ఇద్దరు సబ్రిజిస్ట్రార్లపై ఏసీబీ కేసు
చిత్తూరు(కార్పొరేషన్): జిల్లా కేంద్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు ఆ శాఖ ఉద్యోగులను ముచ్చెమటలు పట్టించాయి. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో సుమారు రూ.75 వేలు అనధికార నగదుగా గుర్తించారు. ఏసీబీ ఈ దాడులకు రెండు రోజుల నుంచి సమాచారం సేకరిస్తోందని తెలిసింది. దాడులతో రిజిస్ట్రేషన్ అధికారులు నివ్వెరపోయారు. అక్రమంగా వసూలు చేసిన సొమ్మును ఆదరాబాదరగా కొందరు చెత్తకుండీలు, ప్రింటర్లలో దాచే ప్రయత్నం చేశారని తెలిసింది. మరికొంత మంది కిటికీ లోంచి బయటకు పడవేశారని ఓ అధికారి తెలిపారు. ఎలాంటి లెక్కలేని రూ.75 వేలు బయటపడ్డాయి. సబ్ రిజిస్ట్రార్ అధికారులు అశోక్ కుమార్, పద్మశేఖర్ రెడ్డిలతో పాటు 17 మందిపై కేసులు నమోదు చేశారు.
వాటాలు పంచుకునే సమయాన..
సాధారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అక్రమ మొత్తాలను ఏజెంట్లు అధికారులకు అందిస్తారని సమాచారం. దీనిని ముందుగా నిర్ణయించుకున్న విధంగా పంచుకుంటారు. ఈవిషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు సాయంత్రం సమయం ఎంచుకుని దాడి చేశారు. దీంతో అవినీతికి పాల్పడిన వారు దొరికిపోయారు.
నివేదిక పంపిస్తాం..
ప్రతి చిన్న పనికీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిసింది. ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు, 17 అనధికార ఏజెంట్లపై కేసు నమోదు చేశాం. వీరి వద్ద నుంచి రూ.75వేలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశాం. కేసు నమోదు చేసి నివేదిక ప్రభుత్వానికి పంపిస్తాం. – శంకర్రెడ్డి, ఏసీబీ డీఎస్పీ తిరుపతి.