breaking news
amala puram
-
కోడ్.. డోన్ట కేర్
వెవ్వెవ్వే... అనధికారికంగా బోడసకుర్రు వంతెన ప్రజలకు అంకితం పరోక్షంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఎంపీ హర్షకుమార్ పాల్గొన్న రుద్రరాజు పద్మరాజు ప్రారంభోత్సవ స్వాగతం పేరుతో ఫ్లెక్సీలు అధికారుల అయోమయం పాశర్లపూడి-బోడసకుర్రు వంతెనపై నడిచి వెళుతున్న ఎంపీ హర్షకుమార్ ఎన్నికల కోడ్ను తూనాబొడ్డు అని ఎలా వెక్కిరించవచ్చో మన ఎంపీ హర్షకుమార్ ప్రాక్టికల్గా నిరూపించారు. బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ గోదావరి పాయపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలేజీ కొట్టేయాలని భావించిన ఆయనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడితే తననకున్న రాజకీయ లక్ష్యాన్ని సాధించలేనని భావించిన ఆయన తన బుర్రకు పదును పెట్టారు. పత్రికలకు ప్రకటనలొచ్చేశాయ్... ఫ్లెక్సీలు వెలిశాయ్... మీడియాను పిలిచారు... జనాన్ని పోగేశారు... వారితో వంతెనకు ఇటు నుంచి అటు నడిచి ఇక రాకపోకలు సాగించుకోవచ్చని సెలవిచ్చారు. మొత్తమ్మీద కోడ్కు చిక్కకుండా, అధికారులకు దొరక్కుండా మీడియా సాక్షిగా వంతెనను ప్రారంభించి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అమలాపురం, న్యూస్లైన్ : పదేళ్లుగా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ పరోక్షంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ గోదావరి పాయపై నిర్మించిన వంతెనను మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అనధికారికంగా ఆరంభించారు. ఎన్నికల కమిషన్కు దొరకకుండా వంతెనను అనధికారికంగా ఆరంభించి దుస్సంప్రదాయానికి తెర తీశారు. శాసనమండలి విప్ రుద్రరాజు పద్మరాజు, అధిక సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను వెంటబెట్టుకుని వంతెనపై నుంచి ఎంపీ నడచివచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రారంభోత్సవం నిలుపు చేయాలని జిల్లా అధికారులు చెప్పినా పట్టించుకోని హర్షకుమార్ తాను అనుకున్నదే చేస్తానని మరోసారి నిరూపించారు. కళ్లుగప్పి వ్యూహాత్మకంగా... ఆరు నూరైనా ప్రారంభిస్తానని చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వంతెన ప్రారంభోత్సవ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రారంభోత్సవాన్ని నిలుపు చేస్తున్నామని, తాను వంతెన పనులు పరిశీలించేందుకు వెళుతున్నానని మీడియాకు సమాచారం అందించారు. ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించకుండా, కొబ్బరికాయ కొట్టకుండా జాగ్రత్తపడ్డ ఆయన, మిగిలిన కార్యక్రమమంతా ప్రారంభోత్సవాన్ని తలపించేటట్టు చేశారు. వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్న హర్షకుమార్కు స్వాగతం అంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వంతెనపైకి చేరుకోగానే ‘వంతెన ప్రారంభించిన ఎంపీ హర్షకుమార్ జిందాబాద్’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. తొలుత బోడసకుర్రు చేరుకున్న ఆయన వంతెనపై నుంచి వెళ్లే అవకాశమున్నా పడవపై పాశర్లపూడి వైపు చేరుకున్నారు. శిలాఫలకం నిర్మించిన ప్రాంతం నుంచి కాలినడకన వంతెనపైకి చేరుకున్నారు. అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైజై నినాదాల మధ్య హర్షకుమార్ కొత్త వంతెనపై నడక సాగించారు. అక్కడ నుంచి వంతెనపై బోడసకుర్రు వరకూ నడుచుకుంటూ వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంతెనను అధికారికంగా ప్రారంభించాలనుకున్నా ఎన్నికల కోడ్ వల్ల కుదరలేదని, అయితే తనతోపాటు ప్రజలు నడిచి రావడంతో రాకపోకలు ఆరంభమవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఎన్నికల కోడ్కు భయపడి పి.గన్నవరం తాజామాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవీ పాశర్లపూడి వద్ద ఎంపీకి స్వాగతం పలికి వెళ్లిపోయారు. కలెక్టర్ ఆగ్రహం వంతెన ప్రారంభోత్సవ సన్నాహాలు చేయడంపై జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వంతెన ఫొటో, కేంద్రమంత్రుల ఫొటోలతో ‘వైనతేయ వారధి ప్రజలకు అంకిత’మంటూ వచ్చిన ప్రకటనలతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వంతెన ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు చేయడం, సభకు టెంట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై డివిజన్ స్థాయి అధికారులపై మండిపడ్డారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు. ఫ్లెక్సీలు తొలగించి శిలాఫలకం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోడ్ ఉల్లంఘనకు దొరక్కుండా వంతెన అనధికారికంగా ప్రారంభమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జేఏసీ నిరసన వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ వస్తే అడ్డుకోవాలని వెళ్లిన కోనసీమ జేఏసీ నాయకులు ఆయన రాకపోయినా నల్లజెండాలతో వంతెన వద్ద నిరసన తెలిపారు. అమలాపురం నుంచి ప్రదర్శనగా వెళ్లిన వారు వంతెన వద్ద హర్షకుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి సర్వే దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘తెలంగాణ నేతలతో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు కారకుడైన ఎంపీ హర్షకుమార్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ వి.