‘కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలనుకుంటున్నారు’

BV Raghavulu Comments On Marriages - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదర్శ వివాహాలు సమాజంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు దోహదం చేస్తాయన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఏకైక కుమర్తె శిరీష, టీ 10 సీఈఓ ఎం.శ్రీనివాస్‌ల ఆదర్శ వివాహం జరిగింది.

ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. యువతలో వస్తున్న మార్పును స్వాగతిస్తున్నామని, మన దేశంలో కట్నాలు పెరిగిపోయాయని, కొంత మంది తమ బ్లాక్‌ మనీని పెళ్లిల్లో ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే, కట్నం లేకుండా వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. భార్యాభర్తలు సమానంగా ఉన్నప్పుడే అది ఆదర్శ వివాహం అవుతుందన్నారు. నేడు ఆడపిల్లలు కమ్యూనిస్టు కుటుంబాల్లో పుట్టాలని కోరుకుంటున్నారని, ఇక్కడే కూతురు, కొడుకులను సమానంగా చూస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆదిరెడ్డి, కార్పొరేటర్‌ ముఠా పద్మ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top