మంత్రులు వివిధ ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది.
సాక్షి, హైదరాబాద్: మంత్రులు వివిధ ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం ఉదయం మెదక్ జిల్లా పటాన్చెరులో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఎంసీహెచ్ఆర్డీలో జరగాల్సిన స్వచ్ఛ హైదరాబాద్ సమీక్ష సమావేశానికి హాజరుకావాలి. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడతారని సీఎంవో కార్యాలయం ముందుగా ప్రకటించింది.
అయితే, స్వచ్ఛ హైదరాబాద్ సమావేశం, మీడియా సమావేశంతో పాటు, కేబినెట్ భేటీ కూడా వాయిదా పడినట్టు వరుస ప్రకటనలు వెలువడ్డాయి. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా కొందరు మంత్రులు జిల్లాల్లో బిజీగా ఉన్నా రు. ఆదివారం ప్రభుత్వం హైదరాబాద్లో అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లలో కొందరు మంత్రులు నిమగ్నమై ఉన్నారు. ఉన్న ఒకరిద్దరు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో చర్చించడంలో బిజీగా ఉన్నారు. వీటిన్నింటికీ తోడు కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతూ సీఎం సచివాలయం వైపు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా పడింది.