ఘట్కేసర్ రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఘట్కేసర్ టౌన్, న్యూస్లైన్: ఘట్కేసర్ రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు శతాబ్దాల కిందట నిర్మించిన రైల్వే స్టేషన్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా పదవులధిష్టించినా.. రైల్వే స్టేషన్ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది. ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలని ఏళ్లనుంచి నాయకులను కోరుతున్నా ఎవరికీ పట్టింపు లేకుండాపోయింది. దీనికంతటికీ కారణం స్థానిక నాయకుల అసమర్థతే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఒకటి, రెండు రైళ్లు మాత్రమే..
ఘట్కేసర్ మండల కేంద్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సంస్కృతి టౌన్షిప్, ఏపీ హౌసింగ్ బోర్డు తదితర వందలాది కాలనీలున్నాయి. ఇన్ఫోసిస్, రహేజ పార్కు లాంటి అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది ఇంజినీరింగ్ కళాశాలలు వెలిశాయి. దీంతో వలసలు పెరిగి సుమారు 3 లక్షల జనాభాకు చేరుకుంది. సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్లో ఒకటి రెండు రైళ్లను మాత్రమే నిలుపుతున్నారు. లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా ఎక్స్ప్రెస్ రైళ్లను మాత్రం నిలపడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి వెళ్లడానికి ఘట్కేసర్ రైల్వేలైను ప్రధానమైనది. ఎక్కడికి వెళ్లాలన్న ప్రయాణికులు 35 కిలోమీటర్ల దూరమున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించవలసిందే. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్లో దిగి ఇళ్లకు రావాల్సివస్తోందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
ఘట్కేసర్ రైల్వే స్టేషలోనే రైళ్లను నిలిపితే సమయం, డబ్బు ఆదా అవుతుందంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో అధిక ధరలను చెల్లించలేక రైలు ప్రయాణంపై మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కేంద్ర మంత్రులుగా పనిచేసినవారు చేసిందేమీలేదంటున్నారు. వారి అసమర్థత, చేతకాని కారణం వల్లనే ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.