్రమే నడవలేదు. రెండు వందల ఏళ్ల తెలంగాణ చేనేత చరిత్ర నడిచింది! గ్రామీణ భారతీయ కళాకారుల ప్రతిభ ప్రపంచాన్ని తాకింది. గ్రామీణ మగ్గం నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ వరకు సాగిన ఈ ప్రయాణం తెలంగాణ చేనేతకు కొత్త దారులు తెరిచింది. ప్రపంచ సినీ రంగం తాలూకు అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా గుర్తింపు పొందిన కాన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు తొలిసారిగా మెరిశాయి. ఆ చారిత్రాత్మక సమయానికి ప్రతీకగా, సాక్షిగా నిలిచారు మిస్ ఆసియా ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ఇక్కత్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్...భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ మద్దతుతో పాటు పోచంపల్లికి చెందిన 30 మందికి పైగా మాస్టర్ నేతన్నలు కలిసి వందల గంటల శ్రమతో కాన్స్ ఫెస్టివల్ కోసం ప్రత్యేక దుస్తులను రూపొందించారు.ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై గురువారం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రష్మీ ఠాకూర్ ర్యాంప్ వాక్ చేశారు. దీంతో పోచంపల్లి నేత కార్మికులు చేతితో నేసిన ఎఐ ట్యాగ్ పొందిన డబుల్ ఇక్కత్, తెలియా రుమాల్ నైపుణ్యాలతో రూపొందించిన ఆ వస్త్రం ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఆకర్షించింది. ‘పోచంపల్లి టు కాన్స్’ అనే కాన్సెప్ట్తో రూపొందించిన ఈ కౌచర్ కాస్ట్యూమ్లో తెలంగాణ చేనేత వైభవం, భారతీయ హస్తకళ ప్రతిభ, సంప్రదాయం, ఆధునికతలు ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్గా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన భగత్సింగ్, ప్రసన్నలక్ష్మీల దంపతుల కూమారై రష్మీ ఠాకూర్ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన అడుగులు వేస్తూ మిస్ ఏషియా ఇంటర్నేషనల్, నేషనల్ అంబాసిడర్ ఫర్ హ్యాండ్లూమ్గా ఎన్నికయ్యారు.ప్రపంచ వేదికపై మన రాజసంకాస్ట్యూమ్స్కు జతగా రష్మీ ధరించిన ప్రసిద్ధ హైదరాబాదీ ముత్యాలు ఆ అందాన్ని మరింత రాజసంగా మార్చాయి. నిజాం రాజుల వారసత్వాన్ని గుర్తు చేసే ఆ ముత్యాలు ఇక్కత్ నమూనాలతో అద్భుతంగా కలిసిపోయి భారతీయ కళాసంపదకు ప్రపంచ వేదికపై సరికొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగువేల మందికి పైగా జర్నలిస్టులు, కోట్లాది మంది ప్రేక్షకులు చూసే కాన్స్ వేదికపై తెలంగాణ చేనేత ప్రతిష్టాత్మకంగా నిలవడం చేనేత రంగానికి చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రపంచ మార్కెట్లలో పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపు, డిమాండ్, గౌరవం తీసుకురావడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషించనుంది.ఇది తెలంగాణ అరంగేట్రం!ఇది నా ఒక్కరి అరంగేట్రం కాదు. ఇది తెలంగాణ అరంగేట్రం. పోచంపల్లిలో వందల గంటలు మగ్గం ముందు కూర్చుని కష్టపడిన ప్రతి నేతన్న కల ఇది. మన దారం ఇప్పుడు ప్రపంచ దారం అయింది. తెలంగాణ చేనేతను ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్ వేదికపై నిలబెట్టడం నా లక్ష్యం. ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. – రష్మీ ఠాకూర్– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి -
హీరోయిన్ పై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: చేనేతను ప్రోత్సహించేలా హీరోయిన్ సమంత ముందుడుగు వేయడం పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం మంచి పరిణామమని ట్విటర్ లో కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఉన్న సమంత గత శుక్రవారం(మార్చి 10) సిద్దిపేటలో పర్యటించారు. పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు. తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్ పార్క్ను సందర్శించారు. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. చేనేత సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి మద్దతు పలకడంతో సమంతకు గతంలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు. Good start @Samanthaprabhu2 Understanding the nuances & real issues faced by Handloom weavers with your field tours to Dubbak & Pochampalli pic.twitter.com/y3dcWk0tcf — KTR (@KTRTRS) 17 March 2017


