breaking news
fake news story
-
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్ను కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ దరాబ్జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
గంటా వెంకటేశ్వరరావు అసలు రంగు ఇది
ఎవరికీ తెలియని. పెద్దగా పరిచయమూ లేని వ్యక్తి. కానీ, ఈనాడు మాత్రం ఆర్థిక మేధావిగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుని బొక్కా బోర్లా పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనతో జీవీ రావుతో ఓ ప్రకటన చేయించిన రామోజీరావు, దాన్ని ప్రముఖంగా ప్రచురించి హైలెట్ చేయాలనుకున్నారు. కానీ, ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తక ముందే జగన్ సర్కార్ అప్రమత్తం అయ్యింది. కీలక గణాంకాలతో యెల్లో మీడియా అవాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో పాటు యెల్లో మీడియా కుట్రను, ఆ కుహనా మేధావి అసలు రంగును బయటపెట్టింది. గంటా వెంకటేశ్వర రావు అలియాస్ జీవీ రావు.. ఏపీ ఆర్థిక పరిస్థితులపై తప్పుడు విశ్లేషణలకు దిగాడని ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే జీవీ రావును గతంలో ఐసీఏఐ(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) ఆయన్ని నోటీసులు ఇచ్చి మరీ తొలగించిన విషయాన్ని గుర్తు చేశారాయన. పైగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఏఐ నోటిఫికేషన్లో.. ప్రొఫెషనల్ మిస్కండక్ట్(వృత్తిపరమైన దుషప్రవర్తన) కారణంగా ఘంటా వెంకటేశ్వరరావును రిజిస్టర్ మెంబర్గా రెండేళ్లపాటు తొలగించడంతో పాటు 50వేల జరిమానా కూడా విధించింది. 👉 జీవీ రావు వాస్తవానికి ఆర్థిక నిపుణుడు కాదు. వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి. కేవలం సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనామకుడు. అందుకే అతన్ని ఆర్థిక నిపుణుడి ట్యాగ్ లైన్ తగిలించి.. ఏపీ ఆర్థిక పరిస్థితి, పాలసీలపై ఈనాడులో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఆ వేషాలు ఏపాటివో ఏపీ ప్రజలకు తెలియాలి కదా. 👉 ఈ డ్రామాలో జీవీ రావు కేవలం పాత్రధారి మాత్రమే. రామోజీరావు డైరెక్షన్ అయితే.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఆ అసత్యాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎంతలా అంటే.. దిగజారిపోయి మరీ ఏపీ శ్రీలంక, పాకిస్థాన్లా మారిపోయిందని, అప్పుల పాలయ్యిందనే అభ్యంతరకర ప్రచారాలకు తెర తీశారు. 👉 సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని, ఏదో అయిపోతోందని ఈనాడు చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదని.. కొందరికి మేధావి అంటూ తోక తగిలించి వారితో మాట్లాడిస్తోంది. 👉 వాళ్లేమో తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన జీవీ రావు.. తెలుగుదేశం పార్టీ లైన్ మీదే నడిచారు. ఆ పార్టీ సీఎం జగన్ సంక్షేమ ప్రభుత్వంపై ఎలాగైతే విమర్శలు చేస్తోందో.. అవే వ్యాఖ్యలు చేశాడు. తద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారు. ఇదీ చదవండి: ఏపీ అప్పులపై క్లారిటీ ఇదిగో -
పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఫేక్ న్యూస్తో ఎల్లో మీడియా శునకానందం..
