మైనర్‌ను బలవంతంగా పెళ్లి.. టీచర్‌ సస్పెన్షన్‌

Teacher Married A Minor Girl At Shamshabad - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు బలవంతంగా బాలికను పెళ్లాడిన ఓ కామాంధ టీచర్‌పై వేటు పడింది. పైగా కాపురానికి రావాలని బెదిరింపులకు దిగిన ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సయ్యద్‌ అక్బర్‌ శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక గతంలో ఆయన శిష్యురాలు. ఐదేళ్ల కిందట ఏడో తరగతిలో పాస్‌ చేయిస్తానని ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రస్తుతం పదిహేడేళ్లు ఉన్న ఆ బాలిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. ఎకనామిక్స్‌లో పాస్‌ చేయిస్తానని మరోసారి మాయమాటలు చెప్పి ఆమెను అపహరించాడు. ఆ బాలికను బలవంతంగా గోల్కొండ కోటకు కారులో తీసుకెళ్లి అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

మెడలో పుసుపుతాడు ఉండటంతో తల్లి గుర్తించి నిలదీయగా కీచక టీచర్‌ నిర్వాకం బయటపడింది. అంతేగాక తనను పెళ్లి చేసుకున్నానని, కాపురానికి రావాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు. ఈ సంభాషణ కూడా సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా టీచర్‌ అక్బర్‌పై శుక్రవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్బర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top