Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

FM Sitharaman Says India GDP Must Expand To Cater To The Demands Of The People Further
అభివృద్ధి చెందే రంగాలు ఇవే.. నిర్మలా సీతారామన్

ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. వికసిత భారత్ సాధ్యమవుతుందని, ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని 'నరేంద్ర మోదీ' గతంలో చాలా సార్లు చెబుతూనే వచ్చారు. ఈ విషయం మీద కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరు ప్రధానమంత్రి అయినా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని చిదంబరం అన్నారు. ఈ మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా విమర్శించారు. 2004 - 2014 మధ్య జీడీపీ కేవలం రెండు ర్యాంకులు మాత్రమే పెరిగిందని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ క్యాంపస్ డైలాగ్ సభలో వెల్లడించారు.2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వం పదేళ్లలో కేవలం రెండు ర్యాంకులు జీడీపీ పెంచింది. ఆ తరువాత పదేళ్ల మోదీ పాలనలో జీడీపీ ఐదు ర్యాంకులకు ఎగబాకింది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే.. తప్పకుండా జేడీపీ మరింత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్ధిక వ్యవస్థ 2014కు ముందు బాగా తగ్గింది. చెడు విధానాలు, భారీ అవినీతి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తరువాత ఐదో స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో ఇది మూడో స్థానానికి చేరుతుంది. అది మోదీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సీతారామన్ అన్నారు.భారతదేశంలో ఇన్నోవేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉందనే విషయాలను నిర్మల సీతారామన్ వివరించారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో  పునరుత్పాదక వస్తువులు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆగ్రో-ప్రాసెసింగ్ రంగాలు మరింత అభివృద్ధి మార్గంలో నడుస్తాయని స్పష్టం చేశారు.

NEET aspirant hangs self in Rajasthan's Kota 9th suicide this year
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన

దేశంలోనే ‘కోచింగ్‌ హబ్‌’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం  సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. సిబ్బంది సుమిత్‌ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్‌ లాక్‌ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి.  తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.

12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai
చికెన్‌ షావర్మా తిని.. 12 మందికి అస్వస్థత

ముంబై: చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగి రెండు  ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.  వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

శివం దూబే (PC: IPL.com)
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

Gutta Amit Joined In Congress Party
బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో​ షాక్‌ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్‌ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి పార్లమెంట్‌ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

Tendulkar Batted At No 4: Sehwag Sensational T20 WC Message For Virat Kohli
T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్‌ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్‌ టోర్నీలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడని సెహ్వాగ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్‌ జోడీ గురించి మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా నా ఆప్షన్‌. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.మిడిల్‌ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్‌ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్‌ ప్లేలో తను ఇన్నింగ్స్‌ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్‌ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్‌, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్‌ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్‌ టెండుల్కర్‌ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్‌.. ‘‘2007 ప్రపంచకప్‌ టోర్నీలో సచిన్‌ టెండుల్కర్‌ తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేశాడు.మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్‌ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్‌ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్‌ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్‌ ఈవెంట్లో కోహ్లి రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌ లేదంటే.. శుబ్‌మన్‌ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్‌ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

Lion Story Written By KK Raghunandana Funday Children's Story
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!

ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు.      ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది.      ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది.      ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి  సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది.      ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది.      ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది.      ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు.      ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా.      జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి.      ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది.       గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు..

Can Kothapalli Geetha get deposit as Araku MP BJP candidate
కొత్తపల్లి గీతకు డిపాజిట్‌ దక్కేనా?

సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్‌సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి.  బలం తెలిసి.. బీజేపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్‌లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు. అరకులో మరోసారి పరీక్ష ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

AP Elections 2024: CM YS Jagan Public Meeting Speech at Chodavaram
చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్‌

అనకాపల్లి, సాక్షి: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు.  జరగబోయే ఎన్నికలు  ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.‘‘జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్‌.(అందుకు సిద్ధం అని సమాధానం వచ్చింది)మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్‌ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవిందా.. గోవిందా. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్‌లలో నీళ్లు గోవిందా. ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా. గ్రాఫిక్స్‌ రాజధాని కూడా గోవిందా.. గోవిందా. సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను వదిలేశారు. కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా?. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్‌, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Cricket New Zealand Announced T20 World Cup 2024 Squad
న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్‌ మిల్నే స్థానంలో మ్యాట్‌ హెన్రీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్‌ కాన్వేను సైతం న్యూజిలాండ్‌ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్లైన టిమ్‌ సీఫర్ట్‌, టామ్‌ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా ఐష్‌ సోధి, మిచెల్‌ సాంట్నార్‌.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్‌ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా లూక్‌ రాంచీ, బౌలింగ్‌ కోచ్‌గా జేకబ్‌ ఓరమ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా జేమ్స్‌ ఫోస్టర్‌ వ్యవహరించనున్నారు. హెడ్‌ కోచ్‌గా గ్యారీ స్టెడ్‌ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్‌ 7న న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌) ఆడనుంది.న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెట్‌న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ మటిల్డా, ఆంగస్‌ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్‌ గెస్ట్‌లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్‌ క్రికెట్‌ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ వరల్డ్‌కప్‌ జెర్సీని కూడా రివీల్‌ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్‌ కిట్‌ కాకుండా వేరే కలర్‌లో ఉండే కిట్‌లను ధరించనున్నారు.  

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement