breaking news
Baruva village
-
ఎస్సీ హాస్టల్ విద్యార్థుల భోజనం బియ్యంలో పురుగులు
-
చిలక చిక్కింది!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇసుక తిన్నెలతో అలరించే సుందర బారువా తీరం ఒకవైపు.. మహేంద్ర తనయ నదీ సంగమం మరోవైపు. పచ్చని ప్రకృతి పరచుకునే తోటలతో శ్రీకాకుళం జిల్లాలోని ఈ తీర ప్రాంతం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు బీచ్ వదిలి వెళ్లినా ఓ సందేహాన్ని మాత్రం వెంట తీసుకెళ్తుంటారు. బీచ్లో కొంతదూరంలో కనిపించే ఆ కర్ర ఏమిటని..? సుడిగుండాల భయంతో.. అవి.. ‘చిలకా’ అనే పేరున్న నౌక ఆనవాళ్లు. ఎప్పుడో వందేళ్ల నాడు మునిగిపోయిందని స్థానికులు చెబుతుంటారే తప్ప సుడిగుండాల భయంతో అక్కడికి వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన లివిన్ అడ్వెంచర్స్ స్కూబా డైవింగ్ బృందం సుడిగుండాల వెనుక రహస్యాల్ని ఛేదించింది. నౌక అవశేషాలు స్కూబా డైవింగ్తో అన్వేషణ బారువ సముద్ర తీరంలో ఈనెల 27వతేదీన ముగ్గురితో కూడిన లివిన్ అడ్వెంచర్స్ బృందం పరిశోధన మొదలైంది. ఇన్స్ట్రక్టర్ బలరాం నాయుడు, డైవ్ మాస్టర్ రాహుల్, అడ్వాన్స్ డైవర్ లక్ష్మణ్ సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అన్వేషణ ప్రారంభించారు. ఒడ్డుకు 400 మీటర్ల దూరంలో ఉన్న కర్ర వద్దకు చేరుకున్నారు. సాగర గర్భంలో 7 మీటర్ల లోతు వెళ్లాక వారికి నౌక అవశేషాలు కనిపించాయి. శిథిలావస్థలో ఉన్న నౌకలో గోలియత్ గ్రూపర్స్, లయన్ ఫిష్, ఎలక్ట్రిక్ రే, సిల్వర్ మూనీ తదితర జలచరాలు నివాసమున్నట్లు గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో గడిపి నౌక వివరాలను సేకరించారు. నౌక వెనుక భాగం పైకి ఉండటం వల్ల అలలు వచ్చినప్పుడు ఆ తాకిడికి రిప్ కరెంట్లా మారి సుడిగుండాలు ఏర్పడినట్లు కనిపిస్తుంటుందని, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సాహస యాత్ర చేసిన లివిన్ అడ్వెంచర్స్ బృందం ‘నౌక పూర్తిగా శిథిలమైంది. అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్న భాగాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల అలలు ఉధృతంగా వెనుక భాగానికి తగిలి సుడిగుండాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నౌక వెడల్పు కొలవలేకపోయాం. గతంలో మా బృందం విజయనగరం జిల్లా చింతపల్లి తీరంలో, విశాఖ జిల్లా భీమిలి తీరంలో మునిగిన నౌకల్ని అన్వేషించింది. – బలరాం నాయుడు (లివిన్ అడ్వెంచర్ సంస్థ ఇన్స్ట్రక్టర్) -
పై-లీన్ తుపాను ప్రభావంతో.. భీతిల్లిన బారువ
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామం... ఉదయం 6 గంటలు: గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు. వాటికి తోడు చిరుజల్లులు. తుపాను ముప్పు హెచ్చరికలు ఉన్నా.. ‘ఆ అవన్నీ మనకు మామూలే కదా’ అన్న భావనే స్థానికుల్లో కనిపించింది. షరామామూలుగా దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఉదయం 7.30 - 10 గంటల మధ్య: వాతావరణంలో కొంత మార్పు. గాలి వేగం.. వర్షం జోరు పెరిగింది. అయినా షాపులు, హోటళ్లు తెరుచుకున్నాయి. ఎవరిలోనూ పెద్దగా ఆందోళన లేదు. ఉదయం 10 - 12 గంటల మధ్య: గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లు మించింది. దాంతోపాటే స్థానికుల్లో ఆందోళన పెరిగిపోవటం మొదలైంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరిగింది. మధ్యాహ్నం 12 - 2 గంటల మధ్య: పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గ్రామానికి చేరుకుని మైకుల్లో హెచ్చరికలు జారీ చేయటం మొదలుపెట్టారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న బీచ్ను ఖాళీ చేయించారు. రోడ్లు, వీధుల్లో ఉన్న వారిని ఇళ్లలోకి పంపించేశారు. వాహనాలను కూడా తిరగనివ్వలేదు. 2 - సాయంత్రం 6 గంటల మధ్య: అంతవరకు కొంత సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది. షాపులు మూతపడ్డాయి. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలి హోరెత్తింది. జనం గుండెల్లో గుబులు రేగింది. సాయంత్రం 6 గంటల తర్వాత: పరిస్థితి మరింత భీకరంగా మారింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. కరెంటు లేదు. అంతటా అంధకారం. ఏం జరుగుతుందో.. బయటకెళితే ఏమైపోతామోనన్న భయం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. తుపాను తీరాన్ని తాకకముందు బారువ గ్రామంలో శనివారం నెలకొన్న పరిస్థితి ఇది. సముద్ర తీరంలోనే ఉన్న ఈ మేజర్ పంచాయతీకి ఆనుకొని తీరంలో బారువకొత్తూరు, వాడపాలెం ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 3,500 మందిని సోంపేట, బారువల్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. సముద్రపు అలలు కొత్తూరు, వాడపాలెం గ్రామాలను తాకి భీతిగొల్పాయి. ఇద్దివానిపాలెం, ఈదుపురం, కపాసుకుద్ది, నువ్వులరేవు, మంచినీళ్లపేట, బందరువానిపేట, దేవునల్తాడ, ఒంటూరు, పూడివలస తదితర పదుల సంఖ్యలో గ్రామాలు శనివారం నాటి పెను తుపాను విలయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపాయి. శనివారం రాత్రి గడిస్తే తప్ప.. తుపాను విలయం ఏ స్థాయిలో ఉంది? ఎవరు ఎక్కడున్నారు? ఆస్తులు ఎలా ఉన్నాయో?... నష్టం ఏస్థాయిలో ఉందో తెలుసుకోలేని దయనీయ స్థితి. - న్యూస్లైన్, కంచిలి