breaking news
consumer protection act 1986
-
నిగ్గదీసి అడుగు..
సాక్షి, ఖమ్మం: డబ్బులు పెట్టి వస్తువు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు నాణ్యత లేనివి అంటగడితే..మోసం చేస్తే..ఆర్థికంగా నష్ట పరిస్తే..వినియోగదారుల పక్షాన వినియోగదారుల రక్షణ చట్టం అండగా నిలుస్తుంది. నిగ్గదీసి అడిగేలా..లబ్ధి చేకూర్చేలా చేస్తుంది. వస్తువులను కొనేవారు, వినియోగించేవారు, కిరాయివారు, వస్తువుల వల్ల లబ్ధి పొందే వారంతా వినియోగదారులే. ఈ చట్టం అన్ని రకాల వస్తువులు, సేవలకు వర్తిస్తుంది. హక్కులను పూర్తిస్థాయిలో పొందేందుకు, నష్ట పరిహారం తీసుకునేందుకు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. వ్యాపారులు..వస్తువులు, సేవల గురించి సక్రమమైన సమాచారాన్ని అందించకున్నా, నాణ్యతలేని వస్తువులను ఇచ్చినా, కొత్త వస్తువు కోసం, నష్ట పరిహారం కోసం ఫోరంను ఆశ్రయించవచ్చు. చౌకబారు, నాణ్యతలేని వస్తువులను ఉత్పత్తి చేయకుండా, దొంగ వ్యాపారాన్ని అరికట్టేందుకు, డూప్లికేట్ సరుకు రాకుండా, అధిక ధరల అమ్మకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. బాధితులు జిల్లా వినియోగదారుల ఫోరంలో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. వస్తువు ధరను బట్టి రూ.20లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో..అంతకుమించి అయితే..రాష్ట్ర ఫోరం పరిధిలోకి వస్తుంది. ఫిర్యాదులు ఎప్పుడు చేయాలంటే? ⇔ కొన్న వస్తువులు పాడైనప్పుడు ⇔ డూప్లికేట్ది అంటగట్టినప్పుడు ⇔ ఆశించిన రీతిలో వస్తువు లేనప్పుడు ⇔ కొన్ని విభాగాల్లో లోపాలున్నప్పుడు ⇔ అధిక ధర వసూలు చేసినప్పుడు ⇔ సదరు వ్యాపారి సరిగ్గా స్పందించనప్పుడు ⇔ ఫోరం తేల్చి..వినియోగదారుడికి న్యాయం జరిగేలా చూస్తుంది ⇔ లేదంటే జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తుంది హక్కులకు భద్రత.. చట్ట సవరణ బిల్లు ద్వారా..హక్కులకు అధిక భద్రత లభించనుంది. తగిన రశీదులతో సంప్రదిస్తే కచ్చితంగా నష్ట పరిహారం పొందవచ్చు. వివరాలు స్పష్టంగా ఉండాలి. – పి.మాధవ్రాజా, వినియోగదారుల ఫోరం, జిల్లా చైర్మన్ రశీదులు పొందాలి.. ఎరువులు, పురుగుమందులు అమ్మే వ్యాపారుల నుంచి రైతులు రశీదులు కొనాలి. ఫోరంను ఆశ్రయించడానికి రశీదులు తప్పనిసరి. న్యాయసేవాసంస్థ ద్వారా చైతన్యం కల్పిస్తూనే ఉన్నాం. – వినోద్కుమార్, న్యాయసేవాసంస్థ కార్యదర్శి మోసపోవద్దనే చట్టం.. వ్యాపారస్తుల చేతిలో వినియోగదారుడు మోస పోవద్దనే..రక్షణ చట్టాన్ని రూపొందించారు. మోసాలను వేలెత్తి చూపి..అడగగలగాలి. ఫోరంను ఆశ్రయించాలి. – రేణిగుంట ఉపేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ -
మీ హక్కులను గుర్తించండి
కాకినాడ లీగల్: కొనుగోలు చేసిన వుస్తువు, సేవల (ఆస్పత్రి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలు) పూర్తి స్థాయి ప్రయోజనం పొందే హక్కు వినియోగదారుల చట్టం-1986 ప్రకారం కొనుగోలుదారుడికి ఉంది. లోపాలున్నా, సమస్యలు ఏర్పడినా సంబంధిత సంస్ధ నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వినియోగదారులఫోరాన్ని ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు చేయడం ఇలా... నష్టపోయినవారు వినియోగదారులఫోరం హెల్ప్డెస్క్ సలహా మేరకు కేసు దాఖలు చేయవచ్చు. రసీదు కీలకం. ఆయా ఆధారాలతో కనీస రుసుము చెల్లించి ఫిర్యాదు చేయాలి. –వ్యాపారి లేదా డీలరు ద్వారా సష్టపోతే ఫిర్యాదు చేయవచ్చు. –వస్తువులో లేదా ఉత్పత్తిలో లోపాలు ఉన్నా, సేవల విషయంలో డీలర్లు ఆశ్రద్ధ చేసినా, అధిక ధర వసూలు చేసినా, మరే కారణాలతో నష్టపోయినా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. నోటిసులో ఏం ఉండాలంటే... –ఉత్పత్తి సర్వీస్ ప్రొవైడర్ లేక కంపెనీ చిరునామా రాయాలి. –‘విషయం’లో ఫిర్యాదు ఇచ్చే ముందు నోటీసుగా పేర్కొనాలి. –కొన్న వస్తువు లేదా సర్వీస్ వివరాలు ఇవ్వాలి. (క్యాష్ మెమో నంబరు, తేదీ). –సంస్ధ ఇచ్చిన వారంటీ లేదా గ్యారంటీ వివరాలు తెలపాలి. –వస్తువు లోపాన్ని, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తెలపాలి. –ఇబ్బందులపై ఎవరికి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో తెలపాలి. –స్పందించడానికి సంస్థకు 15–30 రోజుల గడువు ఇవ్వాలి. –కొన్న వస్తువుకు పుల్ అమౌంట్ కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ కూడా కోరవచ్చు. –చివరిగా వినియోగదారుని పేరు, అడ్రస్ ఇవ్వాలి. నోటీసు పంపే విధానం.. –పంపిన నోటీసు సంస్ధకు చేరినట్టు మీ వద్ద ఆధారం ఉండాలి. –అందుకు నోటీసును అక్నాలెడ్జ్మెంట్ డ్యూ పోస్ట్, కొరియర్, హ్యాండ్ డెలివరీ విత్ ప్రూఫ్ పద్ధతుల్లో పంపవచ్చు. ఎలా పంపినా నోటీసు పంపినట్టు ఆధారం ఉండాలి. దానిని కోర్టులో ఇవ్వాలి. –సదరు సమస్యపై చేసిన ప్రయత్నాలు, ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను జిరాక్స్ పత్రాలుగా నోటీసుకు జత చేస్తే మంచిది. ఫోరం పనితీరు... నష్టం రూ.20 లక్షల వరకు అయితే జిల్లా వినియోగదారుల ఫోరంను, రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకూ అయితే రాష్ట్ర ఫోరాన్ని ఆపైన అయితే ఢిల్లీలోని జాతీయ ఫోరాన్ని ఆశ్రయించాలి. ఫీజు వివరాలు.. వినియోగదారుల ఫోరంలో కేసుకు రూ.లక్ష (వస్తువు విలువ) వరకు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రూ.200, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రూ.500 ఫీజు చెల్లించాలి. నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఫోరం ఎక్కడ.. కాకినాడ, రాజమండ్రి కోర్టుల్లో జిల్లా ఫోరాలు ఉన్నాయి. వినియోగదారుల బాధ్యత –కొనుగోలు చేసే వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. –మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్త వహించాలి –నాణ్యతలో రాజీ వద్దు ఆఫర్ల విషయంలో పరిశీలన చేయాలి. ప్రతి కొనుగోలుకూ రసీదు, వారంటీపై సంతకం, స్టాంపు ఉండాలి. హెల్ప్ డెస్క్ను ఉపయోగించుకోండి: వినియోగదారుల ఫోరంలోని హెల్ప్డెస్క్ను ఆశ్రయిస్తే ఫిర్యాదు చేసే విధానాన్ని తెలియజేస్తారు. ఫిర్యాదు ఇచ్చి సెల్నంబర్ ఇస్తే కేసు వివరాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. - ఎస్ భాస్కరరావు,వినియోగదారుల ఫోరం మెంబర్ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తాం.. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వినియోగదారుల చట్టం గురించి గ్రామీణ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంఘాలు ద్వారా గ్రామీణ ప్రజల వినియోగదారుల్ని చైతన్య పరిచేందుకు కృషి చేయాలి. - ఎ. రాధాకృష్ణ, వినియోగదారుల ఫోరం, అధ్యక్షుడు