breaking news
crops lossed
-
రైతులను ఆదుకోవాలి
జోగిపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కూలిపోయిన ఇళ్ల బాధితులకు డబుల్బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జోగిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయారన్నారు. సింగూరు ప్రాజెక్టులోని వరద నీటిని మంజీర నదిలోకి వదలడంతో పొలాలన్నీ నీట మునిగాయన్నారు. మిన్పూర్, ఇసోజిపేట గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో భారీగా నష్టం జరిగిందన్నారు. రాయికోడ్, సింగితం, జర్ని చెరువులు తెగిపోయి వేల ఎకరాల పంటలు నేలకు ఒరిగాయన్నారు. నష్టంపై అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. చెరువుల్లో నీటి మట్టం పెరిగినందున ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచాలన్నారు. బతుకమ్మ పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తున్న రూ.15 కోట్లు కేవలం తన కూతురు కవిత కోసమే అన్నారు. ఆ నిధులతో పేదలకు సౌకర్యాలను కల్పించొచ్చన్నారు. రాష్ర్టంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. -
2,500 హెక్టార్లలో కూరగాయల పంటలకు నష్టం
ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి జిన్నారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2,500 హెక్టార్లలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు. జిన్నారం మండలంలోని గుమ్మడిదల, మంబాపూర్ గ్రామాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లడంతో రామలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువగా టమాటా పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో రైతుసంఘం అధ్యక్షుడు నంద్యాల విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.