జీఓ 30 సాధించిన ఘనత ముద్రగడదే
కిర్లంపూడి :
కాపు జాతి రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ చేస్తున్న పాదయాత్రలో ఆయన వెంట నడిచేందుకు కాపు జాతి యావత్తూ సిద్ధంగా ఉందని కాపు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, నల్లా విష్ణు తదితరులు మాట్లాడుతూ జాతి కోసం 1994లో ముద్రగడ తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి కుటుంబంతో సహా ప్రాణాలు పణంగా పెట్టి జీఓ నంబర్ 30 సాధించారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధన కోసం మరోసారి ఉద్యమం చేపట్టి కాపుజాతిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ముద్రగడ మళ్లీ ఉద్యమం మొద లు పెట్టారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలోని 28వ పేజీలో కాపుజాతి పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, సంక్షేమానికి ఏటా రూ.వెయ్యి కోట్లు, బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక హామీల అమలు పరిచిపోయారన్నారు. ముద్రగడ సా ధించిన జీఓ నంబర్ 30 వల్ల 14 కులాల్లో 9 కు లాలకు రిజర్వేషన్లు దక్కాయన్నారు. కాపు జాతి లోని ఐదు కులాలకు దక్కలేదన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు తోట రాజీవ్, గౌతు స్వామి, గోపు చంటిబాబు, చందు జనార్ధన్, అడపా నాగేంద్ర, గొల్లపల్లి కాశీ, నల్లా విష్ణు, తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.