breaking news
DOT-dot
-
దివాలా తీసిన వీడియోకాన్.. ఆపై మరిన్ని సమస్యలు
న్యూఢిల్లీ: వీడియోకాన్పై దివాలా కోడ్ కింద చర్యల పక్రియ మొత్తం ఈ చట్టంపై లొసుగులను, వాటిని సవరించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటిస్తోంది. తాజా పరిణామాన్ని పరిశీలిస్తే.. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్సహా ఆ గ్రూప్నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో సవాలు చేసింది. పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ. 2,962 కోట్ల టేకోవర్ బిడ్ను అనుమతిస్తూ ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని టెలికం శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ను అభ్యర్థించింది. టెలికం శాఖ వాదనలు ఇవీ... తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. జనవరి 11కు విచారణ వాయిదా.. కాగా, ఇందుకు సంబంధించి ఎన్సీఎల్టీ ఉత్తర్యుపై జూలై 19వ తేదీన ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చిన అంశాన్ని ముగ్గురు సభ్యుల బెంచ్ ప్రస్తావించింది. యథాతథ పరిస్థితిని కొనసాగిస్తూ దివాలా చట్ట నిబంధనలకు అనుగుణంగా వీడియోకాన్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలను నిర్వహించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పేర్కొంటూ, ఈ నేపథ్యంలో ఈ అంశంపై తదుపరి విచారణాంశాల్లోకి తక్షణం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే రెండు వారాల్లో ‘రిప్లై అఫిడవిట్లు’ మరో వారంలో ఏదైనా అవసరమైతే ‘రీజాయిండర్’లు వేయాలని వీడియోకన్ ఇండస్ట్రీస్, వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్సహా మిగిలిన ప్రతివాదులను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. దివాలా కోడ్పై విమర్శల తీరిది... రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ ఇటీవలే దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ లిమిటెడ్లు జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్స్టార్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్స్టార్ టెక్నాలజీస్ వాదన. కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
5జీ ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు
న్యూఢిల్లీ: 5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. కొద్దీ కాలం క్రితమే 5జీ ట్రయల్స్కు అనుమతిచ్చిన టెలికాం శాఖ (డాట్) తాజాగా ట్రయల్స్ కోసం స్పెక్ట్రమ్ను టెలికాం సంస్థలకు కేటాయించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ట్రయల్స్ను ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్తో సహా ఇతర మెట్రో నగరాల్లో నిర్వహించనున్నారు. "700 మెగాహెర్ట్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెర్ట్జ్ బ్యాండ్, 24.25-28.5 గిగాహెర్ట్జ్ బ్యాండ్లను టెలికాం సంస్థలకు వివిధ ప్రదేశాలలో ట్రయిల్స్ కోసం అనుమతించినట్లు" టెలికాం కంపెనీ అధికారి తెలిపారు. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఎమ్టీఎన్ఎల్ నుంచి వచ్చిన దరఖాస్తులను మే 4న డీఓటీ ఆమోదించింది. కానీ, చైనా కంపెనీల సాంకేతిక పరిజ్ఞానాన్ని 5జీ కోసం వినియోగించకూడదు అనే షరతు విధించింది. ఈ షరతుకు కట్టుబడి ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్లు 5జీ ట్రయల్స్ కోసం చేసుకున్న ధరఖాస్తులను కూడా డీఓటీ ఆమోదించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఒక అడుగు ముందుకు వేసి సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్లో భాగంగా టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి పరీక్షించనున్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్స్ వ్యవధి 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల కాలంలో 2 నెలలు 5జీ టెక్నాలజీని పరీక్షించే పరికరాలను సమీకరించుకోవడానికే సమయం సరిపోతుంది. ప్రతి కంపెనీ కూడా కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్లో మాత్రం ఏ కంపెనీకీ స్ప్రెక్ట్రమ్ కేటాయించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చదవండి: చౌక స్మార్ట్ఫోన్ కోసం జియో, గూగుల్ కసరత్తు -
ఆరు టెల్కోలకు షాక్!
♦ త్వరలో డాట్ రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్! ♦ 2006-10 మధ్య ఆదాయాలు ♦ తక్కువగా చూపాయన్న కాగ్ నివేదిక న్యూఢిల్లీ: టెలికం శాఖ (డీఓటీ-డాట్) త్వరలో ఆరు టెలికం ఆపరేటర్స్కు రూ.12,500 కోట్ల డిమాండ్ నోటీస్ జారీ చేయనుంది. 2006-2010 మధ్య దాదాపు రూ.46,000 కోట్ల మేర తక్కువ ఆదాయం చూపించాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొన్న ఆరు కంపెనీలకు ఈ మేరకు నోటీసులు జరీ చేయనున్నట్లు టెలికం మంత్రిత్వశాఖలో ఒక అధికారి తెలిపారు. వీటిలో ఆర్కామ్, టాటా టెలీ, ఒడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్సెల్లు ఉన్నాయి. మార్చిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.46,045.75 కోట్ల తమ ఆదాయాలను దాచిపెట్టినట్లు ఈ నివేదిక పేర్కొంది. కాగ్ పత్రాలు జూన్లో టెలికం శాఖకు అందడంతో కంపెనీలకు నోటీసుల జారీకి రంగం సిద్ధమవుతున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఆదాయాన్ని వదులుకునే ప్రశ్నేలేదని కూడా ఆయన పేర్కొన్నారు. వడ్డీ, జరిమానాలు కూడా... తక్కువ చూపించిన ఆదాయం రూ.12,488.93 కోట్లుకాగా దీనికి టెలికం శాఖ వడ్డీ, జరిమానాలు కూడా జత చేయనున్నట్లు సమాచారం. అయితే కాగ్ నివేదికపై టెలికం ఆపరేటర్లు ఒక సంయుక్త ప్రకటనలో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆదాయాల లెక్కింపు జరిగిందని వివరించాయి. నివేదిక వల్ల ఏదైనా అదనపు భారం పరిస్థితి ఎదురయితే... ఈ సమస్యను పరస్పర చర్చల ద్వారా కానీ లేక, కోర్టుల ద్వారా కానీ పరిష్కరించుకుంటామని కూడా పేర్కొన్నాయి. కాగ్ పేర్కొన్నట్లు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ తక్కువ లెక్కలను కంపెనీల వారీగా చూసి నోటీసుల భారాన్ని పరిశీలిస్తే- రూ.3,728.54 కోట్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వరుసలో మొదట ఉంది. తరువాత వరుసలో టాటా టెలిసర్వీసెస్ (రూ.3,215.39 కోట్లు), ఎయిర్టెల్ (రూ.2,651.89 కోట్లు), ఒడాఫోన్ (రూ.1,665.39 కోట్లు), ఐడియా (రూ.964.89 కోట్లు), ఎయిర్సెల్ (రూ.262.83 కోట్లు) ఉన్నాయి.