విజయవాడలో బీఎండబ్ల్యూ షోరూమ్!
మరో 10 ఔట్లెట్స్, 4 కొత్త మోడళ్లు
చెన్నై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ విజయవాడలో షోరూమ్ను ప్రారంభించనుంది. అలాగే ఈ ఏడాది కొత్తగా దాదాపు 10కి పైగా ఔట్లెట్స్ ఏర్పాటుతోపాటు కొత్తగా 4 మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 40గా ఉన్న కంపెనీ షోరూమ్ల సంఖ్యను ఈ ఏడాది 50కి పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ చెప్పారు. ఈ ఏడాది తాము 15 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. వీటిలో నాలుగు కొత్త బ్రాండ్ మోడళ్లు కాగా మిగిలినవి వాటిని కొత్త ఫీచర్స్తో తిరిగి మార్కెట్లోకి విడుదల చే స్తామని చెప్పారు. తాము ఇప్పటికే బీఎండబ్ల్యూ ఐ8, ఎక్స్5ఎమ్, ఎక్స్6, ఎక్స్6ఎమ్ అనే మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ డజనుకు పైగా మోడళ్లను భారత్ మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిలో 8 వరకు మోడళ్లను చెన్నై ప్లాంటులోనే తయారు చే స్తోంది.