breaking news
Dalit Land
-
‘ఈటల ఆక్రమించిన దళిత భూములు తిరిగి ఇవ్వాలి : మోత్కుపల్లి
-
దేవరపల్లిలో దౌర్జన్య కాండ
• దళితుల భూముల్లో అధికార పార్టీ దౌర్జన్యం • సాగు భూములను లాగేసుకున్న సర్కారు • పోలీసులను అడ్డుపెట్టి అర్ధరాత్రి తవ్వకాలు • నీరు–చెట్టు పేరుతో నిధుల స్వాహాకు ఎత్తుగడ • జీవనోపాధి కోల్పోయిన దళిత కుటుంబాలు • ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు • జిల్లా వ్యాప్తంగా 100 మందికిపైగా అరెస్ట్ • బాధితులకు అండగా నిలుస్తామన్న వైఎస్సార్ సీపీ జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది. దేవరపల్లి దళిత భూముల్లో దౌర్జన్యకాండ కొనసాగింది. గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో దశాబ్దాలుగా సాగు చేసుకొని కడుపు నింపుకుంటున్న భూములు లాగేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి.. అడ్డొచ్చిన వారిని, ఇళ్లలో ఉన్న గ్రామస్తులను సైతం ఈడ్చుకొచ్చి అరెస్టులు చేయించింది. రాత్రికి రాత్రే నీరు–చెట్టు పేరుతో చెరువులను తవ్వేసింది. ఆ భూములపై ఆధారపడి కుటుంబాలు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి వీధిన పడ్డాయి. తాము అనుకున్నది సాధించేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారనడానికి పర్చూరు మండలం దేవరపల్లి ఘటన ఉదాహరణగా నిలిచింది. దళితుల భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించిన విషయంపై ఆరా తీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నేతలు దేవరపల్లి వెళ్లేందుకు మరోమారు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/పర్చూరు : పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 159/1 సర్వే నంబరులో కృష్ణంరాజుకుంట పేరుతో సుమారు 39.37 ఎకరాల చెరువు పారంబోకు భూమి ఉంది. ఈ చెరువు కుంటలో ఆగ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాయి. 39.37 ఎకరాలకు గాను 22 ఎకరాలను గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి.భూముల్లో 11.37 ఎకరాల్లో గ్రామానికి చెరువు కింద వినియోగించుకుంటున్నారు. దాదాపు ఆరు ఎకరాల భూమిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్తో పాటు, మరికొందరు ఆక్రమించి స్థిర నివాసం ఉంటున్నారు. కాగా దళితుల స్వాధీనంలో ఉన్న 22 ఎకరాల భూములు చెరువుకు సంబంధించినవే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు గత మూడేళ్లుగా వాటిని లాక్కునే ప్రయత్నానికి దిగారు. భూములు తమవేనంటూ కోర్టుకెక్కిన దళితులు అధికార పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి దళితుల భూములు లాక్కునేందుకు అధికార పార్టీ మరోమారు సిద్ధమైంది. గురువారం తెల్లవారుజామున నుంచి దేవరపల్లి దళితుల పొలాల్లో జేసీబీలు, ఇటాచ్లు పెట్టి కుంట తవ్వకం ప్రారంభించారు. ఇందుకు భారీగా పోలీస్ బలగాలను రక్షణగా పెట్టుకున్నారు. అంతకు ముందే 40 కుటుంబాల దళితులను పడుకున్న వారిని పడుకున్నట్లే... అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో జెసిబిలు, ఇటాచ్లు పెట్టి దౌర్జన్యంగా నీరు–చెట్టు పథకంలో కుంట తవ్వకం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. దళితులకు మద్ధతుగా ఏ ఒక్కరూ దేవరపల్లికి చేరకుండా పోలీసులు అడుగడుగునా కాపు కాశారు. వారికి మద్ధతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుమాని రాజశేఖర్, జజ్జర ఆనందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ నేత ప్రకాష్, ఐద్వా నేతలు ఆదిలక్ష్మి, రమాదేవిలతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డిలతో పాటు దాదాపు 40 మంది నేతలను పోలీసులు అరెస్ట్లు చేశారు. వీరిని జరుగుమల్లి, నాగులుప్పలపాడు పోలీస్స్టేషన్లకు తరలించారు. దేవరపల్లికి చేరుకునేందుకు పర్చూరుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర నేత మధును సైతం అక్కడే పోలీసులు అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. జిల్లావ్యాప్తంగా వందలాది మందిని అరెస్ట్ చేసి నిర్భంధించారు. సాయంత్రం వరకు వారికి వదిలిపెట్టలేదు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. ఆర్థిక లబ్ధే ధ్యేయంగా.. మరోవైపు దళితుల భూములను క్రిష్టంరాజుకుంట విస్తరణ పేరుతో నీరు–చెట్టు పథకం ద్వారా చెరువు తవ్వకాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే అనుచరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు–చెట్టు పథకం ద్వారా క్రిష్టంరాజుకుంటను ఆధునీకరించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇందుకోసం రూ.6.80 లక్షలు నిధులు మంజూరైనట్లు ఉంది. ఎటువంటి పనులు జరగకుండానే ప్రభుత్వ రికార్డుల్లో పనులు అయిపోయినట్లు చూపించటం చూస్తే ఇప్పటికే ఈ నిధులు స్వాహా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై మౌన నిద్ర వహిస్తుండటం గమనార్హం. దళితులకు అండగా వైఎస్సార్ సీపీ.. దేవరపల్లి దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్సీపీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం వారికి మద్ధతు పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు దళితుల భూముల్లో జోలికి వెళ్లొద్దని వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దళితుల పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సైతం తీసుకువచ్చారు. జగన్ సూచనల మేరకు దళితుల పక్షాన పోరుబాట సాగించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఈ నెల 16న దళితులకు అండగా దేవరపల్లిని సందర్శించి భూములు పరిశీలించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధంకాగా పోలీసులు ఆంక్షలు విధించారు. 15వ తేదీ అర్థరాత్రే నుంచి ఆయన్ను గృహనిర్భంధం చేశారు. ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్లు చేసి పోలీస్స్టేషన్లలో నిర్భంధించారు. తాజాగా దళితుల భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకొని గురువారం కుంట తవ్వకానికి సిద్ధమైన నేపథ్యంలో దళితుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం దేవరపల్లి దళితులకు మద్ధతు పలకనున్నారు. నోరు మెదపని కలెక్టర్ తాము సాగుచేసుకుంటున్న భూములను అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా లాక్కోవడంతో దళితులు లబోదిబోమంటున్నారు. అధికారులకు మొర పెట్టుకున్నా వినే పరిస్థితి లేకపోవడంతో వారిది అరణ్యరోదనే అయింది. దేవరపల్లి రాష్ట్రస్థాయి వివాదంగా మారినా జిల్లా కలెక్టర్ మాత్రం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాజ్నాథ్కు ‘దేవరపల్లి’ ఘటనపై ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలోని దళితుల భూముల్లో ప్రభుత్వం అక్రమాలపై ఆయన ఈ సందర్భంగా హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి ...ఎస్సీ కమిషన్ చైర్మన్ కఠారియాను కలిశారు. దేవరపల్లిలోని దళితులు సాగు చేసుకుంటున్న భూములపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. దళితుల భూములకు రక్షణ కల్పించి, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కఠారియాకు విజ్ఞప్తి చేశారు. దళితులు, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా భూములు లాక్కోవడం అన్యాయమని, వందల సంఖ్యలో పోలీసులను మోహరింపచేసి, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే దళితుల భూములకు రక్షణ కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర నిరసన తెలిపారు. -
పోలీసు పహారాలో దేవరపల్లి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. తమపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని దళితులు వాపోయారు. 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని తమ గోడును ‘సాక్షి’ టీవీ ప్రతినిధితో వెళ్లబోసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెత్తందారులందరూ ఒక్కటై తమకు ప్రత్యామ్నాయం చూపకుండా చెరువు తవ్వుతున్నారని తెలిపారు. ఎందుకు తవ్వుతున్నారని అడిగితే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయమని అడిగితే ఉన్నతాధికారులు స్పందించలేదని వాపోయారు. తమకు ఎవరూ మాకు సాయం చేయలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు దేవరపల్లిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో చెక్పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీవీ ప్రసారాలు కూడా నిలిపివేశారు. దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపేనని, వారి భూములు లాక్కోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ విమర్శించారు. దళితులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. దేవరపల్లిలో ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.