టీడీపీ గ్రాఫ్ పెంచలేకపోతున్నారు. పడిపోతోన్న బాబు ఇమేజ్ని లేపలేకపోతున్నారు. పైనున్న ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే పోలా అనుకున్నారు. అంతే ఫేక్ జీవోలతో ఫేక్ సర్వేలతో ఫేక్ వ్యవహారాలు నడుపుతూ దిగజారుడుగా వ్యవహరిస్తున్నారు ఎల్లో కూలీ మీడియా పెద్దలు. ఆ మధ్య ఫేక్ జీవో వైరల్ చేసి శునకానందం పొందారు. అది జనం నమ్మకపోవడంతో ఫేక్ సర్వేతో తెరపైకి వచ్చారు. అదీ వర్కవుట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలతో సంతృప్తి చెందుతున్నారు. ఎల్లో గ్యాంగ్ వారి కూలీ మీడియాల వ్యవహారాలు చూసి జనం ఏవగించుకుంటున్నారు. రిటైర్మెంట్ పేరిట ఫేక్ న్యూస్ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాలో ఓ కథనం హల్ చల్ చేసింది. అదేంటంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీచేసినట్లు కథనం అల్లారు. అయితే అసలు అటువంటి జీవో ఏదీ తాము జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దాన్నే ఈనాడు పత్రికలో బ్యానర్ స్టోరీ చేసేశారు. సర్వేల పేరిట ఫేక్ న్యూస్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఏపీలో ఓ సర్వే చేసిందని అందులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని ఓ కథనాన్ని వండి వార్చేశారు. ఈ ఫేక్ సర్వే గురించి ఎల్లో కూలీ మీడియాలో బ్యానర్ స్టోరీ వచ్చిన మరుక్షణమే ఐ ప్యాక్ సంస్థ స్పందించింది. తాము అసలు చాలా కాలంగా ఎలాంటి సర్వేలు జరపనే లేదని ఎల్లో మీడియాలో వచ్చిన కథనం అంతా ఫేకే నని ఐ ప్యాక్ ట్వీట్ చేసింది. మనవాడు వచ్చాడంటూ ఫేక్ సర్వే రఘురామ సర్వే పేరుతో ఒకటి, ఆత్మసాక్షి పేరుతో మరో సర్వే వెలువడ్డట్లు ప్రచారం చేశారు. రఘురామ సర్వే అనగానే ఆయన ఎవరికి అనుకూలమో ఎవరిపై రోజూ విషం చిమ్ముతూ ఉంటారో అందరికీ తెలుసు. ఆ సర్వేలో ఆయన ఎవరికి అనుకూలంగా అంశాలను మలుస్తాడో కూడ అందరికీ తెలుసు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలు సర్వే చేసినట్లు చెప్పడం వాటిని ఎల్లో మీడియాలో ప్రచురించి ప్రజల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేయడం ఎల్లో గ్యాంగ్ లక్ష్యాలుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. 2019లోనూ ఫేక్ సర్వేలు 2019 ఎన్నికల సమయంలోనూ ఎల్లో బ్యాచ్ ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు విఫల యత్నాలు చేసింది. అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా వ్యక్తిగతంగా సర్వేలు నిర్వహించినట్లు చెప్పుకున్నాయి. కేవలం ఎల్లో మీడియా మాత్రమే చెబితే జనం నమ్మరేమోనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో చీకట్లో భేటీ అయిన విజయవాడ మాజీ ఎంపీ ఆంధ్రా ఆక్టోపస్ను తెరపైకి తెచ్చింది టీడీపీ. ఈ సర్వేలన్నింటినీ ఎడం కాలితో తన్నేసిన ఓటర్లు 175 స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించి టీడీపీకి కేవలం 23 స్థానాలు విదిల్చారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం ఏదో ఒక విష ప్రచారంతో విరుచుకు పడుతూనే వస్తున్నారు ఎల్లో బ్యాచ్ పెద్దలు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు చంద్రబాబు హయాంలో కన్నా చాలా ఎక్కువగా వస్తోంటే ఏపీ నుండి పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రావడం లేదని ఎల్లో కూలీ మీడియా కథనాలు వండి వార్చింది. అప్పులపై ఫేక్ ప్రచారం చంద్రబాబు పాలనలో చేసిన అప్పులతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు చాలా చాలా తక్కువే. అయినా జగన్ పాలనలోనే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు ఫేక్ స్టోరీలు వండి వార్చారు. సంక్షేమ పథకాలతో ఏపీలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఎవ్వరికీ ఏ పథకమూ అందడం లేదంటూ కుట్ర కథలు ప్రచారంలో