రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాజధాని ఢిల్లీలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం సమావేశమయ్యారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ఆందోళన కొనసాగుతుందని, ఇందుకోసం మందుగా సోమవారం పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమాయన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాకు తెలిపారు. రేపటి కార్యాచరణ ఏంటో సాయంత్రానికల్లా నిర్ణయిస్తామన్నారు. ఆహార భద్రత బిల్లు మన రాష్ట్రానికి సంబంధించినది కాదని, ఆ బిల్లుపై తర్వాత మాట్లాడతామని అన్నారు. టీడీపీ విధానం ఏంటో ప్రజలందరికీ తెలుసని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత అన్నట్లుగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి.