breaking news
bipoll elections
-
సంతోషంలో రామయ్య.. యోగికి చురకలు
సాక్షి, బెంగళూరు : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెట్టింపు సంతోషంతో తన స్వరాన్ని పెంచారు. ట్విటర్ వేదికగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు ఉపన్యాసాలు తగ్గించుకోండి' అంటూ హితబోధ చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించే బీజేపీ ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. 'ఒక సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ తీవ్ర అవమాన భారంతో బాధపడుతోంది. చరిత్రాత్మక విజయం సాధించిన సమాజ్వాది పార్టీ బీఎస్పీలకు నా అభినందనలు. బీజేపీయేతర పార్టీల ఐక్యత చాలా కీలక పాత్ర పోషించింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇవ్వడం తగ్గించుకుంటే ఆయనకే మంచిదంటూ చురకలంటించారు. ముందు ఆయన ఉండే చోటులో అభివృద్ధిని పట్టించుకోవాలన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకపై దృష్టిని సారించింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో విజయం అనంతరం ఇక తమ దృష్టి కర్ణాటకపై అని చెప్పింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, పైగా దాదాపు 30 ఏళ్లుగా బీజేపీ ఆదిపత్యం కొనసాగిన చోట ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
'కథలు కాదు.. మీకు బుల్లెట్లాంటి మంత్రి ఉండు'
నారాయణ ఖేడ్: దేశంలో ఎక్కడా లేని వృద్ధులకు వెయ్యి రూపాయల ఫించన్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికలాంగులకు రూ.1500 ఇస్తున్నామని గుర్తు చేశారు. నెలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఆటోవాలాలకు ట్యాక్స్లు లేకుండా చేశామని గుర్తు చేశారు. నారాయణ ఖేడ్ లో ఉప ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఇక్కడికి వచ్చిన కేసీఆర్ మాట్లాడారు. డ్రైవర్లకు బీమా ఇస్తున్నామని, నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లులు తగ్గిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు. 'హాస్టల్ లో చదువుకునే పిల్లలకు సన్న బియం పెడుతున్నారు. కథలు చెప్పడానికి ఇక్కడకు రాలేదు. విద్యాధికులు, ఉద్యోగులు, మేధావులు ఆలోచించాలి. నారాయణ ఖేడ్ లో స్వాతంత్ర్యంలేదు. గుండాగిరి దాదాగిరి, డబ్బులివ్వడం, తాగుడు పోయడం, ఒట్లు వేయించడం అంతా పాత చింతకాయ పచ్చడే. బుల్లెట్ లాగా దూసుకెళ్లే మంత్రి (హరీష్ రావు) మీ మధ్య ఉన్నారు. హరీష్ రావు మిమ్మల్ని భూపాల్ రెడ్డిని గెలిపించాలని అడుగుతున్నాడు. నారాయణ్ ఖేడ్ ను సిద్ధిపేటలాగా మారుస్తా అంటున్నాడు. మీరు అలాగే చేసి భూపాల్ రెడ్డికి ఓటేస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్లు కడుగుత' అని కేసీఆర్ ఆన్నారు. నారాయణ ఖేడ్ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదని, గతంలో రెండు సార్లు ఇక్కడి వచ్చానని కేసీఆర్ అన్నారు. 'నారాయణ ఖేడ్ లో ఇన్ని రోజులు మార్కెట్ కమిటీ ఉండదా, మార్కెట్ యార్డ్ ఉండదా, హాస్పత్రులు ఉండవా, ఇంత దారుణంగా ఉంటుందా, ఇంకా దారిద్ర్యం కావాల్నా.. కాంగ్రెస్, టీడీపీ పాలన పాత చింతకాయ పచ్చడేగా. కాంగ్రెస్, టీడీపీ ఏం చేసిర్రో మీకు తెలియనిది కాదు. తెలివిగా ఓటెయ్యాలంటే భూపాల్ రెడ్డిని గెలిపించాలి. నారాయణ ఖేడ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. రెండు రోజులపాటు నేనే స్వయంగా తిరిగి అన్ని అభివృద్ధి పనులు చేస్తా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.