తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమ్మెపై జరిపిన చర్చలు సఫలమయ్యాయి
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెరపడింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను నాలుగు రోజుల్లోగా పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు నిర్వహించింది. కేవలం వేతనం పెంపుపైనే హామీ ఇచ్చింది. కీలకమైన ఇతర డిమాండ్లపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో పాల్గొన్న మంత్రులు తెలిపారు.
కార్మికుల వేతనాన్ని నెలకు రూ.2,700 చొప్పున పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆదివారం నుంచి విధుల్లో చేరనున్నారు. వేతనం పెంపు సహా 42 న్యాయమైన డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇటీవల అనంతపురం పర్యటనలో కార్మికులకు మద్దతు ప్రకటించారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్లో శనివారం మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు.
తమ వేతనం రూ.2,700 పెంపును కార్మిక సంఘాలు అంగీకరించాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కార్మికులకు ఇకపై నెలకు రూ.11 వేలు, నగర పంచాయతీల్లో రూ.10 వేల వేతనం అందుతుంది. ఈ పెంపు వల్ల రూ.150 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, మిగిలిన డిమాండ్లను కేబినెట్లో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి యనమల మీడియాతో చెప్పారు.
కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు సమ్మెకాలం 16 రోజులకు వేతనం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. కాగా తమ డిమాండ్లను కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని, వాటిపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోపోతే మళ్లీ ఉద్యమం తప్పదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.