అమెరికాలోని తెలుగు యువకుడి ఆచూకీ లభ్యం

Telugu man Available in American  - Sakshi

సైదాబాద్‌: అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న తెలుగు యువకుడి ఆచూకీ లభ్యమైంది. అతడి ఆచూకీ తెలియడం లేదంటూ తల్లిదండ్రులు శుక్రవారం మీడియా ఎదుట వాపోయారు. శనివారం పత్రికలలో ప్రచురితమైన కథనాలు నెట్‌లో చూసిన ఆ యువకుడు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. చంపాపేట సమీపంలోని వినయ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న పండు బంగారం కుమారుడు పి.రాఘవేందర్‌రావు ఆమెరికాలో ఉంటున్నాడు. కుమారుడి కనిపించడం లేదని రాఘవేందర్‌రావు తల్లిదండ్రులు బంగారం, పుష్పలత మీడియా ముందుకొచ్చారు. విషయం తెలుసుకున్న రాఘవేందర్‌రావు శనివారం ఉదయం తల్లిదండ్రులతో వాట్సప్‌  వీడియో కాల్‌ మాట్లాడాడు.

 8నెలల తర్వాత కుమారుడు ఫోన్‌ చేయడంతో వారికి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్‌రావు తన ఆవేదనను తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు. తన ఆఫీస్‌లోనే పనిచేస్తున్న హియాయత్‌నగర్‌కు చెందిన ఒక యువతిని ప్రేమించానని, ఇద్దరం కలిసి సహజీవనం చేశామని వివరించాడు. ఇద్దరు పిల్లలు కూడ పుట్టారని, మనస్పర్థలు రావడంతో ఆ అమ్మాయి తనపై కేసు పెట్టిందని, దీంతో కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయాడు.  

 రెండు నెలలు జైలులో ఉండి, బెయిల్‌పై బయటకు వచ్చానని పేర్కొన్నాడు. దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారన్నాడు. తన వీసా కూడా ఆమె దగ్గరే ఉందని, దీంతో ఇండియాకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడిని ఇండియాకు రప్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top