breaking news
Ghulam Ali concert
-
'రద్దును రద్దు చేశారు'
కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మ్యాస్ట్రో గులాం అలీ మాట మార్చారు. తను పెట్టుకున్న షరతును తానే రద్దు చేసుకున్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను భారత్లో ఎలాంటి సంగీత కచేరీలు నిర్వహించబోనని, ఇప్పటికే ఒప్పుకున్న కార్యక్రమాలు కూడా రద్దు చేసుకుంటున్నానని ప్రకటించిన ఆయన తిరిగి ఆ కార్యక్రమాలను కొనసాగించేందుకు వస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ 3న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ కచేరి కార్యక్రమానికి వస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. ఇటీవల ముంబై, ఢిల్లీలో నిర్వహించాల్సిన సంగీత కచేరి కార్యక్రమాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, అయితే, భారత రాజకీయాలు తనను అమితంగా గాయపరిచాయని, తనను వివాదంలోకి లాగి కొన్ని రాజకీయ పార్టీలు లబ్దిపొందాలని చూస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరు దేశాలమధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాను కచేరిలు భారత్లో నిర్వహించబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన తన మనసు మార్చుకోవడం గమనార్హం. -
'హర్ట్ అయ్యాను.. ఇక భారత్లో నో..'
కరాచీ: పాకిస్థాన్ ప్రముఖ గజల్ మేస్ట్రో గులాం అలీ భవిష్యత్తులో భారత్లో ఎలాంటి సంగీత కచేరి కార్యక్రమాలను నిర్వహించబోనని స్పష్టం చేశారు. భారత రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను ఇక కచేరి కార్యక్రమాలను భారత్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించనని చెప్పారు. ఇప్పటికే ఆయన లక్నో, ఢిల్లీలో నవంబర్ 25న ఒకటి, డిసెంబర్ 3న మరొకటి సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు తెలిపారు. తాను నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా భారత్లో కొన్ని పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నించే తీరు తనను ఇబ్బంది పెట్టిందని అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పారు. ఇదిలా ఉండగా, గులాం నిర్ణయాన్ని భారత్ సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ స్వాగతించారు. గులాం అలీ సరైన నిర్ణయం తీసుకున్నారని, అలాగే, పాకిస్థాన్ కూడా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చేవరకు, సరిహద్దులో ఉన్న భారత సైనికులతో సరిగా వ్యవహరించేవరకు గులాం ఇండియాలో అడుగుపెట్టవద్దని సలహా కూడా ఇచ్చారు. భారత సైనికులను పాకిస్థాన్ చంపేస్తుందని ఆయన ఇప్పటికి అర్ధం చేసుకున్నందుకు పొగడకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు.