breaking news
Dracula
-
పేరుకు చెడ్డపేరు?
వేసుకుంటే పాత ప్రశ్నే. పేరులో ఏమున్నది? గులాబీకి ఆ పేరు లేకపోయినా అది గులాబీ అయ్యేది కాదా? ఆ పువ్వుకు అంత అందం వచ్చేది కాదా? పేరు వల్ల కూడా అందం ఇనుమడిస్తుంది. పేరులో ఏమున్నది అనుకుంటే అందమైన పేర్ల కోసం ఆధునిక తల్లిదండ్రులు అంతగా ప్రయత్నించరు. ఈ అందం అనేది ఒక్కోసారి సాపేక్షం. అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ పిల్లలకు పేరు పెట్టడం అనేది అనాదిగా పెద్ద పండుగ. నామకరణం తర్వాతే శిశువు నిజంగా ఈ భూమ్మీద ‘ఉనికి’లోకి వచ్చినట్టు!మనిషికి పేరు అనేది దానికదే ఒక చిరునామా. ఎవరికైనా తన పేరును మించిన అందమైన పిలుపు మరొకటి ఉండదు, అంతకంటే మంచి కవితను ఇంకే కవీ రాయలేడు. పేరు అనేది మనిషిని ఎప్పటికీ వదలని హేంగోవర్. ఆ పేరులోని ప్రత్యేకత కంటే, ఆ పేరును మళ్లీ మళ్లీ వినడం వల్ల అది వారికి ప్రత్యేకమైపోతుంది. శిశువు ఈ భూమ్మీదకు రాగానే కూడగట్టుకోగలిగే తొలి సొంత ఆస్తి కూడా ఈ పేరే. ఇంక దాన్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అన్నది ఒక జీవితకాల ప్రయాణం తర్వాతే తేలుతుంది. ప్రాచీన రోమన్ సామ్రాజ్యంలో శుద్ధీకరణ పేరుతో నామకరణోత్సవం జరిగేది. ఆడశిశువులకు ఎనిమిదో రోజున, మగపిల్లలకు తొమ్మిదో రోజున పేర్లు పెట్టేవారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే త్వరగా ఎదిగి పరిపూర్ణత్వాన్ని పొందుతారనేది ఈ తేడాకు కారణం.పెట్టిన పేర్లు తికమకగా మారిపోవడం ఒక తమాషా. సుగుణ ఎంతటి గుణవంతురాలో మనకు తెలియదు. కోమలిది ఎలాంటి రూపమో ఊహించలేము. బలవంతరావు బలహీనంగా ఉండకూడదనేం లేదు. పేరుకు తగ్గట్టుగా మనిషి ప్రవర్తనను ఆశించడం కొన్నిసార్లు ఆశాభంగం కావొచ్చు. హరిశ్చంద్రుడు అబద్ధాలకోరు అవ్వకూడదనే కోరుకుంటాం. ధర్మరాజు అవినీతికి పాల్పడితే మరీ ఎక్కువ బాగోదు. పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఉండలేక పిల్లలు సతమతమవడం మరో కోణం. కొన్ని పేర్లను కొందరు కుట్రపూరితంగా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మోసం. కానీ దాన్ని వాళ్లు ప్రేమ అనొచ్చు, స్నేహం అని పిలవొచ్చు. ఒక యుద్ధానికి ఏం పేరు పెడదామని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సలహా అడిగితే, ‘అనవసర యుద్ధం’ అందామని సలహా ఇచ్చారట బ్రిటన్ ప్రధాని చర్చిల్. తగిన పేరు!జనాలు తాము ఉన్నదాన్ని బట్టి తమ పేర్లను అందమైనవిగానో, వికారమైనవిగానో చేస్తారు అంటారు కెనడా రచయిత ఎల్.ఎమ్.మాంటొగోమెరీ. అది చాలావరకు నిజమే అయినా అన్నిసార్లూ నిజం కాదు. సూర్యకాంతం అంటే మనకు ఇప్పుడు ఒక పేరు కాదు. ఒక గయ్యాళి ముసలి. గిరీశం అంటే నక్కజిత్తులవాడే! భగవంతరావు అని వచ్చిందంటే ఒక స్థాయి మనిషి అనే అర్థం. పరమానందయ్య అనగానే వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చునే సగటు మధ్యతరగతి మానవుడే. సాహిత్యమో, సినిమానో వేసే ముద్రలవల్ల కూడా పేర్ల స్వభావాలు మారిపోతాయి. కన్యాశుల్కం ఎంత గొప్ప నాటకమైనా లుబ్ధావధాన్లు, సౌజన్యారావు అంటూ పాత్రల పేర్లను వారి స్వభావాలకు తగ్గట్టుగా పెట్టడం కొంతమందికి నాటకీయంగా అనిపించింది. పాత్రకు తగ్గ పేరు పెట్టడం సహజం కాకపోయినా, ఔచిత్యం అనుకున్నారు మన రచయితలు. లేదంటే జనాలే పాత్రల పేర్లను మార్చేయొచ్చు. ఉదాహరణకు మహాభారతంలో ‘దుర్యోధనుడి’ పేరును సుయోధనుడు అనుకోనివాళ్లే ఎక్కువ. పిల్లల పేర్ల కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లే తలలు బద్దలు కొట్టుకుంటారు. కానీ రచయితలు తాము సృష్టించే ప్రతి పాత్ర కోసం ఆ ‘పురిటి నొప్పులు’ పడాల్సిందే!‘డ్రాకులా’ అనగానే దవడల పక్కన తెరుచుకున్న కోరలతో, మెడను కొరికి పచ్చినెత్తురు తాగే భయానక ఆకారం గుర్తొస్తుంది. అన్ని సాహిత్య రూపాల్లో అత్యధికసార్లు (700కు పైన) పునరావృతం అయిన పాత్రగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. గాథిక్ శైలిలో నిర్మితమైన మధ్య యుగాల యూరోపియన్ భవనాలను ఒక వాతావరణం కోసం వాడుకుంటూ రాసిన గాథిక్ హారర్ సాహిత్యంలో ‘డ్రాకులా’ పేరుతోనే వచ్చిన నవల ఒక క్లాసిక్. సుమారు 125 ఏళ్ల క్రితం, 1897 మే 26న డ్రాకులా విడుదలైంది. అలాంటి గాథిక్ హారర్ సాహిత్యాన్ని డ్రాకులాకు ముందూ, తర్వాతా అని విభజిస్తారు వెండీ డోనిగర్. ఈ పాత్ర సృష్టికర్త లండన్లో స్థిరపడిన ఐరిష్ రచయిత బ్రామ్ స్టోకర్ (1847–1912) అనబడే అబ్రహామ్ స్టోకర్. ప్రపంచంలో డిటెక్టివ్ పాత్రలకు మోడల్గా నిలిచే షెర్లాక్ హోమ్స్ను సృష్టించిన ఆర్థర్ కానన్ డాయిల్ ఈయనకు దూరపు బంధువు కూడా! ‘ద ఫేట్ ఆఫ్ ఫెనెల్లా’(1891) పేరుతో 24 మంది రచయితలు రాసిన ఒక గొలుసుకట్టు నవలలో వీళ్దిద్దరూ కూడా భాగమయ్యారు. ఒకసారి లైబ్రరీలో బ్రామ్ స్టోకర్ ఏ పుస్తకాలో తిరగేస్తూవుంటే ‘డ్రాకులా’ అనే పేరు కంటబడింది. ఆ పేరులో ఆయనకు నిలువెల్లా దుష్టత్వం కనబడటమే కాక, దానికి అలాంటి అర్థమే ఉంటుందనుకున్నాడు. అందుకే ఆ పేరునే తన ప్రతినాయకుడికీ, నవలకూ వాడుకున్నాడు. ఇంతాచేస్తే ఈ డ్రాకులా అనేది ఒక వంశనామం. ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియా పాలకుడు... వ్లాద్ డ్రాకులా. 15వ శతాబ్దిలో రొమేనియాను పాలించాడు. ఆయన్ని ఆ దేశ జాతీయ హీరోగా ఆరాధిస్తారు. ఈయన డ్రాకులా వంశంలో మూడోవాడు. ఈయన తండ్రి రెండో వ్లాద్ డ్రాకులా. అలాంటి పేరుకు ఈ నవల మచ్చ తెచ్చిందో, ఆ పేరును ఎప్పటికీ నిలిచేలా చేసిందో తీర్పునివ్వడం కష్టం. గులాబీకి గులాబీ అనే తగిన పేరు ఉండటం వల్లే అది పూరాణిగా రాణించిందా, ‘డ్రాకులా’కు డ్రాకులా అని పెట్టడం వల్లే అది ఒక పాత్రగా ఇంతగా నాటుకుపోయిందా చెప్పడం కష్టం. అది ఒక మనిషిని తన పేరుకు బదులుగా ఇంకొకటి చెప్పుకొమ్మనడం లాంటిది. -
లైట్ వేస్కో.. చార్జ్ చేస్కో..
వేణు.. బ్యాచిలర్ స్టూడెంట్.. హైదరాబాద్లో రూంలో ఫ్రెండ్స్తో కలసి ఉంటాడు.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు.. ఆ ఫోనే అతడికి కాలక్షేపం. ఎప్పుడూ వీడియో గేమ్స్ లేదా.. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాడు. అయితే వేణుకు ఓ బాధ ఉంది. అదేంటంటే వెంటనే చార్జింగ్ అయిపోతోందని.. ఇది వేణు ఒక్కడి సమస్య కాదు అందరికీ ఉండేదే. అయితే ఈ సమస్యలకు త్వరలోనే చెక్ పడనుందని చెబుతోంది డ్రాకులా టెక్నాలజీస్ సంస్థ. లైట్ ఉన్న చోట ఎక్కడ ఫోన్ పెట్టినా చార్జ్ అయిపోయేలా నూతన ఆవిష్కరణ త్వరలోనే రానుంది. ఈ అద్భుతం త్వరలోనే సాక్షాత్కరించనుంది. మొబైల్ఫోన్ల చార్జింగ్ చేసుకునేందుకు సౌర శక్తిని వాడటం కొత్తేమీ కాదు. అయితే సూర్యుడు ఉన్నంత వరకే పని జరుగుతుంది. ఇలా కాకుండా మన ఇళ్లలో రాత్రి కాగానే వేసే లైట్ల వెలుతురును (ఆంబియంట్ లైట్) ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయగల సరికొత్త సౌరఫలకాలను ఫ్రాన్స్కు చెందిన డ్రాకులా టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. సౌరశక్తితో పోలిస్తే అతి తక్కువ తీవ్రత ఉండటం వల్ల ఆంబియంట్ లైట్తో విద్యుదుత్పత్తి చేయడం ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఈ పరిమితులను అధిగమించి ఇంక్జెట్ ప్రింటర్లతో ముద్రించే టెక్నాలజీని ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. ‘లైట్ యాజ్ యువర్ ఎనర్జిటిక్ రెస్పాన్స్ (లేయర్) అని పిలుస్తున్న ఈ టెక్నాలజీతో సౌర ఫలకాలను పూర్తి పారదర్శకంగా కూడా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన రంగులోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యుత్ను ప్రసారం చేయగల ప్రత్యేక ప్లాస్టిక్తో రూపొందే లేయర్ సౌర ఫలకాల తయారీకి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. సూర్యుడి వెలుతురుతోనూ విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. స్క్రీన్పై వీటిని ముద్రించడం ద్వారా ప్రత్యేకంగా బ్యాటరీ అవసరం లేకుండానే స్మార్ట్ఫోన్ను వాడుకోవచ్చు. దీంతోపాటు స్మార్ట్ఫోన్ వెనుకవైపు లేదంటే ల్యాప్టాప్లు, కాలేజీ బ్యాగ్ల వెనుకవైపు కూడా ముద్రించొచ్చని డ్రాకులా టెక్నాలజీస్ శాస్త్రవేత్త సడోక్ బెన్ దఖిల్ అంటున్నారు. టీషర్ట్పై కానీ.. ఇంకేదైనా స్థలంలో కానీ ఐదు సెంటీమీటర్ల వైశాల్యమున్న లేయర్ సోలార్ సెల్స్ను ఒకే గంటలో ముద్రించుకోగలగడం విశేషం. ఐదు పొరల సెల్.. లేయర్ సౌర ఫలకాల్లో మొత్తం 5 పొరలుంటాయి. కాంతికి స్పందించే పొరను మధ్యలో ఉంచి ఇరువైపులా అర్ధవాహక పొరలు ఏర్పాటు చేస్తారు. పై పొరలో ఉండే ప్రత్యేకమైన ఇంకు విద్యుత్తు చార్జ్ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. లేయర్ సోలార్ సెల్స్ను మనకు నచ్చిన ఆకారంలో, రంగులో తయారు చేసుకునే వీలున్న నేపథ్యంలో వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంచనా. పారదర్శకమైనవి, ప్లాస్టిక్తో చేసినవి. అవసరమైన రంగు, డిజైన్లతోనూ ముద్రించుకునే అవకాశం ఉన్న లేయర్ సోలార్ సెల్స్ను ఇళ్లలో కిటికీలు, తలుపులకు వాడే తెరలుగా ఉపయోగిస్తే...? బహిరంగ ప్రదేశాల్లోని భారీ హోర్డింగ్లకూ చేరితే...? ఎక్కడికక్కడ విద్యుత్తు ఉత్పత్తి అవుతూ అవసరాలు కొంతమేరకైనా తీరతాయి. అయితే ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతానికి 30 చదరపు సెంటీమీటర్ల వైశాల్యమున్న సౌరఫలకాలు తయారు చేస్తున్నామని బెన్ తెలిపారు. వీటితో పాటు లోగోలను వెలుతురుతో నింపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భవనాల్లో వేడి, తేమశాతాలను లెక్కించేందుకు పనికొచ్చే సెన్సర్లకు విద్యుత్ అందించేలా కూడా తయారు చేస్తున్నట్లు వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మేకప్ ఖర్చు కోటి పైనే...
ఓ 60, 70 ఉంటుందనుకుంటున్నారా...అయితే ఈ ఫొటో చూడండి. బట్టతలతో, కళ్ల జోడుతో, ముడుతలు పడిన మొహంతో కనిపిస్తున్న రిషికపూర్ను లుక్ చూసే కాకుండా దాని కోసం అయిన ఖర్చు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. షకున్ బాత్రా దర్శకత్వంలో కరణ్జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్థార్థ్ రాయ్ మల్హోత్రా, ఆలియాభట్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న రిషికపూర్ మేకప్ కోసమే దర్శకనిర్మాతలు రూ. 1.5 కోట్లు నుంచి 1.75 రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ చిత్రాలు ‘ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బుట్టో’, ‘డ్రాకులా’ చిత్రాలకు మేకప్మ్యాన్గా పనిచేసిన గ్రెగ్ కానమ్ రిషికపూర్ కొత్త లుక్కు రూపం ఇచ్చారు. దీని గురించి రిషికపూర్ మాట్లాడుతూ- ‘‘ప్రతి రోజూ ఐదు గంటల పాటు ఈ మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చేది. కరణ్, షకున్లు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త సందేహించాను. ఖర్చు కూడా ఎక్కువే. కానీ వాళ్లు మాత్రం వెనుకాడలేదు. నాకైతే మేకప్ కోసం అంత సేపు కష్టమనిపించింది. కానీ మేకప్ వేసుకున్నాక మాత్రం నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను’’ అని చెప్పారు. -
'పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా చిత్రీకరిస్తోంది'
పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా తనను చిత్రీకరించడంపై జోక్యం చేసుకోవాలని ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు దాఖలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన ప్రవర్తనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలపై ఆంక్షలు విధించాలని ఆశారాం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సధాశివం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ రాజన్ గగోయ్ లతో కూడిన ధర్నాసనం విచారించింది. పోలీసుల నుంచి, ఇతర మార్గాల సేకరించిన సమాచారాన్ని మీడియా ప్రసారాం చేయడాన్ని తప్పపట్టలేమని కోర్టు వెల్లడించింది. ఆశారాంను డ్రాకులలా చిత్రీకరించారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఆశారాం భార్య, కూతుళ్లు ఆయనకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని మీడియా కథనాలు వెల్లడించిన వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.