పెట్టారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేస్తే.. ఆ వర్గాలకు అన్యాయం జరిగిపోతోందంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ విషం చిమ్ముతున్నారు. దేశంలోనే ప్రగతి పథంలో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతూ ఉంటే ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ కుళ్లు కథలు చెప్పుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ అమెరికాలో మెరిసిపోయినట్లు.. జగన్ పాలనలో అమెరికాలా ఉన్న ఏపీ కాస్తా దివాళా తీసేసినట్లు దిగజారుడు రాతలతో పేట్రేగిపోతున్నారు. అన్నీ ఫేకే. ఒక్కదాంట్లోనూ నిజం లేదు. ఒక్క కథనంలోనూ విలువలు లేవు. తాము రాసేది తప్పని వారికి తెలుసు. తాము చిమ్మేది విషమని తెలుసు. తమ బాబు పాలనకన్నా ఇపుడే బాగుందని కూడా తెలుసు. అయినా తమ బాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎల్లో కూలీ మీడియా ఫేక్ వేషాలతో రెచ్చిపోతోంది. ఫేక్ స్టోరీలు సృష్టించడం వాటిని ప్రచారంలో పెట్టించడం వాటిని చూసి స్పందించినట్లుగా టీడీపీ శ్రేణుల చేత గొడవలు చేయించడం.. వాటికి వత్తాసుగా పవన్ కళ్యాణ్ చేత వేషాలు వేయించడం అన్నీ కూడా చంద్రబాబు నాయుడి పొలిటికల్ గేమ్లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు పాలక పక్ష నేతలు. అందుకే ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు, కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఏపీ అప్పులపై టీడీపీ & ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం బట్టబయలు చేసిన కాగ్ నివేదిక
-
తప్పుడు కథనాలతో ఫేస్బుక్కు తంటాలు
న్యూయార్క్ : ప్రపంచపు పాపులర్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ , ట్రెండింగ్ టాపిక్స్ లో తప్పుడు కథనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తప్పుడు కథనాలనే ఫేస్బుక్ ఎక్కువగా ప్రచారం చేస్తుందని విమర్శలు ఎదుర్కొంటోంది. గత నెల నుంచి ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.. ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత మెగిన్ కెల్లీకు సంబంధించిన ఓ వార్తాకథనాన్ని ఫేస్ బుక్ తప్పుగా ప్రచారం చేసింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డెమొక్రాటిక్ పార్టీ లీడర్ హిల్లరీ క్లింటన్కు కెల్లీ మద్దతిస్తున్నట్టు వార్తా కథనాన్ని ఫేస్బుక్ ప్రచురించింది. ఆ స్టోరీని ట్రెండింగ్ టాపిక్స్ సైట్లో టాప్లో ఫేస్బుక్ మెయిన్ పేజీలో ప్రచురించింది. నెలకు దాదాపు 1.7 బిలియన్ యూజర్లు ఈ పేజీని వీక్షించారు.. దీంతో ఫేస్బుక్ కచ్చితత్వం లేని స్టోరీలను ప్రసారం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. స్టోరీ సరియైనదిగా లేదని తొలగించాలంటూ ఫాక్స్ న్యూస్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఫేస్బుక్ రివ్యూ టీమ్ స్టోరీలో కచ్చితత్వ లోపాన్ని గుర్తించి వెంటనే స్టోరీని తొలగించింది. 2014లో ప్రవేశపెట్టిన ఈ ట్రెండింగ్ టాపిక్స్ కోసం, ఫేస్ బుక్ ప్రత్యేక టీమ్ పనిచేస్తుంది. అయితే పొలిటికల్ చర్చలు, నమ్మకాలను బట్టి స్టోరీలను ఎంపికచేసి ట్రెండింగ్ టాపిక్స్లో పోస్టు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్రేకింగ్ న్యూస్లను, ఈవెంట్లను ఈ పేజీకి ఎంపికచేస్తారు. అయితే గత నెల మే నుంచి ఫేస్బుక్ ఈ ట్రెండింగ్ టాపిక్స్పై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమస్యపై విచారణ కొనసాగించిన ఫేస్బుక్ సైతం తమ పోస్టు చేసే కథనాల్లో తప్పులు దొర్లుతున్నాయని చెప్పింది. అయితే ప్రచారం నిర్వర్తించే ముందు స్టోరీల కచ్చితత్వాన్ని ధృవీకిరస్తున్నారో లేదో మాత్రం కంపెనీ అధికార ప్రతినిధి తెలుపలేదు. పాపులర్ స్టోరీలను, న్యూస్ కచ్చితత్వాన్ని గుర్తించడానికి ఫేస్బుక్ అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి.