breaking news
gramasabhalu
-
గ్రామసభే సుప్రీం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణాభివృద్ధిలో గ్రామసభలు కీలకం కానున్నాయి. గతంలో కంటే భిన్నంగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో గ్రామసభలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పారిశుధ్యం మొదలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, గ్రామ సమస్యలతో పాటు వివిధ అంశాలపై గ్రామసభల్లో తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. పల్లెల్లోని ప్రజల ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక వనరుల పరిరక్షణ, ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తినపుడు వాటిని పరిష్కరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల ఆమోదం, సామాజిక,ఆర్థిక, అభివృద్ధి కోసం ప్రణాళికలు,కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేందుకు ముందస్తుగా గ్రామసభల అనుమతి పొందేలా చట్టంలో పొందుపరిచారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక, పేదరిక నిర్మూలన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో లబ్ధిదారుల గుర్తింపు, ఎంపికకు గ్రామసభే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వివిధ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు (యూసీ), వివిధ ప్రణాళికలు, కార్యక్రమాలు, ప్రాజెక్టు పరిమాణాలు, గ్రామస్థాయిలో వ్యయం చేసిన నిధులకు సంబంధించిన యూసీలను గ్రామసభల ద్వారానే పొందాల్సి ఉంటుంది. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం,షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏదైనా ప్రాజెక్టు అమలుకు భూమి స్వాధీనం లేదా సంబంధిత ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాల్సి వచ్చినా ముందుగా గ్రామసభ లేదా తగినపద్ధతుల్లో గ్రామపంచాయతీని తప్పనిసరిగా సంప్రదించేలా నూతనచట్టంలో ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని చిన్నతరహా నీటివనరుల నిర్వహణ ప్రణాళికలకు, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలకు గనుల లైసెన్స్లు లేదా లీజుకు ఇచ్చేందుకు గ్రామసభ లేదా సరైన స్థాయిలోని పంచాయతీ సిఫార్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రెండునెలలకు ఒకసారి గ్రామసభ జరిగేలా, ఏడాదిలో మొత్తం ఆరు సభల్లో రెండింటిని మహిళలు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదైన వారందరూ సభ్యులుగా గ్రామసభకు హాజరుకావొచ్చు. గ్రామసభలు సమీక్షించే అంశాలు పారిశుధ్యం కాపాడే చర్యలు.. ఘన,ద్రవరూప వ్యర్థాల నిర్వహణ, చెత్తా,చెదారాన్ని ఎరువుగామార్చడం వీధిదీపాల నిర్వహణ, గ్రామపంచాయతీలో వివిధ పథకాల కింద చెట్లునాటడం, వాటి నిర్వహణ కుటుంబ సంక్షేమం విద్య, ప్రజారోగ్యం, బాలకార్మికుల నిర్వహణ అంతర్గతరోడ్లు, వంతెనలు, కాల్వల నిర్వహణ పబ్లిక్ ప్రదేశాలు, కమ్యూనిటీహాళ్లు, పార్కుల వంటి సామాజిక ఆస్తుల నిర్వహణ సంతలు, పండుగలు, క్రీడలు, ఆటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం గ్రామపంచాయతీ అమలుచేసే పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు రూపొందించి,ప్రాధాన్యతల నిర్ధారణ. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రాధాన్యతా క్రమంలో అర్హులైన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేసే బాధ్యత పంచాయతీల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య మతసామరస్యం, సఖ్యత పెంపొందించేందుకు, స్థానిక ప్రజల మధ్య స్నేహసంబంధాలు అభివృద్ధి చెందేందుకు కళలు, క్రీడా సంబరాల నిర్వహణ పింఛన్లతో పాటు వివిధరకాల సంక్షేమ సహాయాలను ప్రభుత్వం నుంచి పొందేందుకు వ్యక్తుల స్క్రీనింగ్ వయోజన విద్య ప్రోత్సాహం, పబ్లిక్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ బడ్జెట్ సంబంధ ఏర్పాట్లు, ఖర్చు చేసే ప్రణాళిక వివరాలు, అంశాల వారీగా నిధుల కేటాయింపు వివరాలు, పంచాయతీ ప్రాంతంలో చేసిన లేదా చేయబోయే పనులకు సంబంధించి సామగ్రి ఖర్చుల గురించి తెలుసుకునే హక్కు గ్రామసభకు ఉంటుంది. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీల్లో... షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీలు/ గ్రామసభలకు మత్తు పదార్థాల వినియోగంపై నిషేధం లేదా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగంపై నియంత్రణ లేదా క్రమబద్ధీకరించే అధికారాన్ని కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించింది. చిన్నతరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్యహక్కులు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూమి అన్యాక్రాంతం కాకుండా చూసే అధికారం, చట్టవిరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారాన్ని కూడా కట్టబెట్టింది. గ్రామీణ మార్కెట్ (సంత) నిర్వహణ అధికారం, గిరిజన ప్రజలకు రుణం ఇస్తున్న సంస్థలు, వ్యక్తులపై నియంత్రణ అధికారాన్ని కూడా నూతన చట్టం కల్పించింది. -
నిధులు లేవు.. పనులు ఎలా చేయాలి?
గ్రామసభలో సర్పంచ్ ఆవేదన అల్లాదుర్గం: ‘గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు. గ్రామసభలు పెడితే ప్రజలు అడుగుతున్నారు. రూపాయి లేకుండా విద్యుత్ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను తీసుకుంది. గ్రామంలో పనులు ఎలా చేయాలి’ అని అల్లాదుర్గం మండలం పల్వట్ల సర్పంచ్ ఆడిగే ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పల్వట్లలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తామని, గతంలో గ్రామజ్యోతి ద్వారా పనులు వివరాలు, తీర్మానాలు తీసుకున్న ప్రభుత్వం నిధులను మాత్రం మంజూరు చేయలేదన్నారు. పంచాయతీలో నిధులు లేక కనీసం మురికి కాల్వలను తీయలేని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు మాత్రం సమావేశాలు పెట్టి పారుశుద్ధ్యం పనులు చేయాలని చెబుతున్నారని, నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజ్రేకర్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే గ్రామసభలు
ఝరాసంగం: గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకేందుకే గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు, సర్పంచ్లు తెలిపారు. మంగళవారం ఝరాసంగంతో పాటు క్రిష్ణాపూర్, చీలమామిడి, కోల్లూర్ గ్రామాలలో గ్రామపంచాయతి కార్యాలయ ఆవరణలో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలను ఏర్పాటు చేశారు. ఈ సభలలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, విద్య తదితర అంశాలపై చర్చించారు. గ్రామస్తులు, వార్డు సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారిని ఆదుకోవాలని బాధితులు కోరారు. సభలో పలు సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సభలలో ఆయా గ్రామాల సర్పంచ్లు రుద్రప్ప పాటిల్, మల్లన్న పాటిల్, తేజమ్మ ఉప సర్పంచ్లు హమీద్, మహబూబ్అలీ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, విజయ్కుమార్, రాజ్కుమార్, మహేశ్వర్రావు, వార్డుసభ్యులు నాగేశ్, బాబుకుమార్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.