వైద్యుల గైర్హాజరుపై మంత్రి ఈటల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం మంది వైద్యులు గైర్హాజర్ అవుతుండటం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పథకాల అమలు, రోగులకు అందుతున్న చికిత్స తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వివిధ వైద్య విభాగాల అధిపతులతో రెండు రోజులపాటు నిర్వహించిన సమీక్ష బుధవారం ముగిసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు గైర్హాజర్ అవుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐరిష్, బయోమెట్రిక్ లేదా కెమెరాల సాయంతో ఆటోమేటిక్ హాజరును అమలుచేయాలని సూచించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా తదితరులు హాజరయ్యారు.