ఆగి ఉన్న లారీని ఢీకొని దంపతులు మృతి
జగిత్యాల, న్యూస్లైన్ :శుభకార్యానికి వెళ్లి సంతోషంగా ఇంటికి తిరుగుపయణమైన భార్యభర్తలను మృత్యువు కబలించింది. ద్విచక్రవాహనంపై వస్తూ ఆగి ఉన్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరి గింది. ఈ ఘటనలో దంపతులు చనిపోగా.. వారి మనవరాలు గాయపడింది. మేడిపల్లి మండలం కట్లెకుంట గ్రామానికి చెందిన ఉప్పులూరి గంగరాజం(50), అతడి భార్య రాజవ్వ(48) జగిత్యాల మండలం పొలాస గ్రామంలోని బంధువుల ఇంట్లో మంగళవా రం జరిగిన శుభ కార్యానికి హాజరయ్యారు.
తమ మనవరాలు సాత్వికతో కలిసి రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. జగిత్యాల-నిజామాబాద్ రోడ్డులో రిలయన్స్ పెట్రోల్బంకు సమీపంలో అగి ఉన్న లారీని ఢీకొట్టా రు. గంగరాజం, ఆతడి భార్య రాజవ్వ అక్కడిక్కడే మృతి చెందారు. సాత్వికకు గాయాలు కాగా, ఆమెను కరీంనగర్ కు తరలించారు. వీరి వెనుకే బైక్పై వస్తున్న కుమారుడు వెంకటేశ్ బంధువులకు సమాచారం అందించాడు. సీఐ కిరణ్కుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. లారీలో షాబాదు రాళ్లుండగా.. డ్రైవర్ కనిపించలేదు. గంగరాజం గల్ఫ్ దేశాలకు వెళ్తూ.. వస్తుంటారు. ఆయన ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది.