మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో శుక్రవారం అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
రంగారెడ్డి(మొయినాబాద్): మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో శుక్రవారం అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వివరాలు..గ్రామానికి చెందిన ఓ బాలిక (16) పదో తరగతి పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంటోంది. కుటుంబీకులు ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్(22)తో శుక్రవారం వివాహ ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.49 గంటలకు ముహూర్తం ఉంది. వంటలు పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. విశ్వసనీయ సమాచారంతో సీఐ రవిచంద్ర సిబ్బందితో గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలిపివేయించారు.
బాల్య వివాహం చేస్తే ఇరు కుటుంబాల వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇరు కుటుంబాల పెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. దీంతో వివాహ ఏర్పాట్లను పెద్దలు నిలిపివేశారు. అమ్మాయికి మైనారిటీ తీరాకే వివాహం చేస్తామని కుటుంబీకులు పోలీసులకు హామీ ఇచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.