breaking news
Deposit rate
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్) పెనాల్టీ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని రకాల డిపాజిట్లు, రుణ రేట్లను సైతం సవరించింది. 999 రోజులకు సంబంధించి గ్రీన్ డిపాజిట్పై వడ్డీ రేటును 7% నుంచి 6.7 శాతానికి తగ్గించింది. రూ.లక్ష నుంచి రూ.10 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ రేటు అమలవుతుంది. సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై రేటును 2.7% (వార్షిక) నుంచి 2.5 శాతానికి తగ్గించింది. ఇక గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలతోపాటు కొత్తగా తీసుకునే గృహ రుణాలకు ఇది అమలవుతుందని తెలిపింది. సవరణ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35% నుంచి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రేటు మారుతుంది. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారికి 7.5% రేటుకే విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాహన రుణాలపైనా అర శాతం రేటు తగ్గించినట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచి్చనట్టు పేర్కొంది. ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలన్స్ పెనాల్టీ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. -
డిపాజిట్ల వడ్డీరేటు: ఆర్బీఐ కొత్త నిబంధన
సాక్షి,ముంబై: బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం టర్మ్ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్ వెనక్కి తీసుకోకపోతే.. ఆ తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్ డిపాజిట్ రేటు అమలవుతోంది. ఇక మీదట అలా కాదు. ‘‘టర్మ్ డిపాజిట్ గడువు తీరినా, క్లెయిమ్ చేసుకోకుండా బ్యాంకు వద్దే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్ ఖాతా రేటు లేదా టర్మ్ డిపాజిట్ ఒప్పంద రేటు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులకు నూతన ఆదేశాలు వర్తిస్తాయి. -
ఎస్బీఐ అటు ఉసూరు : ఇటు ఊరట
సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును తగ్గించింది. ఎంసీఎల్ఆర్ ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు శుక్రవారం ప్రకటించింది. సవరించిన ఈ కొత్త రేట్లు నవంబర్ 10 నుండి వర్తిస్తాయని తెలిపింది. దీంతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ భారీగా తగ్గించింది. తాజా తగ్గింపుతో మూడేళ్ల కాలానికి ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.20 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ఎంసీఎల్ఆర్ను 8.05 శాతం నుంచి తగ్గి 8శాతంగా ఉంది. ఓవర్ నైట్, ఒక నెల కాలానికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా ఉంది. మూడు నెలలకు ఇది 7.70 శాతంగా ఉంది. అలాగే ఆరు నెలల, రెండేళ్ల రేటు వరుసగా 7.85 శాతం 8.10 శాతానికి తగ్గింది. వ్యవస్థలో తగినంత ద్రవ్యత దృష్ట్యా, నవంబరు 10 నుంచి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్టు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిటైల్ టిడి వడ్డీ రేటును 1-2 సంవత్సరాల కన్నా తక్కువ పరిమితి గల డిపాజిట్లపై రేటును 15 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ టిడి వడ్డీ రేటును 30 - 75 బీపీస్ల వరకు తగ్గించిట్టు చెప్పింది. కాగా ప్రైవేట్ రుణదాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వడ్డీరేటును తగ్గిస్తూ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కొత్త రేట్లు నవంబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. -
డిపాజిట్ రేట్లు డౌన్..
ఎస్బీఐ పావు శాతం కోత ఇప్పటికే తగ్గించిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు.. ఇతర బ్యాంకులదీ ఇదే బాట! ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేటును పావు శాతం తగ్గించింది. దీనిప్రకారం ఏడాది పైబడి, ఐదేళ్ల లోపు డిపాజిట్లపై రేటును ప్రస్తుత 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించింది. కోటి రూపాయిల లోపు రిటైల్ డిపాజిట్లకు తాజా నిర్ణయం అమలవుతుంది. సోమవారం నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు రెండు- ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీలు డిపాజిట్ రేట్లు పావు శాతం నుంచి అరశాతం శ్రేణిలో తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా చర్య తీసుకుంది. ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ కూడా గురువారం ఆరు నెలల నుంచి 20 ఏళ్ల మధ్య డిపాజిట్లపై అరశాతం వరకూ వడ్డీరేటు కోత విధించింది. గత కొద్ది నెలల్లో రెండు సార్లు ఏడాది కాలం లోపు స్వల్పకాలిక మెచ్యూరిటీల్లో ఎస్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకుంది. రుణ రేట్ల తగ్గుదలకు సూచన! డిపాజిట్ రేటు కోతను సాధారణంగా రుణ రేటు తగ్గుదలకు సంకేతంగా భావిస్తారు. వ్యవస్థలో రుణ వృద్ధి రేటు మందగమనం, బ్యాంకుల వద్ద తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ఉండడం, రానున్నది తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థన్న సంకేతాలు బ్యాంకుల డిపాజిట్ రేటు కోతకు నేపథ్యం. ‘ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగి.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే (ద్రవ్యలోటుకు అడ్డుకట్ట పడితే) వచ్చే ఏడాది ఆరంభంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉంది. పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంటాం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రఘురామ్ రాజన్ డిసెంబర్ 2 పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రుణ రేటు కోత: హెచ్డీఎఫ్సీ వచ్చే ఏడాది మార్చి నాటికి రుణ రేటును తగ్గిస్తామని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి మాట్లాడుతూ, మార్చి నాటికి బ్యాంక్ కనీస రుణ రేటు (బేస్ రేటు) ను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 10 శాతంగా ఉంది. డిపాజిట్ రేటు కోత నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతకు అందించడంపై బ్యాంక్ దృష్టి సారిస్తుందని ఆదిత్య పురి అన్నారు. ఫిబ్రవరిలో రేటు కోత: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇదిలాఉండగా, ఫిబ్రవరిలో జరగనున్న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో పావుశాతం రేట్ల కోత ఉండవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మిరిల్ లించ్(బీఓఎఫ్ఏ- ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. 2015 సంవత్సరం మొత్తంలో ముప్పావుశాతం వడ్డీరేటు తగ్గే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధరల తగ్గుదల భారత్ ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశమని కూడా నివేదిక విశ్లేషించింది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత దృష్ట్యా గడచిన ఐదు పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ ఈ రేటును యథాతథంగా కొనసాగిస్తోంది.