breaking news
Green resorts
-
పీపీపీతో విశాఖ టూరిజం అభివృద్ధి
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి విశాఖపట్నం : పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) విశాఖ టూరిజం అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రుషికొండ ఏపీ టూరిజానికి చెందిన హరితా రిసార్ట్స్లో బుధవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏపీ టూరిజం అధికారులు, కలెక్టర్, జీవీఎంసీ అధికారులతో విశాఖ టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ముందుగా టూరిజం శాఖ ఎండీ చందన్ఖాన్ విశాఖలో చేపట్టనున్న ప్రాజెక్టులు, వాటికి ఎంతెంత నిధులు కేటాయించనున్నారో వివరించారు. విశాఖ రీజియన్లో సింహాచలం, లంబసింగి, పాడేరు, తొట్లకొండ, అరకువేలీ, మత్స్యగుండం, కొండకర్ల తదితర ప్రాం తాల అభివృద్ధికి రూ.183 కోట్లు కేటాయించామన్నారు. మరో రూ.51 కోట్లతో విశాఖ-భీమిలి బీచ్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నామన్నారు. రూ.300 కోట్లతో మధురవాడలో టూరిజం పార్కు, పాడేరులో రూ.55 కోట్లుతో బొటానికల్ గార్డెన్స్, రూ.3 కోట్లతో ఆర్కే బీచ్లో 26 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. హైదరాబాద్లో గల రవీంద్రభారతి తరహాలో రూ.50 కోట్లతో విశాఖలో కూడా ఆడిటోరియం నిర్మిస్తామన్నారు. విశాఖ ఉత్సవాలను డిసెంబర్ 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల 27న మధురవాడ జాతరలో రాత్రి బజార్ను ప్రారంభించనున్నామని చెప్పారు. మంత్రి గంటా మాట్లాడుతూ సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించాలన్నారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకట్టుకోవాలన్నారు. హైదరాబాద్లో అధికారులుంటే ఎలా? హైదరాబాద్లో టూరిజం అధికారులుంటే విశాఖలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ఎంపీ కంభంపాటి హరిబాబు అధికారులను నిలదీశారు. టూరిజం అధికారులు విశాఖను నిర్లక్ష్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అందుకే టూరిజం అభివృద్ధి పనులు జరగడంలేదని అనడంలో అర్థంలేదన్నారు. పాడేరులో టూరిజం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించగా, రూ.4.5 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. చిరంజీవి అన్నే నిధులు కేటాయించారు : గత ప్రభుత్వం హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మం త్రిగా ఉన్న చిరంజీవి అన్న విశాఖ బీచ్ అభివృద్ధికి కృషి చేశారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ మంత్రులు పదేళ్లగా విశాఖలో పర్యాటకం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇదే వేదికపై చెబుతుంటే, అవంతి మాత్రం గత ప్రభుత్వంలో అన్న చిరంజీవి పర్యాటకం అభివృద్ధికి కృషి చేశారనడం విశేషం. సమీక్షలో మంత్రి కామినేని శ్రీ నివాసరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్రాజు, గణబాబు, వాసుపల్లి గణేష్కుమార కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్కుమార్, జీవీఎంసీ, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో పోలీసులకు ఇక వారాంతపు సెలవు
అమలు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఎస్పీ రాజకుమారి అనంతగిరి: పోలీసులకు ఇక నుంచి వారంతపు సెలవులు అమలుపరుస్తామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టలోని హరిత రిసార్ట్స్లో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వారాంతపు సెలవును ఆయా పీఎస్ల ఎస్హెచ్ఓలు రొటేషన్ పద్ధతిలో అందరికి వచ్చేలా చూడాలన్నారు. ఇక నుంచి ప్రతినెల సిబ్బంది సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే అక్కడ విన్నవించుకోవచ్చన్నారు. పోలీసుల సంఘం కార్యాలయం కోసం తమ కార్యాలయ పరిధిలోని ఓ గదిని కేటాయిస్తున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. పోలీసుల నివాసాల మధ్య డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.85 లక్షలు మంజూరైనట్లు చెప్పా రు. రాజీవ్ గృహకల్ప ఎదుట పోలీసుశాఖకు ఉన్న స్థలంలో మహిళా పీఎస్ ఏర్పాటుకు నిధులు మం జూరయ్యాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్పీల సమావేశంలో వికారాబాద్, తాండూరులలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డీజీపీకి విన్నవించినట్లు చెప్పారు. అనంతరం తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ పోలీసుల కోసం కల్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డీపీఓలో ఉన్న క్యాంటీన్లో కిరాణా సరుకులు కూడా విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సంఘం తరఫున ఎస్పీని, ఏఎస్పీని, డీఎస్పీలను సన్మానించారు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన అన్ని విభాగాల సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణామూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, డీఎస్పీలు షేక్ ఇస్మాయిల్, నర్సింలు, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్, రాష్ట్ర కో-ఆప్షన్ మెంబర్ చైతన్యకుమార్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.