ముందస్తు వేడి! | Early Elections Telangana Assembly Elections Mahabubnagar | Sakshi
Sakshi News home page

ముందస్తు వేడి!

Aug 26 2018 7:51 AM | Updated on Mar 18 2019 9:02 PM

Early Elections Telangana Assembly Elections Mahabubnagar - Sakshi

అసెంబ్లీ భవన

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ వాతావరణం నాయకుల్లో వేడి పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతుండడంతో అధికార పార్టీతో పాటు విపక్షాల్లో సైతం కదలిక మొదలైంది. సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివార్లలో జరిగే ‘ప్రగతి నివేదన’ సభ ద్వారా సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఆశావహులు కూడా అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకొంది. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర (బస్సు యాత్ర)కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ఉత్తర తెలంగాణను పట్టించుకోవడం లేదని, నల్గొండ, మహబూబ్‌నగర్‌ నేతలకే ఏఐసీసీ స్థాయిలో పదవులు దక్కుతూ, ప్రాధాన్యత లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్ర కన్వీనర్‌గా రాష్ట్రమంతటా తిరుగుతున్నా, తనకు పార్టీ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడంపై ఆయన కొంత అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడుగా పేరున్న ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ‘టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చే బీజేపీ మాత్రం ఉమ్మడి జిల్లాలో నానాటికీ తీసుకట్టుగా మారుతోంది. ఒకటి రెండు నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నదే తప్ప ఎన్నికలపై పెద్దగా ఆశలు లేవు. ఇతర పార్టీలు కూడా జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తూ, తమ అధిష్టానాల నిర్ణయం కోసం వేచిచూస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం..
ముందస్తు ఎన్నికల ఊహాగానాలను నిజం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఉమ్మడి జిల్లాలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొత్త ఉత్సాహం ఉరుకలేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఓ నలుగురికి’ తప్ప సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇస్తానని చెప్పిన మాటలతో ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి తమకే సీట్లు ఇస్తారనే ఆశాభావం వారిలో కనిపిస్తోంది. అయితే మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని ఒకటి రెండు సిట్టింగ్‌ సీట్లు మాత్రం తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు మండలాలు పర్యటించే కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం సొంత నియోజకవర్గాలకు తరలివచ్చారు.

అదే సమయంలో సిట్టింగ్‌ స్థానాలను మార్చి తమకు సీట్లు ఇస్తారని భావిస్తున్న ఆశావహులు మాత్రం హైదరాబాద్‌కు మకాం మార్చారు. మంచిర్యాల నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువైంది. కాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దివాకర్‌రావు తనకే సీటు గ్యారంటీ అనే ధీమాతో మండలాల్లో గ్రామాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ బస్సుయాత్ర ద్వారా మంచిర్యాలకు రాగా, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్టు ఆశిస్తున్న బేర సత్యనారాయణ యాత్ర వెంటే ఉండడం గమనార్హం. ఖానాపూర్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ స్థానంలో సీటు కోసం మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌లను కాదని టిక్కెట్లు ఆశించే నాయకులు లేకపోవడం గమనార్హం.
 
చర్చనీయాంశమైన     మహేశ్వర్‌రెడ్డి రాజీనామా!
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలమైన నాయకుల్లో ఒకరిగా ఉన్న బస్సు యాత్ర కన్వీనర్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి పోటీ చేయడం ఖాయం. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కనీసం ఐదు చోట్ల తాను సూచించిన వారికే టిక్కెట్లు వస్తాయని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉన్న ఆయన బస్సుయాత్ర నిర్వహణ కోసం చాలా శ్రమించారు. అయితే ఏఐసీసీ ఇటీవల ప్రకటించిన పదవుల్లో ఉత్తర తెలంగాణకు ఒక్కటీ రాలేదు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇచ్చే ప్రాధాన్యతతో ఇసుమంతైనా ఆదిలాబాద్‌కు ఇవ్వడం లేదని భావించిన ఆయన శనివారం బస్సు యాత్ర కన్వీనర్‌ పదవికి రాజీనామా చేశారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరేయడమే లక్ష్యంగా పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పర్యటిస్తే ఆది లాబాద్‌లో పార్టీ బలహీనపడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ‘సాక్షి’తో చెప్పా రు. ప్రాధాన్యత లేని రాష్ట్ర పదవుల్లో ఉండడం కన్నా ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పేందుకు, తన మనుషులకు టికెట్లు ఇప్పించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు జిల్లాలో వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వర్గం కూడా తమ బలాన్ని పెంచుకునే పనిలో పడింది.
 
కోలుకోలేక పోతున్న బీజేపీ
‘ముందస్తు ఎన్నికలైనా... వెనుకొచ్చే ఎన్నికలైనా మేం చేసేదేం లేదులే’ అనే దోరణిలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీకి బలగం ఉన్నప్పటికీ, వారిని ఎన్నికల దిశగా నడిపించే నాయకులు లేకుండా పోవడం దురదృష్టకరం. మంచిర్యాలలో ముల్కల్ల మల్లారెడ్డి, ముధోల్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన రమాదేవి, బెల్లంపల్లిలో కొయ్యల ఏమాజీ మాత్రమే తమ నియోజకవర్గాల్లో కొంత మేర ప్రభావం చూపగలుగుతున్నారు. మిగతా సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేసేందుకు పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మిగతా పార్టీల నాయకులు నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత చూద్దాంలే అనే దోరణితో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement