breaking news
Assembly committees
-
‘మినీ మండళ్లు’ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగి అసెంబ్లీ కొలువు దీరి రెండేళ్లు పూర్తయినా ‘మినీ శాసనమండళ్లు’గా వ్యవహరించే అసెంబ్లీ కమిటీలు మాత్రం ఇప్పటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. శాసనసభ నిర్వహణలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రెండేళ్లుగా భర్తీ కాలేదు. మరోవైపు అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులను సమన్వయం చేసే చీఫ్ విప్, విప్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. మండలిలోనూ ప్రభుత్వ విప్ పదవులు భర్తీ కాలేదు. దీంతో అసెంబ్లీ నిర్వహణలో వైఫల్యాలు చోటుచేసుకుంటూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ పనితీరును విశ్లేషించి అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్దేశించే అసెంబ్లీ కమిటీలు లేకపోవడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పాటించట్లేదు. అసెంబ్లీకి ఉన్న సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే ఈ కమిటీలు ఆర్థిక, అంచనాల పరిశీలన, ప్రభుత్వ ఖర్చుల ఆడిట్, చట్టాల అమలు పర్యవేక్షణ, సభా కార్యకలాపాల నిర్వహణ, అసెంబ్లీ సభ్యుల అధికారాల పరిరక్షణ కోసం పనిచేస్తాయి. వివిధ శాఖల పనితీరు నివేదికలు, సిఫారసులను ఈ కమిటీలు ప్రభుత్వానికి అందిస్తాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంచేస్తోంది. కానీ అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు కమిటీలే ఏర్పాటు అసెంబ్లీలో అంతర్భాగమైన శాసనసభ, శాసనమండలికి సంయుక్తంగా, విడివిడిగా కలిపి మొత్తం 24 కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కూడిన 13 కమిటీలు, శాసనసభకు ఐదు, మండలికి ఆరు కమిటీలు ఉంటాయి. అయితే ఇప్పటివరకు 4 సంయుక్త కమిటీలు, శాసనసభ, మండలికి బిజినెస్ అడ్వైజరీ కమిటీలే ఏర్పడ్డాయి. శాసనసభ, మండలి సభ్యులతో కూడిన పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీలు 2023 డిసెంబర్లో ఏర్పడగా మీడియా అడ్వైజరీ కమిటీ ఇటీవల ఏర్పాటైంది. అయితే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సతీమణి, కోదాడ ఎమ్మెల్యే అయిన పద్మావతిరెడ్డి చైర్పర్సన్గా ఎస్టిమేట్స్ కమిటీ ఏర్పాటవగా ఆమె మొదట్లోనే రాజీనామా చేశారు. నాటి నుంచి కొత్త కమిటీ నియామకం జరగలేదు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)ని ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్గా నియమించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలుపుతోంది. షాద్నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య అధ్యక్షతన ఏర్పాటైన పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ మాత్రమే అడపదడపా భేటీ అవుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎప్పుడో? డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో సభ్యుల హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని విపక్ష సభ్యులు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచందర్నాయక్ పేరును ఖరారు చేసినట్లు గతంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగలేదు. ప్రస్తుతం ఆయన సభలో కాంగ్రెస్ విప్గా కొనసాగుతున్నారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), ఆది శ్రీనివాస్ (వేములవాడ), బీర్ల ఐలయ్య యాదవ్ (ఆలేరు)లను సైతం విప్లుగా నియమించగా వారిలో అడ్లూరి మంత్రి అయ్యారు. దీంతో అసెంబ్లీలో చీఫ్ విప్తోపాటు రెండు ప్రభుత్వ విప్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండలిలో మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేస్తుండగా విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. సభ హుందాతనం కాపాడాలి రెండేళ్లు గడిచినా అసెంబ్లీ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకం అంశాన్ని గాలికి వదిలేశారు. అన్ని అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. సభ హుందాతనాన్ని కాపాడాలి. – హరీశ్రావు, మాజీ మంత్రిప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సభ నిర్వహణ మొదలు సభా సంప్రదాయాల వరకు అన్నింటినీ తుంగలో తొక్కి ప్రభుత్వం ఇష్టారీతిన సభ నడుపుతోంది. ఇప్పటికైనా అసెంబ్లీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. – ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
28న అసెంబ్లీ కమిటీల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న శాసనసభ భవనంలోని కమిటీ హాల్లో ఉదయం 11 గంటలకు ‘పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ’, ఉదయం 11.30 గంటలకు ‘షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ’సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు తెలిపారు. -
‘ప్రశ్నిస్తే ప్రభుత్వంలో జవాబుదారీతనం’
సాక్షి, అమరవతి: శాసనసభ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏపీ అసెబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు తీరును కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని తమ్మినేని తెలిపారు. పథకాల అమలులో జరుగుతున్న జాప్యం, లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జరుగుతున్న లోపాలను ప్రశ్నిస్తే ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం వస్తుందని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గోప్ప ప్రాధాన్యం ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. ఆ ఫలాలను మహిళలకు అందేలా సలహాలివ్వాలని అసెంబ్లీ కమిటీలకు స్పీకర్ తమ్మినేని సూచించారు. -
ఏపీ అసెంబ్లీ కమిటీలు నియామకం
సాక్షి, అమరావతి: పలు అసెంబ్లీ కమిటీలను నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు నూతనంగా చైర్మన్, సభ్యులను నియమించినట్టు పేర్కొంది. అందులో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. దీంతో పాటు పిటీషన్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గా కొట్టు సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్గా అంబటి రాంబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణను నియమించటంపై ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
సభా కమిటీల్లో మనోళ్లు!