ఎస్.దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు, ప్రతినిధులు మంత్రిప్రగడ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బోడసకుర్రు వంతెన మరో చించినాడేనా! బోసకుర్రు వంతెన మరో దిండి-చించినాడ వంతెన కానుందా అంటే అవునంటున్నారు కోనసీమ వాసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హర్షకుమార్ ఈ వంతెనను అనధికారికంగా ఆరంభించారు. దీంతో వంతెనపై రాకపోకలు మొదలయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. రేపోమాపో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వంతెనను అధికారికంగా ప్రారంభించాలంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే మే నెలలోగానీ జరిగే అవకాశంలేదు. అప్పటికే వంతెనపై పూర్తిస్థాయిలో రాకపోకలు జరిగి పాతబడే అవకాశం ఉన్నందున కొత్త ప్రభుత్వం దీనిని ప్రారంభించేందుకు పెద్దగా మక్కువ చూపదు. తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య గతంలో నిర్మించిన దిండి-చించినాడ వంతెన సైతం ఇలా అధికారికంగా ప్రారంభోత్సవానికి నోచుకోకుండా పోయింది. అప్పటి లోక్సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి ఈ వంతెనను రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని భావించారు. ఇంతలోనే బాలయోగి మృతి చెందారు. దీంతో ప్రారంభోత్సవం జరగకుండానే వంతెనపై రాకపోకలు ఆరంభమయ్యాయి. ఇప్పుడు బోడసకుర్రు వంతెన పరిస్థితి అలాగే ఉంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. -
పేలిన ట్రాన్స్ఫార్మర్
అమలాపురం రూరల్, న్యూస్లైన్ : అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుధవారం ఉదయం 8గంటల సమయంలో అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భార్యాభర్తలు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ పేలే సమయానికి అటుగా వెళుతున్న భార్యాభర్తలు కూతాడి ముకుంద్, పెద్దింట్లమ్మ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఇంటినుంచి అల్పాహారం నిమిత్తం హోటల్కు వెళుతున్నపుడు వీరీ ప్రమాదం బారిన పడ్డారు. పేలిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలతో కూడిన మరుగుతున్న చమురు వీరిపై పడింది. ముకుంద్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె వీపు భాగం మంటల్లో చిక్కుకోగా హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. స్థానికంగా పనిచేస్తున్న జట్టు కూలీలు ఆమెపై ఇసుక పోసి, గోనెసంచులు కప్పి రక్షించారు. సర్పంచ్ నక్కా సంపత్కుమార్ వారిని 108 అంబులెన్స్లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దింట్లమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వెద్యం కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాన్స్కో డీఈ చలపతిరావు, ఏఈ ఎం.సతీష్ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. 70 శాతం పైగా శరీరం కాలిపోగా పెద్దింట్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ వైద్యులు చెబుతున్నారు. ఇళ్లల్లో పనులు చేసుకుని బతికే పెద్దిం ట్లమ్మ ఈ ెప్రమాదానికి గురవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. తప్పిన పెను ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలోనే స్కూల్ బస్సులను ఆపి విద్యార్థులను ఎక్కించుకుంటారని, అయితే బంద్ కారణంగా బుధవారం దుకాణాలు మూసి ఉన్నాయని, విద్యార్థులూ లేరని తెలిపారు. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లీకేజీపై ట్రాన్స్కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.ట్రాన్స్ఫార్మర్లో ఉండే గ్యాస్ వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ట్రాన్స్కో అధికారులు అంటున్నారు. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ శకలాలను పరిశీలన కోసం రాజమండ్రి విద్యుత్ కార్యాలయానికి పంపుతున్నామని పేర్కొన్నారు. కాగా బాధితులను శాఖ తరఫున ఆదుకుంటామని డీఈ చలపతిరావు హామీ ఇచ్చారు.