breaking news
aurangabad police
-
కానిస్టేబుల్ కూతురిని రేప్ చేసిన డీసీపీ
ఔరంగాబాద్: మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఇంకాస్త ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ).. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్ ధక్నే తెలిపిన వివరాలివి... తీవ్రంగా హింసించాడు: ఔరంగాబాద్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి డీసీపీ రాహుల్పై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖలో కలకలం.. సెలవులో డీసీపీ: మహిళా కానిస్టేబుల్ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ‘‘బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్ శ్రీరామ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని దర్యాప్తు అధికారి వినాయక్ మీడియాకు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
పోలీసు స్టేషన్లో దుస్తులు విప్పించి..
రక్షక భటులే భక్షకులయ్యారు. నీచాతి నీచంగా వ్యవహరించారు. విచారణ కోసం పిలిచిన ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. వారి ఒంటిపై కారం చల్లి అమానుషంగా ప్రవర్తించారు. దీంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో గల క్రాంతి చౌక్ పోలీసుస్టేషన్కు చెందిన ముగ్గురు సిబ్బందిపై విచారణ కొనసాగుతోంది. తమ స్నేహితురాలి మరణం విషయంలో విచారణ కోసం పిలిపించారని, అక్కడ ఒక మగ పోలీసు సూచనల మేకు ఓ మహిళా పోలీసు తమను దుస్తులు విప్పాల్సిందిగా బలవంతపెట్టిందని ఇద్దరు మహిళల్లో ఒకరైన ఓ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ (21) చెప్పారు. తర్వాత తమ ఒంటిపై చెప్పుకోలేని చోట్ల కూడా కారం చల్లారని వాపోయారు. ఆరోపణల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దీనిపై వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశించామని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు. జనవరి 4న జరిగిన ఓ రోడ్డు ప్రమాదం గురించి విచారించేందుకు ఆ ఇద్దరు మహిళలను క్రాంతి చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని జనవరి 6 సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. విడుదలైన వెంటనే ఆ మహిళ, ఆమె తల్లి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి, ఈ విషయాన్ని డీసీపీ సందీప్ అతోలే దృష్టికి తీసుకెళ్లారు. ఆమె, మరో ఆరుగురు స్నేహితులు కొత్త సంవత్సరం వేడుకల కోసం ఓ హోటల్కు వెళ్లారు. ఇద్దరు మహిళలు తప్ప మిగిలినవారంతా మద్యం తాగారు. వాళ్లలో ఒక యువకుడు మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. దాంతో అతడిని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దేవగిరి కాలనీ వద్ద వదిలిపెట్టి మహిళలిద్దరినీ వాళ్ల ఇంటివద్ద దింపేందుకు వెళ్లారు. తర్వాత సెంట్రల్ బస్టాండు వద్దకు వెళ్లగా, అక్కడ తమ స్నేహితుడు కనిపించాడు. అంతకుముందు పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని వాళ్లు కొట్టారు. అతడు అక్కడి నుంచి పరిగెడుతూ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు చెప్పారు. మర్నాటి ఉదయం ఎస్ఐ గణేష్ ఢొక్రట్, మరో మహిళా ఎస్ఐ తమను స్టేషన్కు తీసుకెళ్లారని, అక్కడ తమను విపరీతంగా తిట్టడమే కాకుండా దుస్తులు విప్పించి, చెప్పుకోలేని చోట్ల కారం చల్లారని మహిళలిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడి మృతికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి ఉన్నా, తమతో బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పించారన్నారు. ఈ కేసు నుంచి బయటపడేయాలంటే లంచాలు ఇవ్వాలని అడిగినట్లు కూడా ఆరోపించారు.