breaking news
Green House projects
-
అరల్లో ఎకరాలు ఎకరాలు!
ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. వెళ్లే కార్లు మొన్నటి మాదిరిగా లేవు. నడిచే రోడ్లు, ఉండే ఇళ్లు కూడా గతంలోలా లేవు. తాజాగా ఈ జాబితాలోకి వ్యవసాయం కూడా చేరిపోతోంది! నిన్న మొన్నటి దాకా గ్రీన్హౌస్ వ్యవసాయంపై బోలెడన్ని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. వర్టికల్ ఫార్మింగ్దే హవా. ఫొటోలో కనిపిస్తున్న సోలార్ ప్యానెళ్లను చూశారుగా.. ఇవి కూడా ఓ వర్టికల్ ఫార్మ్వే. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని బ్రదర్లీ లవ్ భవనంలో ఏర్పాటైంది ఈ నిట్టనిలువు వ్యవసాయ క్షేత్రం. మెట్రోపోలిస్ ఫార్మ్ పేరుతో ఏర్పాటైన ఈ క్షేత్రం విస్తీర్ణం 2.2 ఎకరాలు మాత్రమే కానీ... 660 ఎకరాల సాధారణ నేలలో పండించేంత మోతాదులో పంటలు పండుతాయి ఇక్కడ. అబ్బో అదెలా సాధ్యమంటే... అంతా టెక్నాలజీ మహిమ అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. ఒకదానిపై ఒకటి ఉంచే అరల్లో పంటలు పండుతాయి. సూర్యరశ్మి స్థానంలో ఎల్ఈడీ బల్బుల వెలుగులు మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇలాంటి నిట్టనిలువు వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నీటిని అత్యంత పొదుపుగా సమర్థంగా వాడుకోవడం ఒకటైతే.. క్రిమికీటకాల బెడద అస్సలు ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎరువులు, కీటకనాశినుల వాడకం కూడా అవసరముండదు. ఎల్ఈడీ బల్బుల కోసం.. ఇతర అవసరాలన్నింటి కోసం భవనం పైకప్పుపై దాదాపు 2003 సోలార్ ప్యానెళ్లతో 500 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. వర్టికల్ ఫార్మింగ్కు సూర్యరశ్మిని అందించే సోలార్ ప్యానెళ్లు ఇప్పటివరకూ ఏర్పాటైన అనేక వర్టికల్ ఫార్మ్లకు దీనికీ ఇంకో ప్రధానమైన తేడా ఉంది. తక్కిన వాటిల్లో కేవలం ఆకుకూరలు మాత్రమే పండేవి. కానీ తాము టెక్నాలజీలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దాదాపు అన్ని రకాల పంటలూ పండించగలుగుతున్నామని అంటున్నారు మెట్రోపోలిస్ ఫార్మ్ యజమానులు. టమోటాలు, స్ట్రాబెర్రీలు, దోసకాయలతోపాటు వీరు ఆకుకూరలు కూడా పండిస్తున్నారు.! నగరం నడిబొడ్డున 660 ఎకరాలకు సరిపడా పంట పండితే.. కాయగూరలను పల్లెల నుంచి నగరాలకు తీసుకు రావాల్సిన అవసరం తప్పుతుంది కాబట్టి అంతమేరకు ఆదా చేయవచ్చునన్నది వీరి ఆలోచన. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘గ్రీన్హౌస్’కు దరఖాస్తుల వెల్లువ
- ఒక్క మెదక్ జిల్లా నుంచే 600 - నేడు కంపెనీలతో ఉద్యానశాఖ ఒప్పందం! సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 75 శాతం సబ్సిడీ ఉండటంతో పెద్ద రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఉద్యాన శాఖ ప్రకటించిన వెంటనే దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల పరిధిలోని ఆరు జిల్లాల నుంచి రైతులు ఉద్యాన శాఖను సంప్రదిస్తున్నారు. ఒక్క మెదక్ జిల్లా నుంచే 600 దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 400, మహబూబ్నగర్ జిల్లా నుంచి 350 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ రైతులు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీతో వెయ్యి ఎకరాల్లో మాత్రమే గ్రీన్హౌస్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వస్తున్న దరఖాస్తులను బట్టి నిర్ణీత పరిధి దాటే అవకాశముందని ఉద్యానశాఖ అధికారులంటున్నారు. నేల స్వభావం, నీటివసతి అం శాలు పరిశీలించాక, అనుమతినిస్తామని పేర్కొం టున్నారు. మరోవైపు గ్రీన్హౌస్ చేపట్టే కంపెనీలతో నేడు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఐటీ శాఖను సంప్రదించనున్న అధికారులు గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.36 లక్షలు వ్యయం కానుంది. అందులో ప్రభుత్వం 75 శాతం చొప్పున రూ. 29.52 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. రైతు ముందుగా రూ. 9.84 లక్షలు (25 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలో రైతులు ఆదాయ పన్ను వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయమై ఆదాయపన్ను శాఖతో సంప్రదించాలని యోచిస్తున్నారు.