సాక్షి , వరంగల్: సభా కమిటీల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు అవకాశం దక్కింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సభా కమిటీల్లోను ఓరుగల్లుకు పెద్దపీట వేయనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఆయా కమిటీల వివరాలిలా ఉన్నాయి. జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సర్వీస్ మెంబర్ : నన్నపనేని నరేందర్ (వరంగల్ తూర్పు) అసెంబ్లీ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా గండ్ర వెంకటరమణరెడ్డి(భూపాలపల్లి) ప్రివిలేజ్ కమిటీ సభ్యుడిగా డాక్టర్ టి.రాజయ్య (స్టేషన్ఘన్పూర్) కమిటీ అన్ గవర్నమెంట్ అక్యూరెన్స్ సభ్యుడిగా చల్లా ధర్మారెడ్డి (పరకాల) ఫైనాన్షియల్ కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిలుగా పెద్ది సుదర్శన్రెడ్డి(నర్సంపేట), పల్లా రాజేశ్వర్రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ సభ్యుడిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ) కమిటీ ఆన్ పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యుడిగా బానోతు శంకర్నాయక్(మహబూబాబాద్) లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీలు రూల్స్ కమిటీ సభ్యుడిగా పల్లా రాజేశ్వర్రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) పిటీషన్స్ కమిటీ సభ్యుడిగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి(స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ అండ్ అదర్ జాయింట్ కమిటీలు అమెనిటీస్ కమిటీ సభ్యులుగా దాస్యం వినయ్భాస్కర్(వరంగల్ పశ్చిమ), పల్లా రాజేశ్వర్రెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కమిటీ సభ్యులుగా ధనసరి అనసూయ(ములుగు) వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ సభ్యుడిగా బానోతు శంకర్నాయక్(మహబూబాబాద్) వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సభ్యుడిగా నన్నపనేని నరేందర్(వరంగల్ తూర్పు), పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ) లైబ్రరీ కమిటీ సభ్యులుగా చల్లా ధర్మారెడ్డి (పరకాల), ధనపరి అనసూయ(ములుగు) -
స్పీకర్ కోడెలకు సత్కారం
స్పీకర్ కోడెల శివప్రసాదరావును జ్ఞాపికతో సత్కరిస్తున్న మండలిచైర్మన్ చక్రపాణి తదితరులు * ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న శివప్రసాదరావు * అసెంబ్లీ కమిటీలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తై సందర్భంగా ఆయన్ను సోమవారం పలువురు అభినందించారు. శాసనసభ ఇన్ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ నేతృత్వంలో అసెంబ్లీ సిబ్బంది శాసనసభ ఆవరణలో ఈ సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ ఎ. చక్రపాణి, వైస్ చైర్మన్ ఎస్వీ సతీష్రెడ్డి, శాసనమండలి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్ తదితరులు కోడెలను అభినందించారు. చట్టసభ నిర్వహణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తనకు అభినందనలు తెలిపిన వారికి స్పీకర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు. కమిటీల సూచనలు విలువైనవి శాసనసభ కమిటీలు చేసే సూచనలు విలువైనవని శాసనసభాపతి కోడెల అన్నారు. సోమవారం ఆయన నైతిక విలువలు, పిటీషన్స్, మెనారిటీ సంక్షేమంపై నియమించిన శాసనసభ కమిటీలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్లు మండలి బుద్ధప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎథిక్స్ కమిటీకి సీనియర్ శాసనసభ్యుడు పతివాడ నారాయణ స్వామినాయుడును చైర్మన్గా నియమించారు. ఆయన అందుకు సమ్మతించలేదు. దీంతో చైర్మన్గా ఉపసభాపతి మండ లి బుద్ధప్రసాద్ను నియమించారు. పిటీషన్స్ కమిటీ ఛైర్మన్గా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. నేడు నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్సీలు నలుగురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైవీబీ రాజేంద్రప్రసాద్ (కృష్ణా), రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


